- అమరావతిలో లక్ష కోట్ల పనులు, పెట్టుబడులు
- ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వ నివేదిన
- సచివాలయ సమీపంలోనే ప్రారంభోత్సవ సభ
అమరావతి (చైతన్య రథం): రాజధాని నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ చేతులమీదుగా పనులను ప్రారంభించనున్నారు. రాజధానిలో రూ.52 వేల కోట్లతో చేపడుతున్న పనులు, రూ.48 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనల గురించి ఈ సందర్భంగా ప్రధానికి వివరించనున్నారు. రాజధాని పనులకు తొమ్మిదేళ్ల కిందటే ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినందున.. ఇప్పుడు ఈ కార్యక్రమాన్నీ నవ నగరాల పనుల ప్రారంభోత్సవ సభగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కార్యక్రమ నిర్వహణకు సచివాలయం వెనుక ఎన్-9 రహదారి పక్కనే 250 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ప్రధానితోపాటు ఇతర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉండటంతో రవాణాకు అనుకూలంగా ఉండేలా ఈ స్థలాన్ని ఎంపికచేశారు. వాస్తుపరంగానూ అనుకూలమని నిర్ణయించారు. రాజధాని పనుల ప్రారంభోత్సవ సభ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం శాసనసభ భవనంలోని తన ఛాంబర్లో పురపాలక మంత్రి పి నారాయణ, సీఆర్డీఏ అధికారులతో సమీక్షించారు.
సభ నిర్వహణకు ఏ ప్రాంతం అనుకూలం? ఎన్ని పనులకు ప్రధానితో శంకుస్థాపన చేయించగలమన్న అంశంపై చర్చించారు. రాజధానిలో ఏ ప్రాంతాలు సభ నిర్వహణకు అనుకూలమో ముఖ్యమంత్రికి సీఆర్డీఏ అధికారులు వివరించారు. మొత్తం ఆరు ప్రాంతాలను పరిశీలించినట్టు తెలిపారు. సచివాలయం పక్కనున్న ప్రదేశం అన్ని విధాలా అనుకూలమని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. రాజధాని పనుల పునఃప్రారంభోత్సవాన్ని ఏ రోజు నిర్వహించాలి? ముహూర్తం తదితర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. సీఎంతో సమావేశం అనంతరం సచివాలయం వెనుక పక్క స్థలాన్ని సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పరిశీలించారు. గతంలో ఉద్దండరాయునిపాలెం వద్ద నిర్మించిన హెలిప్యాడ్లు, సచివాలయం ఎదుట ఉన్న హెలిప్యాడ్లను సభకు వచ్చే ప్రముఖుల కోసం వినియోగించాలని నిర్ణయించారు.