- టెక్నాలజీ ఎంత పెరిగినా గ్రామీణ డాక్ సేవక్ల స్థానం భర్తీ కాదు
- ఎలక్ట్రిక్ సైకిళ్లు ఇచ్చి వారికి మరింత సదుపాయం కల్పించాలి
- డబుల్ ఇంజన్ సర్కార్ తోనే దేశంలో డబుల్ స్పీడ్తో అభివృద్ధి
- గుంటూరులో గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
గుంటూరు (చైతన్య రథం): దేశంలో అత్యంత కీలకమైన లాజిస్టిక్స్ వ్యవస్థగా డాక్ సేవక్లు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. టెక్నాలజీ పెరిగినా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్లాంటి సాంకేతికత అందుబాటులోకి వచ్చినా డాక్ సేవక్ల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని సీఎం స్పష్టం చేశారు. గుంటూరులో నిర్వహించిన గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళన్లో కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తపాలా శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోస్ట్ మాస్టర్లను సన్మానించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… “గ్రామీణ డాక్ సేవకుల సేవలు చిరస్మరణీయం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ పార్సిల్ వెళ్లాలంటే డాక్ సేవకుల వల్లే సాధ్యం. నేను చదువుకునే రోజుల్లో ఏ పని కావాలన్నా తపాలా వ్యవస్థపైనే ఆధార పడేవాళ్లం. గతంలో అతిపెద్ద కమ్యూనికేషన్ వ్యవస్థ పోస్టల్ సేవలే. పార్సిళ్లు, మనీ ఆర్డర్ల కోసం పోస్ట్మ్యాన్ ఎప్పుడు వస్తారా? అని ఎదురు చూసే పరిస్థితి. టెలీ కమ్యూనికేషన్ రంగంలో సంస్కరణలు రావాలని బలంగా కోరుకున్నాం.
నేడు 4జీ సేవలు అందుబాటులోకి వచ్చినందుకు గర్వపడుతున్నాం. భారతీయ తపాలా శాఖకు ఉన్నంత నెట్వర్క్.. మరే దేశంలోనూ ఏ పోస్టల్ సంస్థకు లేదు. మనకు స్వాతంత్య్రం రాక ముందునుంచే బలంగా ఉన్న వ్యవస్థల్లో భారతీయ తపాలా శాఖ ఒకటి. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పరోక్షంగా కీలక పాత్ర పోషించిన ఘనత పోస్టల్ శాఖకు ఉంది. దేశంలో 1.64 లక్షలకు పైగా పోస్టాఫీసులుంటే, అందులో 90 శాతం గ్రామాల్లోనే ఉన్నాయి. ఇందులో దాదాపు 2.7 లక్షల గ్రామీణ డాక్ సేవకులు పనిచేస్తున్నారు. మన రాష్ట్రంలో 9,100కు పైగా పోస్టాఫీసుల ద్వారా.. 17,000కు పైగా గ్రామీణ డాక్ సేవక్లున్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందంటే అందుకు డాక్ సేవకులే కారణం. 33 శాతంమేర డీబీటీ ద్వారా ఆర్ధిక సాయం డాక్ సేవకుల ద్వారానే జరడం అభినందనీయం. బ్యాంకింగ్ సేవలు, బీమా సేవలు, డీబీటీ అనుసంధాన సేవలు, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు డాక్ సేవకుల ద్వారానే అందుతున్నాయి. వికసిత్ భారత్, స్వరాంధ్ర సాధనకు డాక్ సేవకులు వెన్నెముక” అని సీఎం చంద్రబాబు అన్నారు.
డాక్ సేవకులకు ఎలక్ట్రికల్ సైకిళ్లు
డాక్ సేవకుల గౌరవం పెంచేలా కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా పనిచేస్తున్నారు. జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావ్ సింధియాతో నేను కలిసి పని చేశాను. విశాఖలోని గాజువాకలో ఒక ప్రాంతానికి సింధియా పేరుంది. త్వరలోనే ఆ ప్రాంతాన్ని జ్యోతిరాదిత్య సందర్శించాలని కోరుతున్నాను. టెక్నాలజీ ఎంత పెరిగినా మానవత్వంతో పని చేసిది డాక్ సేవకులే. వారికోసం కేంద్ర మంత్రి డ్రెస్ కోడ్ను డిజైన్ చేశారు. డాక్ సేవకులకు ఎలక్ట్రికల్ సైకిళ్లు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రిని కోరుతున్నాను. దీనివల్ల పొల్యూషన్ బెడద ఉండదు. డాక్ సేవక్లు విధులు నిర్వహించటంలోనూ చక్కగా ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
డబుల్ ఇంజన్ సర్కార్తో డబుల్ స్పీడ్లో అభివృద్ధి
“నేను ఆనాడు టెక్నాలజీని ప్రమోట్ చేశాను. నేను రూపొందించిన విజన్ కారణంగా దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణ నుంచి వస్తోంది. 2047నాటికి మన దేశం నెంబర్ వన్గా ఉండాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారుతో డబుల్ స్పీడ్లో అభివృద్ది జరుగుతోంది. 20 నెలల్లో సంక్షేమం అందించాం. అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నాం. సుపరిపాలనకు నాంది పలికాం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను పౌరుల ఇంటి వద్దకే అందిస్తున్నాం. గత పాలకులు అమరావతిని స్మశానం, ఎడారి అన్నారు. దేవతల రాజధాని అమరావతి. ప్రపంచం మెచ్చేలా రాజధానిని నిర్మిస్తాం. గడిచిన ఐదేళ్లలో పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. 2027 గోదావరి పుష్కరాలకంటే ముందే గోదావరిని పూర్తి చేసి జాతికి అంకితమిస్తాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా లాభాలబాట పట్టించాం. జనవరిలో రూ. 54 కోట్ల లాభాలు ఆర్జించేందుకు ఎన్డీఏ పాలన సామర్థ్యమే కారణం. ఢిల్లీలో జరిగిన ఏఐ సదస్సుకు 80 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో మన దేశ నూతన ఆవిష్కరణలు చూసి వారంతా ఆశ్చర్యపోయారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం నిర్వహిస్తే దేశ పరువు తీసే విధంగా కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శనలు చేసింది. వారికి ఏఐ తెలీదు. టెక్నాలజీపై అవగాహన లేదు. బ్రాండ్ దెబ్బతీసేలా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు పలికారు.















