- పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించాలన్న ఐటీ మంత్రి లోకేష్
- ‘ఎన్ విడియా’ రాజ్ మిర్ పూరితో భేటీలో ప్రతిపాదన
- భాగస్వామ్య సంస్థలు పెట్టుబడులు పెట్టేలా సహకరించాలని విజ్ఞప్తి
శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్ఏ `చైతన్య రథం): గేమింగ్, చిప్ డిజైనింగ్, జీపీయు మ్యానుఫ్యాక్చరింగ్లో అంతర్జాతీయస్థాయి అగ్రగామి సంస్థ ఎన్ విడియా వైస్ ప్రెసిడెంట్ (ఎంటర్ప్రైజ్ అండ్ క్లౌడ్ సేల్స్) రాజ్ మిర్ పూరితో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ శాంటాక్లారాలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్లో ఏఐ నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల బలోపేతానికి సహకారం అందించాలని కోరారు. ఏపీలో పరిపాలన మరియు వర్క్ఫోర్స్ అభివృద్ధికి ఏఐ నైపుణ్యాలు, రియల్ టైమ్ గవర్నెన్స్, ఏఐ చాట్బాట్ వ్యవస్థను ప్రారంభించామని వివరించారు. ప్రభుత్వ అధికారులకు ఏఐ శిక్షణా కార్యక్రమాలకు మద్దతివ్వాలని, పౌరసేవా వ్యవస్థల్లో ఏఐ అమలుకు అవసరమైన శిక్షణ, ఏఐ పాఠ్యంశాల రూపకల్పనకు సహకరించాలని కోరారు. విద్యార్థులు, పరిశోధకులకు క్వాంటమ్ సిమ్యులేటర్లు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు/ ఆర్ అండ్ డి సంస్థలతో పైలట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి లోకేష్ ప్రతిపాదించారు.
‘‘స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమల అభివృద్ధికి సహకారం అందించండి. ఎన్ విడియా భాగస్వామ్య నైపుణ్య వినియోగం (ఉదా:పెగట్రాన్), తయారీ భాగస్వాములు (ఒఎస్ఏటి, ఏటీఎంపి) ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలా సహకారం అందించండి. రాష్ట్రంలో ఏఐ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు, విధాన ప్రోత్సాహాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ ట్విన్స్ మరియు ఏఐ ఆధారిత పరిశ్రమల ఆప్టిమైజేషన్ కోసం ఎన్ విడియా ఓమ్నివెర్స్, ఇజాక్ సిమ్ వినియోగించేలా రాష్ట్రంలో స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించండి. భారతదేశంలో డీప్టెక్ స్టార్టప్ల కోసం ఎన్ విడియా 850 మిలియన్ డాలర్లకు పైగా నిధులను ప్రకటించింది. ఏపీలోవున్న డీప్టెక్ స్టార్టప్ల పెట్టుబడులు/ మెంటారింగ్ కోసం ఆ నిధులను అనుసంధానం చేయండి. గతంలో ఏపీ ప్రభుత్వంతో ఎన్ విడియా చేసుకున్న అవగాహన ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు చొరవచూపాలి’’ అని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
ఎన్ విడియా వైస్ ప్రెసిడెంట్ ఎంటర్ప్రైజ్ అండ్ క్లౌడ్ సేల్స్ రాజ్ మిర్ పూరి మాట్లాడుతూ… ‘‘యూఎస్ వెలుపల అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం భారత్లోని బెంగుళూరులో ఎన్ విడియాకు ఉంది. ప్రస్తుతం మేం ఏఐ, గ్రాఫిక్స్, నెట్వర్కింగ్పై దృష్టి సారించాం. ఏఐ స్వీకరణ కోసం భారతీయ స్టార్టప్లు, ఐఎస్వీలు, ఎంటర్ప్రైజెస్ (ఉదా.టాటా గ్రూప్, రిలయన్స్ జియో)తో భాగస్వామ్యం వహిస్తున్నాం. నైపుణ్య ప్రోత్సాహకాల్లో (ఉదా.ఎన్ విడియా, డీప్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్), విద్యా సహకారాల్లో (ఉదా:ఐఐటి, ఐఐఎస్సి) పెట్టుబడులు పెడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని హామీ ఇచ్చారు. సమావేశంలో విల్ రామే సీనియర్ డైరెక్టర్ పాల్గొన్నారు. (డేటా సెంటర్, గేమింగ్, ఏఐ, ప్రొఫెషనల్ విజువలైజేషన్ విభాగాల ద్వారా గత ఏడాది 110 బిలియన్ డాలర్ల వార్షికాదాయం సాధించిన ఎన్ విడియా సంస్థ… ప్రస్తుతం 4.35 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ప్రపంచంలోనే నెం.1 కంపెనీగా ఉంది.














