- తొలుత యండ్రాయి, వడ్డమాను గ్రామాల్లో నిర్వహణ
- రాజధానిలో రైల్వే ట్రాక్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్ల నిర్మాణం
- కృష్ణా తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్
- 112 వీధిశూల ప్లాట్లకు ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపు
- మంత్రి నారాయణ వెల్లడి
అమరావతి (చైతన్యరథం): రాజధాని అమరావతి ప్రాంతంలో రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీల నిర్మాణం కోసం 7 గ్రామాల్లో భూ సమీకరణకు బుధవారం నుంచి గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ తెలిపారు. తొలిరోజు యండ్రాయి, వడ్డమాను గ్రామాల్లో భూ సమీకరణపై గ్రామసభలు నిర్వహించనున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన 57వ సీఆర్డీఏ అథారిటీ సమావేశ వివరాలను మంత్రి నారాయణ సచివాలయంలోని ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడిరచారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధాని అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ కోసం గ్రామసభలు నిర్వహించేందుకు సమావేశం ఆమోదం తెలిపిందన్నారు. ఏపీ సీఆర్డీఏలో 754 పోస్టులు జీవో 81 ద్వారా 2015 ఏప్రిల్ లోనే శాంక్షన్ అయి ఉన్నాయని, వీటిలో రెగ్యులర్, కాంట్రాక్ట్, తదితర పోస్టులు ఉన్నాయని, వీటి భర్తీకి మార్పులు, చేర్పులతో అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. అలాగే రాజధాని ప్రాంతంలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్ అందుకునే వారిలో 7గురు తల్లితండ్రులు లేని అనాథ మైనర్ లు ఉన్నారని వారికి పెన్షన్ మంజూరు కు అనుమతి లభించిందన్నారు. వాస్తు ప్రకారం వీధి శూల ఉన్న 112 కమర్షియల్ ప్లాట్స్కి మార్చుకునే వెసులుబాటుకు ఆమోదం తెలిపిందన్నారు. ఒకవేళ ప్లాట్ అలాట్ అయిన లబ్ధిదారుడు మరోకరికి ఆ ప్లాట్ ను అమ్మకం చేస్తే వారికి ఈ ప్లాట్ లు మార్చుకునే అవకాశం ఉండదన్నారు. కృష్ణా రివర్ ఫ్రంట్ మెరీనా కోసం ఒక ఎకరా భూమి ని టూరిజం పాలసీ కింద ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.
సీడ్ యాక్సిస్ రోడ్ మార్గంలో మంగళగిరి రోడ్ కు కనెక్టవిటీకి మధ్యలో 4.5 ఎకరాల భూమి ఇప్పటి వరకు ల్యాండ్ పూలింగ్ కు ఆయా రైతులు ఇవ్వలేదని మంత్రి నారాయణ తెలిపారు. ఫిబ్రవరి లోపు స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని, సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం వేగవంతం చేయడంలో భాగంగా ఆ 4.5 ఎకరాల భూమికి భూ సేకరణకు నోటీసులు ఇవ్వనున్నామని వివరించారు. నిబంధనల మేరకు ఆ భూమిని తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ చేసిన 34వేల ఎకరాల భూమిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 4026 అధికారుల భవనాల నిర్మాణం వేగం పుంజుకుందన్నారు. 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు పనులు నిర్ణయించుకున్న గడువులోపు పూర్తి చేస్తామన్నారు.
అమరావతికి మరింత గుర్తింపు రావడానికి ఈ ప్రాంతంలో స్మార్ట్ ఇండస్ట్రీస్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీల నిర్మాణం కోసం 7 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేయనున్నామన్నారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అనంతరం ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రారంభిస్తామన్నారు. వాటిలో ముఖ్యంగా రెండు వరుసల రహదారులు, అండర్ గ్రౌండ్ కేబుల్స్, వాటర్ లైన్స్, తదితర ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వడ్డమాను, హరిచంద్రాపురం, పెద్దపరిమి గ్రామాల పరిధిలోని 9097 .56 ఎకరాల పట్టాభూమి, 7.01ఎకరాల అసైన్డ్ భూమి, అదేవిధంగా పల్నాడు జిల్లాలోని నాలుగు గ్రామాల్లో మొత్తం 7465 ఎకరాలు పట్టా భూమి, 97 ఎకరాల అసైన్డ్ మొత్తంగా 16,666.57 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుంటున్నామని వివరించారు. రైతులకు ఇచ్చే ప్లాట్లు, మౌలిక వసతుల కల్పన తదుపరి మిగిలిన 2500 ఎకరాల భూమిలో స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్ కు వినియోగిస్తామన్నారు.
పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణంలో పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని నాలుగు రెవెన్యూ గ్రామాల్లో భూములు తీసుకోవడంపై ఈ ప్రాంత రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. స్వచ్ఛందంగా రైతులు ల్యాండ్ పూలింగ్కు ముందుకు వస్తున్నారన్నారు. రైతులనుండి ఇటువంటి సానుకూల స్పందన రావటం శాసనసభ్యుడిగా నాకు సంతోషదాయకమని, ల్యాండ్ పూలింగ్ పై అవగాహన కోసం 10 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాన్ని రైతులు స్వాగతించారన్నారు. ప్రస్తుతం వైకుంఠపురం, పెద్దమద్దూరు, యండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో నోటిపికేషన్ ప్రకటించారు. ఈ నాలుగు గ్రామాల్లో 9500 ఎకరాల్లో రెవెన్యూ ల్యాండ్ ఉంటే రైతులకు చెందిన భూమి 7500 ఎకరాలు ఉందన్నారు. బుధవారం నిర్వహించే గ్రామ సభలో యండ్రాయిలోని 1900 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుందని తెలిపారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ మాట్లాడుతూ 57వ సీఆర్డీఏ అథరిటీ సమావేశంలో ముఖ్యమైన 5 అంశాలపై నిర్ణయం తీసుకున్నారన్నారు. వాటిలో ప్రధానమైనవి ఏపీ సీఆర్డీఏలో 754 పోస్టుల ర్యాటిఫికేషన్కు అథారిటీ ఆమోదం తెలపడం జరిగిందన్నారు. రాజధాని ప్రాంతంలో భూమి లేని నిరుపేద అనాథ చిన్నారులకు పెన్షన్ అందించడం, రివర్ ఫ్రంట్ ఏరియాలో మెరైన్ కోసం ఒక ఎకరా భూమి శాంక్షన్ చేయడానికి ఆమోదం లభించిందన్నారు. వీధి శూల ఉన్న 112 ప్లాట్ల ను మార్చడానికి అనుమతి లభించిందన్నారు.














