- అకాల వర్షాలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
- 1,670 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని వివరించిన అధికారులు
- నష్టపోయిన రైతులకు సాయం అందించాలని సీఎం సూచన
- ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నంపై సీఎం ఆరా
- మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో ఆకాల వర్షాలు, వడగళ్ల వానలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, ఆందోళన చెందవద్దని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. పలు జిల్లాల్లో జరిగిన పంట నష్టంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. వడగళ్ల వాన కారణంగా కడప, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 10 మండలాల్లో 40 గ్రామాల్లో పంటనష్టం జరిగిందని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. మొత్తం 1,364 మంది రైతులకు చెందిన 1,670 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించినట్లు తెలిపారు. అకాల వర్షాలు, వడగళ్ల వర్షాలతో జరిగిన పంటనష్టం వివరాలను క్షేత్రస్థాయి పర్యటన ద్వారా పరిశీలించినట్లు సీఎంకు అధికారులు వివరించారు. వారికి ప్రభుత్వ పరంగా సాయం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని.. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
రైతుల ఆత్మహత్యాయత్నంపై సీఎం ఆరా
అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జంపల్లిలో ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జిల్లా అధికారులతో మాట్లాడిన ఆయన.. ఆ రైతులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. శనివారం కురిసిన వడగళ్ల వానతో పంట నష్టపోయిన అరటి రైతులు లక్ష్మీనారాయణ, చిన్న వెంగప్ప ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీంతో వారిని హుటాహుటిన అనంతపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.