- నెగటివ్ వద్దు.. సానుకూల ఆలోచనలతో పనిచేయాలి
- ప్రభుత్వ ఆదేశాలు ఎలా అమలు చేయాలో చూడాలి
- పని, ఫలితమే కాదు…. అధికారుల వ్యవహార శైలీ బాగుండాలి
- హెచ్వోడీలు, కార్యదర్శుల సదస్సులో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): హెచ్వోడీలు, కార్యదర్శుల సదస్సులో వారిలో చైతన్యం నింపేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సూచనలు చేశారు. అధికారులకు ప్రతికూల ఆలోచనలు కూడదన్నారు. ఏ పనిచెప్పినా, ఏ కార్యక్రమం తలపెట్టినా కొందరు ప్రతికూల ఆలోచనలు చేస్తున్నారని, ఎలా ఆ పనిచేయకుండా ఉండాలి? అనే విధంగా కొంతమంది ఆలోచిస్తున్నారని చంద్రబాబు అంటూ.. అలాంటి పద్ధతిని విడనాడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఒక కార్యక్రమం తలపెట్టినా, ఒక ఆదేశం ఇచ్చినా సానుకూలంగా తీసుకుని దాన్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వంలో ఏ స్థాయిలో అధికారి అయినా పాజిటివ్ ఆలోచనలతో పనిచేయాలని.. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని హితవు పలికారు. ’’చాలామంది అధికారులు ఎంతో అద్భుతంగా పనిచేస్తారు. మంచి ఫలితాలు చూపిస్తారు. అయితే వారి వ్యవహార శైలి, అనుసరించే విధానం కూడా బాగుండాలి. ప్రజలు, అర్జీదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించే విధానాన్ని అలవర్చుకోవాలి. ఎంత మంచి ఫలితం సాధించినా… ఆ అధికారి ప్రవర్తన కూడా ముఖ్యమే’’ అని సీఎం అన్నారు. ‘‘ప్రభుత్వంలో అనేక శాఖల్లో 18 నెలల్లో చాలా మార్పులు తెచ్చాం. అయితే దేవాదాయ, రెవెన్యూ శాఖల్లో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉంది. ఈ రెండు శాఖలు ఇంకా పికప్ అవ్వాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత తిరుమల శ్రీవారి ఆలయంలో అనేక మార్పులు తెచ్చాం. ఆ తరహా మార్పులు దేవాదాయ శాఖలోని ప్రతి దేవాలయంలో రావాలి. ప్రభుత్వ శాఖల్లో ప్రతి సేవ ఆన్లైన్లో పొందే పరిస్థితి రావాలి. అన్ని సేవలు ఆన్లైన్లోకి రావడానికి జనవరి 15 డెడ్ లైన్. దానికి అవసరమైన కసరత్తు పూర్తిచేసి.. ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంచాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.















