- ‘పేదల సేవ’ వేదికగా ఆ పార్టీ కుట్రలు, కుతంత్రాలను ఎండగట్టిన ముఖ్యమంత్రి
- సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వానికి సాటి లేదు
- ఇప్పటి వరకు రూ.65,887 కోట్లమేర పెన్షన్ల పంపిణీ
- ‘పీఎం సేతు’ ద్వారా ఏపీ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ
- విశాఖ రైల్వే జోన్తో రాష్ట్ర ప్రజల కల సాకారం
- కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరం పర్యటనలో చంద్రబాబు
తుని (చైతన్యరథం): కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలనా యజ్ఞం చేస్తుంటే వైసీపీ నేతలు రాక్షసుల్లా ఆటంకం కలిగిస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో విద్వేషాలు రగిల్చేందుకు వైసీపీ అడుగడుగునా కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని, ఈ అంశాన్ని గుర్తించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన కొన్ని ఘటనల్ని ప్రస్తావిస్తూ వైసీపీ నేతల డ్రామాలను ఎండగట్టారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో సోమవారం జరిగిన ‘పేదల సేవలో’ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి
సీఎం హాజరయ్యారు. ప్రజా వేదిక సభకు హాజరై ప్రసంగించిన ఆయన వైసీపీ చేస్తున్న కుట్రలను ప్రజల ముందుంచారు. ఆ పార్టీ నేతలు ఫ్రస్ట్రేషన్తో ప్రతి అంశాన్నీ వివాదం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ….
“గత పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు రాత్రీ పగలూ శ్రమిస్తున్నాం. అయినా వైసీపీ ఇంకా విధ్వంసాన్ని కొనసాగిస్తోంది. సుపరిపాలన చూసి ఓర్వలేక గొడ్డలి పార్టీ కుట్రలు కుతంత్రాలు చేస్తోంది. వివేకానంద రెడ్డిని హత్యచేసి తొలుత గుండెపోటు అన్నారు. గొడ్డలితో నరికి చంపి డ్రామాలు ఆడారు. ఒక్క ఛాన్స్ అని మోసం చేసి కోడికత్తి, గులకరాయి నాటకాలు వేశారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనల్ని ప్రజలు తెలుసుకోవాలి. పాలన వైకుంఠపాళి కాకూడదన్నదే మా విజ్ఞప్తి. గత పాలకులు ఐదేళ్ల పాటు ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. కూటమి అధికారంలోకి వచ్చాకే 241 కోర్టు కేసులు పరిష్కరించాకే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. గతంలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఎగ్గొట్టారు. మేం వచ్చాకే జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. అత్యంత పటిష్టంగా టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాం. కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఎంపిక ప్రక్రియ జరిగింది. 40 వేల ప్రశ్నలు, 25 రకాల ప్రశ్నపత్రాలతో ఎక్కడా అక్రమాలు జరగకుండా భర్తీ ప్రక్రియ నిర్వహించాం. ఫ్రస్టేషన్లో ఉన్న వైసీపీ దీనిని కూడా వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన చేసింది. సమాజంలో అశాంతి రేపాలని ప్రయత్నాలు జరిగాయి.
జాగ్రత్తగా ఉండబట్టే గట్టిగా సమాధానం ఇవ్వగలిగాం. పరామర్శలకు వెళ్తూ సొంత కార్యకర్త సింగయ్యను కారు కింద తొక్కి చంపి పొదల్లోకి విసిరేసి పోయారు. కడపకు చెందిన ఓ పాస్టర్ను పంపి హత్యాయత్నం అంటూ డ్రామాలు ఆడారు. దానిని మా పార్టీపై నెట్టేందుకు ప్రయత్నించారు. పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగి మోటారు సైకిల్ నడుపుతూ ప్రమాదంలో చనిపోతే దానిని కూడా మాకు అంటగట్టాలని ప్రయత్నాలు జరిగాయి. సీసీ కెమెరాల సాయంతో ఈ కుట్రలను బట్టబయలు చేయగలిగాం. తిరుమలలోని కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర సాక్షి మీడియా ప్రతినిధులే మద్యం బాటిళ్లను పారేసి అపవిత్రం చేసేందుకు ప్రయత్నం చేశారు. సాక్షాత్తూ కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాజ్జేసేందుకు ప్రయత్నం చేసిన వారిని ఏమనాలి. వారిది వేరే మతం కావొచ్చు. దానికి మేం తప్పు పట్టడం లేదు. కానీ కుట్రలతో హిందూ దేవాలయాలపై దాడులు, అపవిత్రం చేసే కుట్రలు సరికాదని హెచ్చరిస్తున్నాను. కడపలో పెద్ద దస్తగిరిని వైసీపీ వారే ఆస్తుల వివాదంలో హత్య చేసి టీడీపీ వారిపై నెట్టేందుకు ప్రయత్నం చేశారు. నంద్యాలలో రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తే. వైసీపీ వాళ్లు ధ్వంసం చేశారు కాబట్టే సాక్షి పత్రికలో ఆ వార్త రాయలేదు. కాకినాడలోనే వైసీపీ ఎమ్మెల్సీ దళితుడైన డ్రైవరు చంపి డోర్ డెలివరీ చేశారు. కానీ వైసీపీ ఆ ఎమ్మెల్సీకి సన్మానాలు చేసింది. రాజకీయ పార్టీగా ఈ తప్పిదాలు సరిచేసుకోకుండా ఎదురుదాడి చేస్తున్నారు. కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్నవారి ఆటలు సాగనీయం’ అని స్పష్టం చేశారు.
రెండేళ్ల విధ్వంసం నుంచి ప్రజలకు విముక్తి
“విధ్వంసం నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగిన రోజుగా జూన్ 4 తేదీ చరిత్రలో నిలిచిపోతుంది. గత పాలన అంతా విధ్వంసకరమే. బహిరంగంగా నవ్వాలని అనుకున్నా ప్రజలంతా భయపడే పరిస్థితి. ప్రజలు వెళ్లి పోకుండా కందకాలు తవ్వి, ఫెన్సింగ్లు వేసి మరీ సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచి పేదల కోసం పనిచేస్తున్నాం. దానికి నిదర్శనం పింఛన్ల పెంపు. రూ.10లక్షల కోట్ల అప్పులు, బకాయిలు ఉన్నా… పెన్షన్లు ఒకేసారి రూ.1,000 పెంచి రూ.4 వేలు చేశాం. దివ్యాంగులకు రూ.6వేలు చేశాం. హెల్త్ పెన్షన్లు రూ.10 వేలకు, రూ.15 వేలకు పెంచాం. 2024 జూలై నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.65,887 కోట్లు ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ల రూపంలో అందించాం. ఏడాదికి దాదాపు రూ.32వేల కోట్లు ఈ ఒక్క పథకానికే ఖర్చు పెడుతున్నాం. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో, ఇంత ఎక్కువ మందికి పింఛన్లు ఇవ్వట్లేదు.
బటన్ నొక్కితే పైశాచిక ఆనందం ఉంటుంది తప్ప ప్రజలను
కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకునే పరిస్థితి ఉండదు. అందుకే ప్రతినెలా ఒకటో తేదీనే ప్రజలను నేరుగా కలుసుకుని పెన్షన్లు అందిస్తున్నాం. రాష్ట్రంలో 62.34 లక్షల మందికి రూ.2,729 కోట్లు పెన్షన్ల రూపంలో పంపిణీ చేస్తున్నాం. ఈనెల కొత్తగా మరో 5,606 మందికి రూ.2.24 కోట్లు స్పౌజ్ పెన్షన్ల కోసం మంజూరు చేశాం. రాష్ట్రంలో చాలా మంది పేద కుటుంబాలకు 2-4 సంక్షేమ పథకాలు అందుతున్నాయి. తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, ఆటోడ్రైవర్ సేవలో, మత్స్యకారుల సేవలో… ఇలా వేర్వేరు పథకాలు వస్తున్నాయి. ఈ పథకాలతో పేదల జీవన ప్రమాణాలు పెంచాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించేలా చర్యలు చేపట్టాం.
23 నెలల్లో 23లక్షల కోట్ల పెట్టుబడులతో 23 లక్షల ఉద్యోగాలు కూడా మన యువతకు వస్తాయి. మన రాష్ట్ర యువత ఎవరూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా పరిశ్రమలు తెస్తున్నాం. కాకినాడ సమీపంలో రూ.80వేల కోట్లతో గ్రీన్ అమ్మోనియో పరిశ్రమ ఏర్పాటు కానుంది. తుని పక్కన్నే అనకాపల్లి వద్ద ఆర్సెలార్ మిట్టల్ ఓ స్టీల్ సిటీ ఏర్పాటు చేస్తోంది. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తోంది. యువత ఈ అవకాశాలను వినియోగించుకోవాలని కోరుతున్నాం. ‘పీఎం సేతు’ పథకం యువతకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. ఏడాదికి 25 వేల మంది యువతకు శిక్షణ ఇస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర సహకారంతో తిరిగి పునరుద్ధరించాం. అలాగే విశాఖ రైల్వే జోన్ కల కూడా సాకారమైంది.” అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఏపీ
“పేదలకు విద్య, వైద్యంలో అత్యంత నాణ్యమైన సేవలు అందించేలా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్య కోసం పాఠశాలల్లో సంస్కరణలు తీసుకొచ్చాం. పాఠ్యాంశాలు మారుతున్నాయి. నాణ్యమైన విద్యనందిస్తాం. ఖరీదైన వైద్యం కోసం అప్పులు చేయకుండా యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా తీసుకొస్తున్నాం. సంజీవని పేరిట వ్యక్తిగత ఆరోగ్యం కోసం డిజిటల్ హెల్త్ రికార్డులను రూపొందించి పర్యవేక్షిస్తాం. మెరుగైన జీవితాన్ని ప్రజలకు అందించేలా ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానంలో సంజీవని అమలు చేస్తాం. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది జూన్లో యోగాంధ్రను అమరావతిలో నిర్వహిస్తున్నాం. 14 రోజులు జరిగే యోగాలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిస్తున్నాను. వ్యాయామం, యోగా, మెడిటేషన్ లాంటివి చేసి మన ఆరోగ్యాన్ని మనమే పరిరక్షించుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ను ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేలా 2047 స్వర్ణాంధ్ర విజన్ రూపొందించాం. ప్రజలకు ప్రతి పౌర సేవను సక్రమంగా, నాణ్యంగా అందించాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. శ్రీకాకుళం నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి వరకు విశాఖ రీజియన్, పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం వరకు అమరావతి రీజియన్గా, తిరుపతి కేంద్రంగా రాయలసీమ రీజియన్ ను అభివృద్ధి చేస్తున్నాం. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మనపై పడింది. ఈసారి ఎల్సినో కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉంది. దీనికి మనమంతా సన్నద్ధం కావాలి. సమర్ధ నీటి నిర్వహణతో ముందుగానే కాలువలకు నీళ్లు ఇవ్వగలిగాం. 2027 గోదావరి పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఏడాది జూలైలోగా పోలవరం ఎడమ కాలువ పూర్తి చేసి విశాఖ వరకూ నీరు తీసుకెళ్తాం. మత్స్యకార మహిళలకు సీవీడ్ ద్వారా అదనపు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు చేస్తున్నాం. మన మత్స్యకారులకు రూ.240 కోట్లతో 200 మెకనైజ్డ్ బోట్లు సబ్సిడీపై అందిస్తాం. అమీనాబాద్ ఫిషింగ్ హార్బర్ కోసం రూ.80 కోట్లు మంజూరు చేసి పనులు పూర్తి చేస్తాం” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఆర్థిక అసమానతలు తగ్గించేందుకే పీ4
కాకినాడ జిల్లాలో పౌరసేవలను సంతృప్తిగా అందించిన ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజలకు సేవలు అందించాలని ఆయన సూచించారు. పేదల సేవలో (పీ4) కార్యక్రమంలో భాగంగా మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో సీఎం మాట్లాడారు. పేదరికం లేని సమాజాన్ని తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నామన్నారు. బంగారు కుటుంబాల్లో వ్యక్తులు విద్యాధికులుగా, ఆదాయం ఆర్జించేవారిగా మారాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. అనంతరం సభా వేదిక వద్ద తన అభిమాని అయిన దివ్యాంగ యువకుడిని ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరించారు. అతని భుజంపై చేయి వేసి ఫొటో దిగారు. ప్రభుత్వం తరపున ఆ దివ్యాంగ యువకుడికి సహకారం అందించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ను సీఎం ఆదేశించారు. ప్రజా వేదిక సమీపంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను చంద్రబాబు సందర్శించారు. తూర్పు గోదావరి జిల్లాలో వ్యవసాయ ఉద్యాన పంటల సాగు మైక్రో న్యూట్రియంట్స్ తో పాటు ప్రకృతి సేద్యం దిశగా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఇన్చార్జి మంత్రి పి.నారాయణ, తుని ఎమ్మెల్యే యనమల దివ్య, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.















