కోల్కతా (చైతన్య రథం): హిమాద్రి కెమికల్స్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ అనురాగ్ చౌదరితో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ కోల్కతాలో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… “దక్షిణ భారతదేశంలోని ఈవీ తయారీ కారిడార్లకు ఆంధ్రప్రదేశ్ను కీలక సరఫరాదారుగా నిలబెట్టాలనేది మా సంకల్పం. నెల్లూరు లేదా చిత్తూరు ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లలో హిమాద్రి ఫేజ్ `2 క్లీన్-టెక్ లేదా సిలికాన్-కార్బన్ యానోడ్ యూనిట్ ఏర్పాటు చేయండి. హిమాద్రి అంతర్గత ఆర్ అండ్ డి కేంద్రం సాంకేతికత ఆధారంగా అమరావతిలో ఐఐటి తిరుపతి లేదా ఆంధ్రా యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఒక అధునాతన మెటీరియల్ ల్యాబ్ను ఏర్పాటు చేయండి. రాష్ట్రంలోని దేశీయ పాలిమర్, రబ్బరు, పెయింట్ తయారీ రంగాలకు సరఫరా చేసేందుకు, ఇప్పటికే విశాఖపట్నంలో ప్రాంతీయ కేంద్రాన్ని నిర్వహిస్తున్న హిమాద్రి… స్థానికంగా తన స్పెషాలిటీ బ్లాక్ కార్బన్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ సిఎండి అనురాగ్ చౌదరి మాట్లాడుతూ… తమ సంస్థ భారతదేశంలో అతిపెద్ద స్పెషాలిటీ కార్బన్ బ్లాక్ మేకర్గా ఉందన్నారు. తమకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా విశాఖపట్నంతో సహా 7 మ్యానుఫాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు.















