- స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కలెక్టర్లకు ర్యాంకింగులిస్తాం
- కమిట్మెంట్… కన్విన్స్… కో-ఆపరేట్
- పెట్టుబడులను రాబట్టేందుకు కలెక్టర్లకు 3్పు ఫార్మూలను నిర్దేశించిన ముఖ్యమంత్రి
- అమరావతిలో క్రియేటీవ్ సిటీ, హిందూపూర్లో ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ప్రకటన
- 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో పెట్టుబడులు, టూరిజం శాఖలపై సీఎం సమీక్ష
అమరావతి (చైతన్య రథం): పెట్టుబడులు రాబట్టడం ఆయా శాఖలకు సంబంధించిన అంశంగా కాకుండా… జిల్లా కలెక్టర్లు బాధ్యతగా తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఈమేరకు పెట్టుబడులు రాబట్టుకునేలా సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల్లో పెట్టబుడులను రాబట్టేలా కలెక్టర్లు కమిట్మెంట్తో పెట్టుబడిదారులను అన్వేషించి… పెట్టుబడులు పెట్టేందుకు కన్విన్స్ చేసి… ముందుకొచ్చిన వారికి పూర్తిగా కో-ఆపరేట్ చేయాలంటూ జిల్లా కలెక్టర్లకు త్రీ`సీ ఫార్ములాను సీఎం చంద్రబాబు నిర్దేశించారు. 6వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండోరోజున ముఖ్యమంత్రి వివిధ అంశాలపై సమీక్షించారు. పెట్టబుడి, టూరిజం శాఖలపై జరిగిన చర్చలో సీఎం కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… “రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను వేగంగా గ్రౌండ్ అయ్యేలా చర్యలు చేపట్టాలి.
పెట్టుబడులను ఆకర్షించేలా జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. పెట్టుబడులు వస్తే… స్థానికంగా యువతకు ఉపాధి, ప్రజల తలసరి ఆదాయం పెరుగుతాయి. విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ పేరుతో అభివృద్ధి చేస్తున్నాం. విశాఖ రీజిజయన్కు పరిశ్రమల కార్యదర్శి యువరాజ్, అమరావతికి పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్, తిరుపతి రీజియన్కు ముఖేష్ కుమార్ మీనా బాధ్యత వహిస్తారు. రీజియన్లవారీగా పరిశ్రమలు, పెట్టుబడులు, ఆయా ప్రాంతాల ఆర్థికాభివృద్ధి బాధ్యతను ఈ అధికారులు తీసుకుంటారు. పెట్టుబడులపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు సమీక్షించి ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేందుకు తక్షణం చర్యలు చేపట్టాలి. అనుమతులు వేగంగా ఇవ్వటంతోపాటు భూకేటాయింపులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చూడాలి. పరిశ్రమలకు నీటిని ఇస్తేనే వేగంగా ఉత్పాదన ప్రారంభిస్తారు. ఓర్వకల్లులో పారిశ్రామిక క్లస్టర్ రూపకల్పన చేశాం. ఇప్పుడు ఎయిర్పోర్టులాంటి మౌలిక సదుపాయాలు కూడా వచ్చాయి. ఇప్పుడు భవిష్యత్తులో ఓ మేజర్ పారిశ్రామిక హబ్గా మారుతుంది. కడప జిల్లాలో కొప్పర్తి కూడా ఆ పారిశ్రామిక క్లస్టర్గా తయారు కావాలి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
పెట్టుబడులపై జిల్లాల్లోనూ సమావేశాలు పెట్టాలి
“పెట్టుబడులపై జిల్లాల్లోనూ సమావేశాలు నిర్వహించాలి. పెట్టుబడులు రాబట్టేందుకు కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంపై జిల్లాల వారీగా ర్యాంకులిస్తాం. 2019-24లో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అమర్ రాజా కంపెనీ తిరుపతిలో కార్పోరేట్ ఆఫీస్ పెట్టింది. వారినీ గత పాలకులు పారిపోయేలా చేశారు. 2014-19లో పరిశ్రమలకు ఇచ్చిన భూములను గత ప్రభుత్వం వేరే అవసరాలకు వాడేసింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీని బెంగళూరుకు పోటీగా తీర్చిదిద్దాం. మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ను తీర్చిదిద్దాం. ఎకో సిస్టం కల్పించాం. ఇప్పుడు ఆ ఫలితాలు హైదరాబాద్ అనుభవిస్తోంది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం అదే తరహా ఎకో సిస్టం ఏర్పాటు చేస్తున్నాం. ఏదైనా జిల్లాల్లో పరిశ్రమలు రాకుంటే ఆ జిల్లాల్లో టూరిజం ప్రమోట్ చేయాలి. లేదా ఐటీని ప్రమోట్ చేయాలి. ఎంఎసఎంఈలు ప్రమోట్ చేయాలి.. అగ్రికల్చర్ ప్రమోట్ చేయాలి.
ఇలా ఏదోక రంగంలో ఆయా జిల్లాలకున్న ప్రత్యేకతలను, అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని ఆయా రంగాల్లో అభివృద్ధి చేయాలి. జిల్లాలకున్న అడ్వాంటేజీలను ప్రమోట్ చేసి పెట్టుబడులను ఆకర్షించాలి. పెట్టుబడులు పెట్టేవారందరూ తమ దగ్గరకే రావాలని జిల్లా కలెక్టర్లు… మంత్రులు అనుకోకూడదు. పెట్టుబడులు పెట్టే వారెవరో గుర్తించి వారిని కలెక్టర్లు, మంత్రులు సంప్రదించే పరిస్థితి రావాలి. ఇదేవిధంగా హైదరాబాద్ను ప్రమోట్ చేయడంవల్లే ఐఎస్బీ వచ్చింది. జిల్లాల్లో వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాలు, తలసరి ఆదాయం ఎంతమేర పెంచాం అన్నదానిపై జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. తదుపరి సమావేశం నుంచి ఏ జిల్లా కలెక్టర్ ఎంతమేర పరిశ్రమల్ని ప్రోత్సహించారన్న దానిపై సమీక్షిస్తాం. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైల్వేలాంటి ఇన్ఫ్రా ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. హిందూపూర్ సమీపంలో ఎలక్ట్రానిక్స్ సిటీని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నాం” అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఆతిథ్యరంగంలో అభివృద్ధికి ఆస్కారం
“ఏపీలో ఆతిథ్య రంగానికి పెద్దఎత్తున అవకాశాలు ఉన్నాయి. అందుకే పర్యాటకానికి పారిశ్రామిక హోదా కల్పించాం. ఏమీలేని ప్రాంతాల్లోనే కొన్ని దేశాల్లో టూరిజం అభివృద్ధి చేస్తున్నారు. ఏపీలో అనేక చరిత్రాత్మక ప్రాంతాలు.. ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేసే అంశంపై ఫోకస్ పెట్టాలి. పురాతన కట్టడాలు చాలా ఉన్నాయి. వాటికి ఎంతో చరిత్ర ఉంటుంది. వాటిని ఎంకరేజ్ చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల హోటల్ గదులు సిద్ధం కావాలి. వివిధ ప్రాంతాల్లో హోమ్ స్టేలు పెద్దఎత్తున రావాలి. కన్వెన్షన్ సెంటర్లు, మైస్ సెంటర్లు నిర్మాణం చేయాలి. యుద్ధ ప్రభావాల నేపథ్యంలో విదేశాలకంటే స్థానికంగా ఉండే పర్యాటకానికి పెద్దఎత్తున ఆకర్షణ పెరుగుతుంది. దేవాలయాలు పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు… మానసిక ఉల్లాసాన్ని కలిగించే ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. పాపికొండలు, గండికోట భారత్ కే గ్రాండ్ కాన్యన్, సూర్యలంక మరో గోవాగా తయారవుతుంది. జిల్లాలవారీగా ఆయా ప్రాంతాల్లోవున్న పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలి. టూరిజం ఎక్స్ పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేయటంతోపాటు మాన్యుమెంట్లను కూడా అభివృద్ధి చేయాలి. తిమ్మమ్మ మర్రిమాను వద్ద మౌలిక సదుపాయాలు కల్పిస్తే మంచి పర్యాటక ప్రాంతంగా మారుతుంది.
కంభం చెరువు ఆసియాలోనే అతిపెద్ద మానవ నిర్మిత నీటి వనరు. పులికాట్ సరస్సులో పర్యాటక ప్రాజెక్టును ప్రతిష్టాత్మక కంపెనీలకు అప్పగించి అభివృద్ధి చేయాలి. స్థానికుల్ని ఈ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం చేయటం ద్వారా వేగంగా అభివృద్ధి జరుగుతుంది. జాతీయ రహదారులపై వే సైడ్ అమెనిటీస్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, నైట్ హాల్ట్ కోసం గదులు నిర్మాణం చేపడితే పెట్టుబడులు వస్తాయి. ఏపీఐఐసీ ద్వారా చేసే ల్యాండ్ అలాట్మెంట్ లో 5 ఎకరాల వరకూ కేటాయింపులు చేసేలా జిల్లా కలెక్టర్లకు ఆథరైజేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. విజయవాడలోని డిస్నీల్యాండ్, భవానీ ఐ ల్యాండ్లను పర్యాటకంగా అభివృద్ధి చేద్దాం. అమరావతిలో క్రియేటివ్ సిటీ ఏర్పాటు చేస్తాం. అమరావతిలో కంటెంట్ క్రియేషన్ చేసే వారిని ప్రొత్సహిస్తాం. ఏఐ, ఫిల్మ్, కంటెంట్ క్రియేషన్ పరిశ్రమలకు పెద్దపీట వేస్తాం. రాష్ట్రంలో క్రియేటివ్ ఎకానమీ పెరిగేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం” అని ముఖ్యమంత్రి వివరించారు. సమావేశంలో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.














