- క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా ప్రారంభించండి
- సంస్థ వ్యవస్థాపకుడు సజన్ రాజ్ కురుప్తో భేటీలో మంత్రి లోకేష్ వినతి
శాన్ఫ్రాన్సిస్కో/యూఎస్ఏ (చైతన్యరథం): గతంలో కుదుర్చుకున్న ఎంఓయూ మేరకు ఏపీ రాజధాని అమరావతిలో క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్ట్ను వీలయినంత త్వరగా ప్రారంభించాలని క్రియేటివ్ ల్యాండ్ వ్యవస్థాపకుడు సజన్ రాజ్ కురుప్ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ శాన్ఫ్రాన్సిస్కోలో క్రియేటివ్ ల్యాండ్ ఆసియా (creative land asia) ఫౌండర్ సజన్ రాజ్ కురుప్, సీనియర్ పార్టనర్ ఇయాంగ్ కాపింగ్, ప్రముఖ అమెరికన్ ఫిల్మ్ డైరెక్టర్ అండ్ స్క్రీన్ రైటర్ చిక్ రసెల్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ను క్రియేటివ్ ఎకానమీ, టూరిజం, డిజిటల్ ఇన్నొవేషన్స్లో గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా అమరావతిలో ఏఐ-ఆధారిత వర్చువల్ స్టూడియోలు, లీనమయ్యే AR/VR థీమ్ పార్కులు, ప్రపంచ సహ-ఉత్పత్తి సౌకర్యాలను ఏర్పాటుచేసి అత్యాధునిక ట్రాన్స్మీడియా నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్ట్`అమరావతిని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి, తమ లక్ష్యసాధనకు మీ వంతు సహకారం అందించాలని కోరారు. దీనిపై క్రియేటివ్ ల్యాండ్ వ్యవస్థాపకుడు సజన్ రాజ్ కురుప్ స్పందిస్తూ… క్రియేటివ్ ల్యాండ్ సంస్థ ఏఐ ఆధారిత కళ, వర్చువల్ రియాలిటీ (విఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఎఆర్), సృజనాత్మక సాంకేతికతల కోసం బ్లాక్ చెయిన్ ఏర్పాటు చేస్తుందన్నారు. పఖీశ, AI, గేమింగ్, యానిమేషన్ వంటి అధిక డిమాండ్ ఉన్న రంగాల్లో స్థానిక యువతకు శిక్షణ ఇవ్వడానికి అంకితమైన సంస్థ క్రియేటర్ ల్యాండ్ అకాడమీ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టు ఏర్పాటుకు గత ఏడాది ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాం. ఆ ఎంవోయూ మేరకు 24 నెలల్లో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అది పూర్తయితే రూ.10వేల కోట్ల వరకు పెట్టుబడులను ఆకర్షించడమేగాక, యువతకు 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం లభిస్తుందని చెప్పారు. భారతదేశంలో తొలి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ క్రియేటర్ ల్యాండ్ను అమరావతిలో ఏర్పాటు చేయడానికి గత ఏడాది మే 4న క్రియేటివ్ ల్యాండ్ ఆసియా సంస్థ ఎంవోయూ కుదుర్చుకుంది.












