అమరావతి (చైతన్యరథం): మత్తును కలిగించే ఔషధాల విక్రయాలపై ఈగల్ విభాగం పోలీసులు నిఘా పెట్టారు. ఔషధాల దుర్వినియోగంపై రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఒకేసారి అధికారులు తనిఖీలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వంద బృందాలతో మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో ఐజీ ఈగల్ టీమ్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. ఆపరేషన్ గరుడలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. ఈగల్ టీమ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. సైకోటిక్ మందులను వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ హెచ్చరించారు. ఆల్బెండ జోలమ్, ట్రెమడాల్ లాంటి సైకోటిక్ మందులను అనధికారికంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు.
రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నిర్దేశానుసారం రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి డ్రగ్స్ దుర్వినియోగంపై మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీల పై దాడులు నిర్వహించామని ఈగల్ (ఎలైట్ యాంటీ-నార్కొటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) ఐజీ ఆకే రవి కృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో, హోం మంత్రి వంగలపూడి అనిత సూచనలకు అనుగుణంగా ఆపరేషన్ గరుడ చేపట్టామన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర డిజిపి పనిచేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా విజయవాడలోని గుణదలలో మందుల షాపు వద్ద పాత్రికేయులతో ఈగల్ ఐజీ ఆకే రవి కృష్ణ మాట్లాడుతూ ఈ తనిఖీలకు ఆపరేషన్ గరుడ అని పేరు పెట్టామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 100 బృందాల ఆధ్వర్యంలో ఆపరేషన్ గరుడ ను నిర్వహించినట్లు తెలిపారు. ఆపరేషన్ గరుడ లో భాగంగా శుక్రవారం ఉదయం గుణదలలోని ముందుల షాపులో ఆకస్మిక తనిఖీ చేశామన్నారు. కొన్ని మత్తు ఇచ్చే టాబ్లెట్స్, ఇంజక్షన్స్ ను కొనుగోలు చేసి యువత బానిసలుగా మారుతున్నారు.. గంజాయిని కట్టడి చేస్తున్న నేపథ్యంలో యువత ఈవిధమైన నిబంధనలకు విరుద్ధంగా మందులను కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. గతంలో కంటే కట్టుదిట్టంగా ఎన్డిపిఎస్ యాక్ట్ ను అమలు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు జరిపి అక్రమ అమ్మకాలు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈగల్ ఐజీ ఆకే రవి కృష్ణ తెలిపారు.
డ్రగ్స్ డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతి లేని మందులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మందులకు సరిగా బిల్లులు ఇవ్వని వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రిస్క్రిప్షన్ మీద అమ్మవలసిన మందులు మాత్రమే మందుల షాపులో విక్రయించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మందులు అమ్మే మెడికల్ షాపులపై చర్యలు తీసుకుంటామన్నారు.