గాజువాక (చైతన్య రథం): అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తన నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి సామూహిక ఆనందోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని -ఒకే రాజధాని, ఒకే నినాదం” అని ఉద్ఘాటించారు. తద్వారా ఏకీకృత రాజధానిపై పార్టీకి ఉన్న అచంచలమైన వైఖరిని నొక్కి చెప్పారు. అమరావతి తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి, ఆకాంక్షలకు ప్రతీక అని ఆయన అభివర్ణించారు. ప్రజాభావానికి న్యాయం చేకూర్చే ఈ శాసనపరమైన ఆమోదాన్ని ఒక చారిత్రాత్మక మైలురాయిగా ఆయన పేర్కొన్నారు. నూతన నిబద్ధతకు పిలుపునిస్తూ, ఆశయం, పరిపాలనా దార్శనికత రెండింటినీ ప్రతిబింబించేలా అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని శ్రీనివాసరావు కోరారు. ‘అమరావతికి చట్టబద్ధత’ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందేందుకు సహకరించిన ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్షా, ఎంపీలకు కతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్, తెలుగుదేశం పార్లమెంటరీ కమిటీ చేసిన కషికి అభినందనలు తెలిపారు.














