- ఇండి కూటమి నిర్వాకంతో దక్షిణాదికి తీరని నష్టం
- డీఎంకే పాలనలో తమిళనాడు అభివృద్ధి కుంటుపడింది
- డబులింజన్ సర్కార్తోనే తమిళనాడు అభివృద్ధి సాధ్యం
- నదుల అనుసంధానం జరిగితే తమిళనాడుకూ లబ్ధి
- జయలలిత పాలన కోసం ఎన్డీయేను గెలిపించాలి
- కోయంబత్తూరు ఎన్నికల సభలో ఏపీ సీఎం పిలుపు
- తమిళనాడులో రెండురోజుల ఎన్నికల పర్యటన
- తన ప్రసంగంలో తమిళంతో ఆకట్టుకున్న చంద్రబాబు
తమిళనాడు/ కోయంబత్తూరు (చైతన్య రథం) మహిళా రిజర్వేషన్ బిల్లుకు డీఎంకే వ్యతిరేకంగా ఓటేసి మహిళలకు తీరని అన్యాయం చేసిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసి మహిళలకు… డీలిమిటేషన్ బిల్లును అడ్డుకుని దక్షిణాది రాష్ట్రాలకు కాంగ్రెస్, డీఎంకే సహా ఇండి కూటమి పార్టీలు పెద్దఎత్తున నష్టాన్ని కలిగించాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మంచి ఉద్దేశ్యంతో తెచ్చిన బిల్లులను అడ్డుకోవడం ద్వారా ఇండి కూటమి పార్టీలు చేసిన తప్పిదాన్ని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని అన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభ్యర్థుల తరపున రెండు రోజులపాటు ప్రచారం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సోమవారంనుంచి తమిళనాడులో పర్యటిస్తున్నారు. అమరావతి నుంచి నేరుగా తమిళనాడులోని కోయంబత్తూరుకు చేరుకున్నారు. అక్కడ ఓ ప్రయివేట్ హోటల్లో కోయంబత్తూర్ నగరంలోని వివిధ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో సీఎం సమావేశమయ్యారు. సమావేశానికి కోయంబత్తూరులోని వివిధ నియోజకవర్గాలనుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్ధులు హాజర్యయారు.
కోయంబత్తూరు నార్త్నుంచి పోటీ చేస్తున్న వానతి శ్రీనివాసన్, కోయంబత్తూరు సౌత్నుంచి పోటీ చేస్తున్న అమ్మన్ కే.అర్జున్, సింగనల్లూర్నుంచి పోటీ చేస్తున్న కేఆర్ జయరామన్, కౌండంపాలాయం నుంచి పోటీ చేస్తున్న అరుణ్కుమార్, సూలూర్నుంచి పోటీ చేస్తున్న కందస్వామి సమావేశానికి హజరయ్యారు. ఎన్డీఏ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. తమిళనాడుతో ఏపీకి… ఎన్టీఆర్కు, తనకు ఉన్న అనుబంధాన్ని సమావేశంలో వివరించారు. ఎన్టీఆర్ హయాంలోనే తెలుగు గంగ ద్వారా చెన్నైకు నీరిచ్చామని… నదుల అనుసంధానం జరిగితే… గోదావరి నీళ్లను తమిళనాడుకు ఇవ్వవొచ్చని సీఎం చంద్రబాబు చెప్పారు. నదుల అనుసంధానానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని… ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్వల్లే అభివృద్ధి జరుగుతోందని, పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయని సీఎం చంద్రబాబు వివరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లును అడ్డుకుని డీఎంకే సహా ఇండీ కూటమి భాగస్వామ్య పక్షాలు తప్పు చేశాయన్నారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగేదని చెప్పారు. డీఎంకే సహా ఇండి కూటమి తీసుకున్న తప్పుడు నిర్ణయంవల్ల మహిళలకు, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత మీడియా సమావేశంలోనూ వివిధ అంశాలపై స్పందించారు.
మనమంతా ద్రవిడులం
తమిళనాడు.. ఆంధ్రప్రదేశ్ వేర్వేరు రాష్ట్రాలు అయినా… మూలాలు ఒకటేనని… అందరదీ ద్రవిడ సంస్కృతేనని సీఎం చంద్రబాబు అన్నారు. పాండ్యులు, చోళులు పాలించిన నేల తమిళనాడు. అత్యంత ప్రాచీన భాష తమిళమని అన్నారు. “తల్లి భాషను తమిళులు ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరు. కోయంబత్తూరు అత్యంత ప్రముఖ వాణిజ్య, పారిశ్రామిక కేంద్రం. క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే మనస్తత్వమే తమిళ సోదరుల విజయరహస్యం. ఏ రంగంలోనైనా తమిళ సోదరులు విజయం సాధిస్తారు. సుబ్రమణ్య భారతి, కణ్ణగి, తిరువళ్లవర్, సీవీ రామన్, అబ్దుల్ కలాం ఆజాద్లాంటి ఎంతో మంది ప్రముఖులు ఈ గడ్డనుంచే వచ్చారు. ఇక్కడ ఉన్నంత సుందరమైన పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఇంకెక్కడా లేవు. రామేశ్వరం, తంజావూరు, అరుణాచలంలాంటి దివ్యక్షేత్రాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడానికి కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీనే ఏర్పాటు చేశాం. తమిళనాడుతో తెలుగు వారికి మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. ఈ గడ్డపైనుంచే ఎన్డీఆర్ ఓ మహానాయకుడిగా ఎదిగారు. ఎన్టీఆర్ -ఎంజీఆర్ మధ్య మంచి స్నేహం ఉంది. నా వివాహం కూడా చెన్నైలోనే అయ్యింది” అని చంద్రబాబు అన్నారు.
కీలక బిల్లులను అడ్డుకుని డీఎంకే తప్పు చేసింది
“తమిళనాడుకు నీటిని తీసుకురావడానికి ఎన్టీఆర్ తెలుగుగంగ ప్రాజెక్టును తీసుకువచ్చారు. నేను ప్రాతినిధ్యం వహించే కుప్పంలోనూ తమిళం మాట్లాడే వారే ఉన్నారు. జాతీయ రహదారులు అనుసంధానం అయినట్టే గంగ- కావేరి నదులు అనుసంధానం కావాలి. నీటి భద్రతవస్తే దేశానికి శ్రీరామ రక్ష అవుతుంది. ముందుగా రాష్ట్రాల్లో అంతర్గతంగా నదులు కలిపితే… దేశంలో ఇతర నదుల అనుసంధానం జరుగుతుంది. గోదావరి-కావేరీ నదులు అనుసంధానమైతే ఆ తర్వాత క్రమంగా మిగతా నీటీ వనరులు కలిసే అవకాశం ఉంటుంది. శ్రీలంకలోనూ తమిళులు కాంగ్రెస్ కారణంగా ఇబ్బందులు పడ్డారు. అన్నాడీఎంకే అంటే గుర్తు వచ్చేది జయలలితే. మళ్లీ గెలిచేది ఏఐఏడీఎంకే- బీజేపీ కూటమే. 33 శాతం రిజర్వేషన్లను మహిళలకు ఇవ్వాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. కానీ డీఎంకే, టీఎంసీ, కాంగ్రెస్లాంటి పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించాయి. మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవటం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని డీఎంకే మహిళలకు ద్రోహం చేసింది. మహిళల ప్రాతినిధ్యం కోసం అదనంగా సీట్లు పెంచే ప్రయత్నం జరిగింది. మహిళలకు సీట్లు పెరిగితే ఇండి కూటమికి ఎందుకు అడ్డుకుందోననేది ప్రజలంతా ఆలోచించాలి. మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు వ్యతిరేకించిందో డీఎంకే సమాధానం చెప్పాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చాలా కాలంగా నాలాంటి వ్యక్తులు పోరాడుతున్నారు.
2029 ఎన్నికలకే ఈ రిజర్వేషన్ అమలు కావాలని ప్రధాని మోదీ భావించారు. గడచిన 30 ఏళ్లుగా మహిళలు తమకు 33 శాతం రిజర్వేషన్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో రిజర్వేషన్ బిల్లు తీసుకువస్తే కాంగ్రెస్ వ్యతిరేకించింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించటం అనేది దేశానికి ఓ ప్రగతిశీల విధానం. దీనిని అడ్డుకోవటం ద్వారా కాంగ్రెస్ మహిళా సాధికారితను అడ్డుకుంది. ఇండి కూటమి పార్టీలు మహిళలకు సమాధానం చెప్పాలి. దేశంలో సగం జనాభా మహిళలే. ఈ విషయాన్ని ఇండి కూటమి పార్టీలు ఎందుకు గుర్తించటం లేదు..? మహిళా బిల్లు వీగిపోయేలా చేసిన ఇండి కూటమి ఎన్డీఏ ఓడించలేదు. మహిళలను ఓడించింది. రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్న మహిళల్ని డీఎంకేవంటి పార్టీలు నిరాశ పరిచాయి. కాంగ్రెస్ -డీఎంకే రాజకీయాల కారణంగా మహిళలు ఓడిపోయారు. మహిళలకు రిజర్వేషన్లు అవసరం లేదని డీఎంకే కోరుతోందా…? దక్షిణ భారతదేశానికి డీలిమిటేషన్లో సీట్లు పెరగవని అపోహ సృష్టించారు. కనీసం 50శాతం మేర సీట్లు పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన వాటాను రాకుండా డీఎంకే అడ్డుకుంది. 50 శాతం సీట్లు పెరుగుతాయని స్పష్టంగా చెబుతుంటే ఇబ్బంది ఏమిటి..? గతంలో జనాభా లెక్కల ప్రాతిపదికనే డీలిమిటేషన్ ప్రక్రియ చోటుచేసుకుంది. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లువల్ల తమిళనాడు, ఏపీ, కేరళ, తెలంగాణ, కర్ణాటకలాంటి రాష్ట్రాలకు సీట్లు పెరిగి ఉండేవి. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగాలని డీఎంకే కోరుకుంటోందా..? 2027 సెన్సెస్ ప్రకారం చేస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. కొన్ని పార్టీలు సంస్కరణలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. డీఎంకే తీసుకున్న నిర్ణయంవల్ల మహిళలు నష్ట పోయారు. దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయాయి” అని ఏపీ సీఎం వివరించారు.
ఎన్డీఏతోనే తమిళనాడుకు పూర్వవైభవం
“గతంలో తమిళనాడు ఓ బలమైన ఆర్ధిక వ్యవస్థ. ఇప్పుడు పరిస్థితి ఏమిటన్నది తమిళ ప్రజలే అంచనా వేయాలి. తమిళనాడుకు పూర్వవైభవం రావాలంటే ఎన్డీఏ అభ్యర్థులకే ఓటు వేయాలి. ఐదేళ్లఏళ్లపాటు మేం అధికారంలో లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓ పార్టీ విధ్వంసం చేసింది. 2024లో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది… 22 నెలల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం. గడచిన ఐదేళ్లుగా చెన్నై అభివృద్ధి ఆగిపోయింది. తమిళ ప్రజలకు ప్రయోజనాలు అందటం లేదు. సంస్కరణలతో ముందుకు వెళ్తేనే భవిష్యత్తు ఉంటుంది. దేశంలోకి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం చేయూతతోనే అభివృద్ధి, పెట్టుబడులు సాధించగలుగుతున్నాం. 15 బిలియన్ డాలర్లతో గూగుల్ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది. క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. కేంద్రం సహకరిస్తున్నా డీఎంకే దానిని వినియోగించుకోవటం లేదు. తమిళనాడుకు అప్పులు పెరిగాయి… యువత డ్రగ్స్ బారిన పడుతున్నారు. తమిళనాడులో చాలా కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. డీఎంకే హయాంలో నేరాల రేటు బాగా పెరిగిపోయింది. తమిళ ప్రజల మధ్య విబేధాలు, విద్వేషాలను తీసుకువచ్చారు. తమిళనాడుకు కేంద్రం లక్షల కోట్ల రూపాయలను అందించింది. సాగర్మాల కింద రూ.93 వేల కోట్లను వ్యయం చేశారు. ఎన్డీఏలో భాగస్వామిగా చాలా కాలంగా పనిచేస్తున్నాం… సరైన సమయంలో సరైన నేతగా ప్రధాని మోదీ ఉన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్ధిక వ్యవస్థగా భారత్ ఉంది. గతంలో చెన్నై ఉమ్మడి రాజధానిగా ఏపీ తమిళనాడు కలిసే ఉన్నాయి. ఇప్పుడు చెన్నై వెనుకపడిపోయింది. జయలలిత స్థాపించిన ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలవాలి. అభివృద్ధి సాధించాలి. అభివృద్ధికి సహకారం అందించాలని ప్రజలందరినీ కోరుతున్నాను. జాతి ప్రయోజనాల కోసం, జాతి నిర్మాణం కోసం ఎన్డీఏ గెలవాలి. డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తే ప్రగతి అంటే ఏమిటో మీరే చూస్తారు” అని ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి తమిళనాడు పర్యటనలో కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, తమిళనాడుకు చెందిన బీజేపీ, అన్నాడీఎంకే సహా ఎన్డీఏ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.
తమిళ పదాలతో సీఎం చంద్రబాబు ప్రసంగం
కోయంబత్తూరులో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగంలో మధ్య మధ్యలో తమిళ పదాలను ఉపయోగించారు. తమిళంలో కొన్ని పదాలు వాడారు. అనైవరుక్కుం వణక్కం… ఎన్ అన్బాన తమిళ్ నాడు మక్కళే, ఉంగళుడన్ ఎన్ పిరందనాళ్లిల్ ఇంగే ఇరుప్పదు రొంబవే సంతోషం.(అందరికీ నమస్కారం… నా ప్రియమైన తమిళనాడు ప్రజలారా, నా పుట్టినరోజు రోజున మీతో ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది.) అంటూ తన పుట్టిన రోజున తమిళనాడుకు రావడం సంతోషంగా ఉందంటూ తమిళ భాషలో చెప్పారు. అలాగే మున్నేట్రం వేణ్డుమా… వేలైవాయుప్ప గళ్ వేణ్డుమా… అప్పడియానాల్ మధ్యతిల్ మోదీజీ ఇరుక్క వేణ్డుం… మానిలతిల్ అమ్మ ఆట్చి వర వేణ్డుం. ఇదుక్కు చీణA కూట్టణియై వెట్రి పెర చేయ్యుంగల్..(మీకు అభివృద్ధి కావాలా… ఉద్యోగ అవకాశాలు కావాలా? అలా అయితే కేంద్రంలో మోదీజీ ఉండాలి. రాష్ట్రంలో అమ్మ జయలలిత పాలన రావాలి. అందుకోసం ఎన్డీయే కూటమికి విజయం చేకూర్చండి.) అంటూ జయలలితను గుర్తు చేస్తూ తమిళ భాషలో ప్రసంగించారు. గతంలో వివిధ సందర్భాల్లో చంద్రబాబు తమిళనాడులో ప్రచారం చేసినా… ఈ స్థాయిలో తమిళంలో కామెంట్లు ఎప్పుడూ చేయలేదు. కానీ ఈసారి తమిళ భాషలో కొన్ని వ్యాఖ్యలు చేసి తమిళ ప్రజలను సీఎం చంద్రబాబు ఆకట్టుకున్నారు.















