- స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందిన నారా కుటుంబం
- అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షల విరాళం
- అన్నప్రసాద సముదాయంలో భక్తులకు స్వయంగా అల్పాహారం వడ్డించిన సీఎం కుటుంబ సభ్యులు
తిరుమల (చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. మనవడు నారా దేవాన్ష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం నారా చంద్రబాబు కుటుంబం శుక్రవారం కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని, స్వామివారి ఆశీస్సులు పొందారు. దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ముఖ్యమంత్రి ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఇతర కుటుంబ సభ్యులకు మహాద్వారం వద్ద ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద మొక్కుకున్న అనంతరం కుటుంబ సమేతంగా శ్రీవారిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రికి అర్చకులు స్వామివారి శేష వస్త్రాన్ని అందించారు. తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రివర్యులకు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, విశ్వావసు నామ సంవత్సర పంచాంగం, డైరీ, క్యాలెండర్, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులను చైర్మన్, ఈవోలు అందించారు.
స్వామివారి దర్శనం అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్… భక్తులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. ఈ సందర్భంగా భక్తులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయంటూ భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం భక్తులతో కలిసి ఆయన ప్రసాదం స్వీకరించారు. ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను చంద్రబాబునాయుడి కుటుంబం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్కు విరాళంగా ఇచ్చింది. ఏటా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుని అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఆలయ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, పనబాక లక్ష్మి, ఎం.శాంతా రామ్, నన్నూరి.నర్సిరెడ్డి, జీ. భాను ప్రకాష్ రెడ్డి, ఎస్ .నరేష్ కుమార్, పి.రామమూర్తి, సౌరభ్ హెచ్.బోరా, టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.