- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- 269కి పెరగనున్న క్యాంటీన్ల సంఖ్య
- ఇప్పటికే 207 క్యాంటీన్ల ద్వారా నిత్యం 2.10 లక్షల మందికి భోజనం
- 15న ధరణికోటలో అన్న క్యాంటీన్ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): కార్మికులు, కూలీలు, గ్రామీణులు వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చే ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న సంకల్పంతో 207 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన ప్రజా ప్రభుత్వం… తాజాగా మరికొన్ని అన్న క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకొస్తోంది. రూ.5లకే పేదలకు కడుపునిండా నాణ్యమైన భోజనాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈ సేవలను గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తామని చెప్పిన సర్కార్… ఆ హామీని ఆచరణలో పెడుతోంది. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 204 అన్న క్యాంటీన్లను కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయగా.. 3 క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 62 క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రెండవ విడత అన్న క్యాంటీన్లను ఈనెల 15న ముఖ్యమంత్రి చంద్రబాబు పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో ప్రారంభిస్తారు
రూ.5లతో రుచిగా… శుచిగా ఆహారం
గత ప్రభుత్వం కక్షగట్టి మూసివేసిన అన్న క్యాంటీన్లను కూటమి అధికారంలోకి వచ్చాక పున:ప్రారంభించింది. ఈనెల 15న ప్రారంభించబోయే 62 క్యాంటీన్లతో ఈ సంఖ్య 269కి చేరుతుంది. రుచి, శుచితో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని పేదలకు ప్రభుత్వం అందిస్తోంది. క్యాంటీన్ల పున:ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా పేదలు 8.80 కోట్ల భోజనాలు చేశారు. ఒక్కో అన్న క్యాంటీన్లో సగటున రోజుకు 1,013మంది చేసే భోజనాలకు రూ.26,250 ఖర్చు అవుతోంది. 207 అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకు 2.10 లక్షలమంది భోజనాలు చేస్తున్నారు. ఇందుకు రోజుకు రూ.54 లక్షలకు పైగా వ్యయం అవుతుండగా… సబ్సిడీ కోసం ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.243 కోట్లు వెచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసే గ్రామీణ అన్న కాంటీన్ల సబ్సీడీకి ఏడాదికి రూ.58 కోట్లు వ్యయం అవ్వనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వివరాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12.40 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి ఒంటిగంటకు ధరణికోటకు చేరుకుంటారు. 1.30 గంటలకు అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి భోజనం చేస్తారు. కార్యక్రమాన్ని ముగించుకుని 2.45 గంటలకు ఉండవల్లికి చేరుకుంటారు.















