- టీచర్లు చెప్పిన సింగపూర్ యాత్రా పాఠాలు
- క్రమశిక్షణే వాళ్లను ఆ స్థాయికి చేర్చింది..
- ప్రతిభ చూపితేనే హైస్కూలులో మంచిసీటు
- సీనియర్ టీచర్లు జూనియర్లకు గైడ్ చేస్తారు
- మంత్రి లోకేష్కు ఆసక్తికరమైన స్టడీ నివేదిక
- టీచర్ల గౌరవాన్ని పెంచారంటూ కృతజ్ఞతలు
అమరావతి (చైతన్య రథం): సింగపూర్లో అత్యంత విజ్ఞానవంతమైన, క్రమశిక్షణతో కూడిన విద్యావిధానం అమలులో ఉండటంవల్ల అక్కడ విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు కూడా బాధ్యాతాయుతంగా వ్యవహరిస్తున్నారని సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లిన ఉత్తమ ఉపాధ్యాయులు మంత్రి లోకేష్కు నివేదించారు. సింగపూర్ టూర్కు వెళ్లిన ఉత్తమ ఉపాధ్యాయులతో మంత్రి లోకేష్ నిర్వహించిన సమావేశంలో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. అక్కడ ఉపాధ్యాయులు వారానికోసారి నిర్వహించుకునే సమావేశంలో సబ్జెక్ట్ వైజ్ డిస్కషన్, వారి మధ్య కోఆర్డినేషన్ బాగున్నాయన్నారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ… విద్యార్థుల్లో నైతిక విలువల పెంపుదలకే రాష్ట్రంలో మనం విలువల విద్యపై చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టామని చెప్పారు. ‘నేను విద్యనభ్యసించిన స్టాన్ ఫోర్డ్ ఫైనల్ ఎగ్జామ్స్లో ఇన్విజిలేటర్లు ఉండరు. ఆనర్ కోడ్ ఉంటుంది. స్వీయ క్రమశిక్షణవల్ల ఎవరూ అక్కడ కాపీయింగ్ వంటివి చేయరు’ అని గుర్తు చేసుకున్నారు. తల్లికి చెప్పలేని పని చేయొద్దన్న చాగంటి మాటలు తన మనసును హత్తుకున్నాయని చెప్పారు. భీమిలికి చెందిన హెచఎం తిరుమల శ్రీదేవి మాట్లాడుతూ… “వెల్నెస్ అంబాసిడర్స్, మెంటల్ హెల్త్ కౌన్సిలర్ నియామకంవల్ల అక్కడ కెపాసిటీ బిల్డింగ్ బాగుంది. సీనియర్ టీచర్లు జూనియర్లకు గైడ్ చేస్తున్నారు. స్కూలుస్థాయిలో వెల్ బీయింగ్ కమ్యూనిటీస్, నెలకోసారి నిర్వహించే కాంప్లెక్ట్ మీటింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్ వర్క్షాపుల నిర్వహణ, టీచర్ ఎచీవ్మెంట్ సెలబ్రేషన్స్ వంటివి ఉపాధ్యాయులకు ప్రోత్సహకారంగా ఉన్నాయని వివరించారు.
ప్రతిభ చూపితేనే హైస్కూలులో మంచిసీటు
ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ప్రిన్సిపాల్ జాన్సన్ దేవరాజ్ మాట్లాడుతూ… విద్యార్థుల ప్రైమరీ స్కూల్ లెర్నింగ్ ఎగ్జామినేషన్ (పీఎసఎలఈ)లో మంచి మార్కులు సాధిస్తేనే విద్యార్థులకు 6వ తరగతిలో దగ్గరగా ఉన్న స్కూలులో సీటు లభిస్తుందని చెప్పారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో అమలుచేస్తే బాగుంటుందన్నారు. దీనివల్ల అప్పర్ ప్రైమరీతోపాటు లోయర్ సెకండరీలో నాణ్యతా ప్రమాణాలు బాగుంటాయన్నారు. 7వ తరగతిలో కామన్ పరీక్షలు నిర్వహించే విధానాన్ని రాష్ట్రంలో 2007లో తొలగించారని చెప్పారు. దీనిపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ… విద్యార్థులు ఒత్తిడి తట్టుకోగలరా? అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని, దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు. పల్నాడు జిల్లాకు చెందిన హెడ్మాస్టర్ మోటా పార్వతి మాట్లాడుతూ… “సింగపూర్లో ఫ్యూచర్ ఫోకస్ ఎడ్యుకేషన్ అమలులో ఉందని, విద్యార్థులు స్కూలునుంచే బయటకు వెళ్లే సమయానికి ఏదోక స్కిల్తో వెళ్తున్నారని, దీనివల్ల చదువు పూర్తయ్యాక ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూసే పరిస్థితి అక్కడ లేద”న్నారు. గుంటూరుకు చెందిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గుమ్మడి షీలా మాధురి మాట్లాడుతూ… సింగపూర్లో విద్యతోపాటు క్రీడలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. తాను 2000 సంవత్సరంలో డిఎస్సీ స్పోర్ట్స్ కోటాలో టీచర్గా ఎంపికయ్యానని, ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 శాతం స్పోర్ట్స్ కోటా క్రీడలకు ప్రోత్సాహకరంగా ఉందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మమ్మల్ని సింగపూర్ పంపి ప్రభుత్వ ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచారంటూ మంత్రి లోకేష్కు కృతజ్జతలు తెలిపారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ… శాప్, ఏసీఏల ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించి, వైబ్రంట్ స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. సింగపూర్ ప్రజల్లో కసి ఉండటంవల్లే ఒక మత్స్యకార గ్రామం ప్రపంచ ప్రఖ్యాతదేశంగా అభివృద్ధి చెందింది. మనలో కూడా అటువంటి కసి రావాలని అన్నారు.
టీచర్లు పరిశ్రమల్లో కూడా 3 నెలలు పనిచేయొచ్చు
అనంతపురం జిల్లా పామిడికి చెందిన ఏపీ మోడల్ స్కూలు ప్రిన్సిపాల్ అరుణ మాట్లాడుతూ… సింగపూర్లో టీచర్ ట్రైనింగ్, గ్రేడింగ్ ఆఫ్ టీచర్స్ విధానాలు బాగున్నాయి. ప్రతిఏటా వందగంటల ఆన్లైన్ శిక్షణను కంపల్సరీ చేయడం వల్ల ఏఐవంటి అధునాతన కోర్సుల్లో టీచర్లు అప్ గ్రేడ్ కావడానికి అవకాశమేర్పడుతుందని అన్నారు. టీచర్లు మూడు నెలలపాటు తమకు ఆసక్తి ఉన్న పరిశ్రమలో పనిచేసే అవకాశం కూడా అక్కడ ఉందని తెలిపారు. శ్రీకాళహస్తి మండలానికి చెందిన స్కూల్ అసిస్టెంట్ ఎన్.సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ… అక్కడ ప్రైమరీ సెకండరీ విద్యార్థులకు నిర్వహించే స్లిప్ టెస్ట్, మిడ్ ఇయర్ ఎసెస్మెంట్ బాగుందన్నారు. మనవద్ద క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్ అప్ గ్రేడ్ చేయాల్సి ఉందని తెలిపారు. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ బండి శ్రీనివాసులు మాట్లాడుతూ… అక్కడ ఫర్ ద టీచర్, బై ద టీచర్ విధానంతోపాటు అకాడమీ ఆఫ్ సింగపూర్ నిర్వహించే సింపోజియం నిర్వహణ, మెంటరింగ్ విధానాలవల్ల టీచర్లు ఒత్తిడిలేకుండా బోధన చేయగలుగుతున్నారని తెలిపారు. మంత్రి లోకేష్ స్పందిస్తూ… సింగపూర్ వెళ్లిన టీచర్లు అద్భుతమైన సలహాలు ఇచ్చారు. మనవద్ద విద్యార్థి కేంద్రంగా సంస్కరణలు అమలుచేయాల్సి ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లిన ఉపాధ్యాయుల ఇచ్చిన సూచనలను అమలు చేసేందుకు ఒక ప్రత్యేక మెకానిజం ఏర్పాటుచేసి, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు. సింగపూర్ ప్రస్తుతస్థితికి రావడానికి ఐదారు దశాబ్దాలు పట్టిందని తెలిపారు. ఇందుకు ఉపాధ్యాయుల్లో కమిట్మెంట్, పట్టుదల కావాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన లీప్ యాప్ను కేవలం 2శాతం తల్లిదండ్రులు మాత్రమే డౌన్లోడ్ చేసుకున్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల భవిష్యత్తుపై బాధ్యత, శ్రద్ధ తీసుకుంటేనే వ్యవస్థలో మార్పు తేవడం సాధ్యమవుతుందని అన్నారు.
లైఫ్ లాంగ్ లెర్నింగ్కు
సింగపూర్ సిస్టమ్ బెస్ట్
సింగపూర్లో కాంపిటెన్సీ-బేస్డ్ అసెస్మెంట్ బాగుంది. అక్కడ ప్రాజెక్టులు, ప్రజెంటేషన్లు, అసైన్మెంట్లు, కంటెంట్ ఎలా తయారు చేస్తున్నారు? ఎలా అమలు చేస్తున్నారో అధ్యయనం చేశా. సింగపూర్ విద్యావిధానంతో విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్, సమస్య పరిష్కార సామర్థ్యం పెరుగుతాయి. దీనివల్ల వారికి జీవితంలో ఎటువంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఇన్నోవేషన్, క్రియేటివిటీ, కొలాబరేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీ మెరుగవుతాయి.
– వై.యశోద లక్ష్మి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, ఎపీఎస్డబ్ల్యుఆరఐఈఎస్, శ్రీకాకుళం.
సెకండరీ స్కూలునుంచే
స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ
ప్రాథమిక స్థాయినుంచే వొకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్కు సింగపూర్లో అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రతి సెకండరీ స్కూలును స్థానికంగా ఉండే ఫ్యాక్టరీ లేదా పరిశ్రమకు అనుసంధానించి విద్యార్థులకు ఆసక్తి ఉన్న కోర్సుల్లో శిక్షణనిస్తున్నారు. దీనివల్ల పరిశ్రమలకు కావాల్సిన నాణ్యమైన వర్క్ఫోర్స్ తయారుకావడమే కాక చదువు పూర్తయిన వెంటనే సులభంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు, అవకాశాలకు అనుగుణంగా విద్యార్థులకు చిన్నతనం నుంచే ట్రైనింగ్ ఇవ్వాలి. విశాఖ రీజియన్లో మెరైన్, బీచ్ మేనేజ్మెంట్, గోదావరి రీజియన్లో ఫుడ్ ప్రాసెసింగ్, కొబ్బరి పరిశ్రమ, అమరావతిలో లాజిస్టిక్స్, ఏఐ కంట్రోల్డ్ ట్రాఫిక్, రాయలసీమలో రెన్యూవబుల్ ఎనర్జీ, మోటార్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్వంటి అంశాల్లో డిప్లొమా కోర్సులను డిజైన్ చేసి శిక్షణనిస్తే రాష్ట్రంలోని యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
-ముత్తోజు సుధాకర్, హెడ్ మాస్టర్, జడ్పీహెచఎస్, తర్లుపాడు, మార్కాపురం జిల్లా.
పాఠశాల నిర్వహణ
విధానం అద్భుతం
సింగపూర్లో పాఠశాల నిర్వహణ విధానం బాగుంది. హెడ్ మాస్టర్, టీచర్లు టీమ్వర్క్తో పనిచేస్తున్నారు. ప్రతి వారాంతంలో సమావేశం ఏర్పాటు చేసుకుని రాబోయే వారంలో బోధనాంశాలపై ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తున్నారు. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యం మెరుగుదలకు అక్కడ “హమాలా” పద్ధతిని అమలుచేస్తున్నారు. హమాలా పద్ధతిలో హయ్యర్, మిడిల్, లోయర్ అచీవర్స్ను ముందుగా గుర్తిస్తారు. వారు ఏ సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి ప్రత్యేకంగా బోధిస్తూ ఆరు నెలల వ్యవధిలో హయ్యర్ లెవల్కు చేరుస్తున్నారు. ఈ విధానం నాకు బాగా నచ్చింది. అక్కడి స్కూళ్లలో విద్యార్థి కేంద్రంగా విద్యాభ్యాసం సాగుతోంది. అక్కడ చదువుకునే విషయంలో విద్యార్థులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. టీచర్ అనే వ్యక్తి కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే. హోలిస్టిక్ ప్రోగ్రెస్ విధానం కూడా బాగుంది. ఐడియాలు, నాలెడ్జ్ షేరింగ్వల్ల విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంది.
-గుండేపల్లి ప్రభావతి, స్కూల్ అసిస్టెంట్, సఖినేటిపల్లి లంక, అంబేద్కర్ కోనసీమ జిల్లా.
బోధన, రూపకల్పన
పద్ధతులు బాగున్నాయి
సింగపూర్లో బోధన, రూపకల్పన పద్ధతులు బాగున్నాయి. అక్కడి విద్యావ్యవస్థలో ఏడీడీఐఈ మోడల్ అనుసరిస్తున్నారు. అనాలిసిస్, డిజైనింగ్, డెవలప్మెంట్ ఆఫ్ కంటెంట్, ఇంప్లిమెంటేషన్, ఎవాల్యుయేషన్ అనేది వినూత్నమైన బోధనా ప్రక్రియ. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి అనుగుణంగా కంటెంట్ డెవలప్ చేసి అభ్యసనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ విధానం ప్రత్యేకత. దీనిపై టీచర్లకు ముందుగా శిక్షణనిచ్చి, లెసన్ ప్లాన్లో పొందుపర్చాల్సి ఉంటుంది.
-ఎఫ్.ఎం.ఎస్. ఖాదర్, స్కూల్ అసిస్టెంట్, ఎగువపల్లి, పెండ్లిమర్రి మండలం, కడప జిల్లా.
సింగపూర్లో టీచర్లకు
నిరంతర శిక్షణ
సింగపూర్లో ప్రీ-సర్వీస్ టీచర్ ట్రైనింగ్, గ్రేడింగ్ చాలా బాగుంది. టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులు 18 నెలలపాటు ఈ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్లో టాప్ 30శాతం నుంచి మాత్రమే టీచర్లుగా ఎంపిక చేస్తారు. అక్కడ ఉపాధ్యాయులు ప్రతి ఏటా 100 గంటల కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆన్లైన్ శిక్షణ కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. దీనినిబట్టి ఉపాధ్యాయులకు గ్రేడింగ్ ఇస్తారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కావాల్సిన చోటుకు బదిలీల అవకాశం ఉంటుంది. ప్రీ-ట్రైనింగ్లో ఏదైనా కారణంచేత విఫలమైతే రీ-ట్రైనింగ్ అవకాశం ఉంది.
-వై. అరుణ, ప్రిన్సిపాల్, ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్, పామిడి, అనంతపురం జిల్లా.
టీచ్ లెస్..
లెర్న్ మోర్
సింగపూర్లో టీచ్ లెస్ -లెర్న్ మోర్ విద్యావిధానం బాగుంది. ఇందులో విద్యార్థులకు ఒక పీరియడ్ రియల్-లైఫ్ అప్లికేషన్ కంటెంట్ తయారుచేస్తారు. విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ అభివృద్ధి చెందడంతోపాటు కోఆర్డినేషన్, ప్రాబ్లమ్-సాల్వింగ్ కెపాసిటీ పెరుగుతాయి. థింక్ స్కూల్స్ -లెర్న్ నేషన్ అనే విధానంవల్ల అడాప్టబిలిటీ, ఇన్నోవేషన్, లైఫ్ స్కిల్స్ మెరుగవుతాయి. విద్యార్థులకు పరీక్షల కేంద్రంగా బోధన చేసే విధానం కాకుండా స్కిల్-బేస్డ్ బోధన అక్కడ చేపడుతున్నారు. అసెస్మెంట్-బేస్డ్ లెర్నింగ్ వల్ల విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్, లీడర్షిప్ క్వాలిటీస్ మెరుగవుతున్నాయి.
– బి. విజయభారతి, గ్రేడ్-2 హెచఎం, నేలబొంతు, మిళియపుట్టి మండలం, శ్రీకాకుళం జిల్లా.













