అమరావతి (చైతన్యరథం): కల్తీ లడ్డు వివాదంలో కూరుకున్న టీటీడీ ఇవో అనిల్ కుమార్ సింఘాల్ పై బదిలీ వేటు పడింది. జగన్ ప్రభుత్వంలో టీటీడీకి నెయ్యి సరఫరా నిబంధనలను మార్చిన సమయంలోనూ ఆయనే టీటీడీ ఇవోగా ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించిన సిట్ నివేదికలో అసలు ఆవులు లేవు, నెయ్యి లేదు, అంతా రసాయన మిశ్రమం అని తేల్చడంతో ప్రభుత్వం చేతిలో వున్న అధికారాన్ని ఉపయోగించి ఆకస్మికంగా అనిల్ సింఘాల్ పై వేటు వేశారు. టీటీడీ నూతన ఇవోగా సమర్థుడైన డైనమిక్ ఐఏఎస్ అధికారి రవిచంద్ర ముద్దాడను పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆ విధులు నిర్వహిస్తూనే టీటీడీ ఈవో బాధ్యతలు కూడా చేపట్టనున్నారు.
రవిచంద్ర ముద్దాడ 1996 బ్యాచ్ కు చెందిన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి రాష్ట్రంలో 2003లో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా అప్పట్లో సంచలనం సృష్టించారు. వివాదస్పదంగా మారి కబ్జాకు గురైన వందల కోట్ల భూమిని కాపాడి ప్రభుత్వానికి అప్పగించి గుర్తింపు పొందారు. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో మేటి అధికారిగా పేరు పొందారు. నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. కోవిడ్ సమయంలో ఆరోగ్యశాఖ కార్యదర్శిగా ఆయన చేసిన సేవలు అసామాన్యం. ఎంతో సింపుల్ డౌన్ టు ఎర్త్ వుండే అధికారి. తనకు అప్పగించిన విధులను చిత్తశుద్ధితో నిర్వహించే సమర్థుడైన అధికారి. ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వ అధికారంలో వున్నా, వ్యక్తిగత పేరు కన్నా ప్రభుత్వానికి పేరు రావాలని నిజాయితీగా కష్టపడి పని చేసే అత్యుత్తమ అధికారి రవిచంద్ర ముద్దాడ.














