- కేవలం 40 రోజుల్లోనే కోటి ఇళ్ల సందర్శనల రికార్డు
- రాష్ట్రంలోని మొత్తం ఇళ్లలో 73.6 శాతం ఇళ్ల సందర్శనలు పూర్తి చేసిన పార్టీ నేతలు, శ్రేణులు
- కార్యకర్తల క్షేత్రస్థాయి భాగస్వామ్యంపై జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ హర్షం
- కార్యకర్తల శ్రమ, అంకితభావానికి ఇది నిదర్శమని యువనేత ప్రశంసలు
- కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపిన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
అమరావతి (చైతన్యరథం): రెండేళ్ల కూటమి పాలనలో జరిగిన అసాధారణ అభివృద్ధిని, ప్రజలకు అందిన సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడపకూ చేరవేసేందుకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ కార్యక్రమం 40వ రోజుకు చేరుకునే నాటికి రాష్ట్రవ్యాప్తంగా కోటి ఇళ్ల సందర్శన మైలురాయిని విజయవంతంగా అధిగమించింది. నేడు ఒక్కరోజే అదనంగా మరో 1.30 లక్షల ఇళ్లను సందర్శించడంతో మొత్తం సందర్శనల సంఖ్య కోటికి చేరింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 1,35,91,105 ఇళ్లు ఉండగా, ఇప్పటివరకు సందర్శించిన ఇళ్ల సంఖ్య మొత్తం ఇళ్లలో 73.6 శాతానికి చేరడం విశేషం. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గాన్ని కూడా మినహాయించకుండా ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా కొనసాగుతోంది.
కార్యకర్తల అంకితభావానికి నిదర్శనం.. సరికొత్త రికార్డులు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం పార్టీ శ్రేణుల విస్తృత భాగస్వామ్యంతో నిరంతరాయంగా దూసుకుపోతోంది. ఈ 40 రోజుల్లో నమోదైన కొన్ని మైలురాళ్లు ఒకే రోజులో అత్యధికంగా 19,405 బూత్లలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఒక గరిష్ఠ రికార్డు. ఒకే రోజులో ఏకంగా 28,397 మంది కార్యకర్తలు క్షేత్రస్థాయి పర్యటనల్లో పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించారు. క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త సగటున రోజుకు 12 ఇళ్లను పలకరిస్తున్నారు. మొదటి వారం తర్వాత నుంచి ఈ వేగం ఎక్కడా తగ్గకుండా స్థిరంగా కొనసాగుతుండటం పార్టీ శ్రేణుల క్రమశిక్షణకు నిదర్శనం. ఆగస్టు 8వ తేదీన ఒకే రోజులో అత్యధికంగా 3,51,229 ఇళ్లను సందర్శించారు. అలాగే ఒకే గంటలో అత్యధికంగా 48,899 ఇళ్లను సందర్శించిన ఘనత కూడా టీడీపీ కార్యకర్తలకే దక్కింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తల విస్తృత భాగస్వామ్యంతో ‘ఇంటింటికీ తెలుగుదేశం-2026’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుంది.
ప్రతి ఇంటి సందర్శనకు డిజిటల్ ధ్రువీకరణ
ఈ పర్యటనల్లో ఎక్కడా ఎలాంటి తప్పులకు తావులేకుండా ప్రతి సందర్శనను మై టీడీపీ యాప్లో తప్పనిసరిగా టీడీపీ శ్రేణులు నమోదు చేస్తున్నారు. సందర్శించిన ఇళ్లలో 82 శాతం ఇళ్లను ఫొటో ఆధారంగా డిజిటల్ పద్ధతిలో ధ్రువీకరించారు. కచ్చితమైన లెక్కలు, పూర్తి పారదర్శకతతో ఈ కార్యక్రమం జరుగుతుండటం విశేషం.
ప్రజలు–ప్రభుత్వం మధ్య బలమైన వారధిగా ఇంటింటికీ టీడీపీ
టీడీపీ ఇంటింటి పర్యటనల్లో కేవలం ప్రభుత్వ విజయాలను వివరించడమే కాకుండా.. ప్రతి కుటుంబం నుంచి వస్తున్న స్పందన, వారి స్థానిక సమస్యలు, అవసరాలను కూడా పార్టీ శ్రేణులు యాప్లో డిజిటల్గా నమోదు చేస్తున్నాయి. ప్రజల నుంచి వస్తున్న ఈ క్షేత్రస్థాయి సూచనలను నేరుగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఈ కార్యక్రమం ఒక బలమైన వారధిలా నిలుస్తోంది.
కోటి ఇళ్ల మైలురాయి కేవలం ఒక సంఖ్య కాదు.. లక్షలాది టీడీపీ కార్యకర్తల శ్రమ, సమయం, సమన్వయం, అంకితభావానికి ప్రతీక: యువనేత నారా లోకేష్
కేవలం 40 రోజుల్లోనే కోటి ఇళ్ల మైలురాయిని చేరుకోవడంపై పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తీవ్ర హర్షం వ్యక్తం చేస్తూ, క్షేత్రస్థాయిలో అహోరాత్రులు శ్రమిస్తున్న టీడీపీ శ్రేణులను మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ ఘనత వెనుక ప్రతి టీడీపీ కార్యకర్త కృషి, అంకితభావం, క్రమశిక్షణ కీలకంగా నిలిచాయని పేర్కొన్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా ప్రతి గడపకు వెళ్లి కుటుంబాలను కలుసుకుంటూ, వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారని ప్రశంసించారు. ప్రతి బూత్లో సమన్వయంతో పనిచేస్తూ, ఇంటింటి సందర్శనలను యాప్లో నమోదు చేయడం, ఫొటోలు ద్వారా ధ్రువీకరించడం వంటి సాంకేతిక ప్రక్రియలను కూడా కార్యకర్తలు సమర్థవంతంగా అమలు చేశారని తెలిపారు. రోజువారీ లక్ష్యాలను క్రమం తప్పకుండా పూర్తి చేస్తూ, లక్షలాది కుటుంబాలకు చేరువ కావడంలో కార్యకర్తలు చూపిన పట్టుదల అభినందనీయమన్నారు. కోటి ఇళ్ల మైలురాయి కేవలం ఒక సంఖ్య కాదు.. లక్షలాది టీడీపీ కార్యకర్తల శ్రమ, సమయం, సమన్వయం, అంకితభావానికి ప్రతీక. ప్రతి గడపకు వెళ్లి ప్రజలను కలిసిన ప్రతి కార్యకర్తకు, ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి నాయకుడికి నారా లోకేష్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ విజయం కార్యకర్తలదే : రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు
కేవలం 40 రోజుల్లోనే కోటి ఇళ్ల మైలురాయిని చేరుకోవడం పట్ల టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేస్తూ, ఈ ఘనత సాధించిన పార్టీ నాయకులు, కార్యకర్తలను అభినందించారు. కోటి ఇళ్ల సందర్శన వెనుక కార్యకర్తల అంకితభావం, క్రమశిక్షణ, నిరంతర క్షేత్రస్థాయి కృషి కీలకంగా నిలిచాయని పేర్కొన్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా ప్రతి గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుని, ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని వివరించడంతో పాటు వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారని తెలిపారు. కోటి ఇళ్ల మైలురాయి టీడీపీ కార్యకర్తల శ్రమకు ప్రతీక అని, ఈ విజయం పూర్తిగా పార్టీ శ్రేణులదేనని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంతో, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పర్యవేక్షణలో కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు.














