- ఉప ముఖ్యమంత్రి పవన్ ఉద్ఘాటన
- రాష్ట్ర అభివృద్ధిపై సమగ్ర ప్రణాళికతో ముందుకు
- ఉపాధి హామీ పనులతో అన్నదాతల కళ్లలో వెలుగులు నిండాలి
- గత పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం
- వ్యవస్థలను పటిష్టపరుస్తూ ముందుకు వెళుతున్నాం
- అనుభవజ్ఞులైన సీఎం చంద్రబాబు వల్లే పల్లె పండుగ విజయవంతం
- కర్నూలు జిల్లా, పుడిచర్లలో ఫామ్ పాండ్స్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి
- రాష్ట్రవ్యాప్తంగా లక్షా 55 వేల ఫామ్ పాండ్స్ నిర్మాణానికి శ్రీకారం
కర్నూలు (చైతన్యరథం): రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తోందని ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మా ప్రభుత్వంలో వ్యవస్థలను పటిష్ట పరుచుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు.
శనివారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం, పుడిచెర్లలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూముల్లో సేద్యపు నీటి కుంటల(ఫామ్ పాండ్స్) నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 55 వేల ఫామ్ పాండ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అధ్యక్ష్యతన నిర్వహించిన బహిరంగ సభను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే.. కూటమి ప్రభుత్వంలో గ్రామాల్లో ప్రజలకు ఉపాధి కల్పించే దిశగా ఉపాధి హామీ పనులు ముందుకు తీసుకువెళుతున్నామన్నారు. ప్రజలకు ఉపాధి, ఆర్థిక స్థిరత్వం కల్పించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో అనుభవజ్ఞులైన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండబట్టే పల్లె పండుగ విజయవంతం అయ్యిందన్నారు. గ్రామాల్లో అభివృద్ధి అంటే రైతన్న బలపడాలి. ఉపాధి హామీ పనులతో అన్నదాతల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలి. అదే కూటమి ప్రభుత్వ ఆశయం అన్నారు. త్వరలో ఒక్కో నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తామన్నారు.
గత ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రాజకీయ ఉపాధి పథకంగా మార్చారు. అలాంటి వాటిని ఎదుర్కోవడానికి బలమైన అధికారులను ఏర్పాటు చేశాం. పల్లె పండుగ పనుల్లో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. కర్నూలు జిల్లాలో రూ.75 కోట్లతో 117 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాం. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాలో 98 శాతం రోడ్ల నిర్మాణం పూర్తయ్యింది. రైతులు నీరు నిలవ చేసుకోగలిగితే సమస్య ఉండదు. వర్షాలు రాగానే పంట కుంటలు నిండేలా ప్రణాళికలు రూపొందిస్తాం. గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను పటిష్టపరచిన పాపాన పోలేదు. వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ కింద సొంత గ్రామాల్లోనే పనులు కల్పించాం. ఉపాధి హమీ కింద ఇప్పటి వరకు రూ. 9,597 కోట్లు ఖర్చు చేశాం. ప్రజలకు ఉపాధి, ఆర్థిక స్థిరత్వం కల్పించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని పవన్ స్పష్టం చేశారు.
ఉపాధికి ఊతం..
జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఎకరం 30 సెంట్ల భూమిలో 6 సెంట్లలో చెరువు, రెండు సెంట్లలో గట్టు ఉండే విధంగా నిర్మిస్తున్నాం. పుడిచర్ల గ్రామానికి చెందిన రైతు సూర రాజన్నకు చెందిన భూమిలో ఫామ్ పాండ్కి భూమి పూజ చేశాం. ఈ పథకం ద్వారా ఉపాధి కూలీలు లబ్ధి పొందుతున్నారు. గ్రామాల్లో పనులు లేక నలిగిపోతున్నవారికి ఉపాధి కల్పించేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకానికి కావాల్సిన అర్హత కష్టపడి పని చేయడమే. గత ప్రభుత్వంలో ఎవరు లబ్ధిదారులో కూడా తెలియనంతగా అవకతవకలకు పాల్పడ్డారని పవన్ విమర్శించారు.
రతనాలసీమగా మార్చడమే లక్ష్యం
రాయలసీమలో నేల స్వభావాన్ని బట్టి ఇక్కడ నీటికి కటకట ఉంటుంది. వర్షం వచ్చినా నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. శ్రీకృష్ణ దేవరాయల హయాం మాదిరి రాయలసీమ మళ్లీ రతనాలసీమ కావాలి. అదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. సీమకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చేలోపు రైతుల సౌలభ్యం కోసం ఫామ్పాండ్స్ నిర్మిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 55 వేల పాండ్లు మే నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మొత్తం పాండ్లు పూర్తయితే ఒక టీఎంసీ నీటి నిల్వకు అవకాశం ఉంటుంది. రైతులంతా బాగుండాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పంట పొలాల్లో సేద్యపు నీటి కుంటల ఏర్పాటును ముందుకు తీసుకువెళుతోందని పవన్ చెప్పారు.
గ్రామసభలతో ప్రపంచ రికార్డు
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒకే రోజు 13, 326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించాం. సీఎం చంద్రబాబు అనుభవాన్ని ప్రేరణగా తీసుకుని ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడంతో పాటు అభివృద్ధి పనుల జాబితా తీసుకోవడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించాం. గ్రామ పంచాయతీల్లో గత ప్రభుత్వ హయాంలో జాతీయ దినోత్సవాల సమయంలో జెండా పండుగ చేయడానికి రూ. 100 నుంచి రూ. 250 వరకు ఖర్చు చేస్తే.. కూటమి ప్రభుత్వం ఆ ఖర్చుని రూ. 10 వేల నుంచి 25 వేలకు పెంచింది. పంచాయతీరాజ్ శాఖలో సమర్థవంతమైన పాలన అందించేందుకు పునర్నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నరేగా నిధుల ద్వారా గ్రామాల్లో ఉపాధి కూలీలకు వారి గ్రామాల్లోనే ఉపాధి అందించాం. రూ. 6 వేల కోట్లు నేరుగా కూలీలకు అందించి ఉపాధితోపాటు ఆర్థిక స్థిరత్వం కల్పించే దిశగా అడుగు ముందుకు వేశాం. గత ప్రభుత్వంలో ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మిస్తే.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 8 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు నిర్మించాం. వంద మందికి పైగా నివసిస్తున్న గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యాలు కల్పించాం. డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలు చూడాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో జన్మన్ పథకం కింద విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులకు నిధులు కేటాయించామని పవన్ తెలిపారు.
సమస్యలు పరిష్కరిస్తాం
ఎంపీడీవోల సమస్యలు మా దృష్టికి తెచ్చారు. ఆ సమస్యలకు పరిష్కారం వెతుకుతాం. పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్, గ్రామ సచివాలయం, ఇంజినీరింగ్ అసోసియేషన్ సమస్యలకు పరిష్కారం వెతుకుతాం. ఎస్టీల్లో చేర్చాలంటూ వాల్మీకి బోయ సంక్షేమ సంఘం నుంచి అర్జీ వచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. ముఖ్యమంత్రితోనూ, కేబినెట్లోనూ ఈ సమస్యపై మాట్లాడుతాను. రెడ్డి సంఘం నాయకులు కర్నూలు విమానాశ్రాయానికి స్వతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ సరసింహారెడ్డి పేరు ప్రతిపాదించారు. దాన్ని ముందుకు తీసుకువెళ్తాం. నేను కులాలు, మతాల గురించి మాట్లాడితే చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. నేను ధర్మాన్ని మాత్రం బలంగా పాటిస్తాను. నా స్వధర్మాన్ని పాటిస్తాను. అన్ని ధర్మాలను గౌరవిస్తాను. బీసీ డీ లో చేర్చాలని గాజుల బలిజలు అడిగారు. వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తాను. బుడగ జంగాలకి స్వతంత్య్ర అనంతరం కుల ధృవీకరణ కూడా లేకుండాపోయింది. వారికి న్యాయం చేస్తామని పవన్ హామీ ఇచ్చారు.
గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి స్థానిక శాసనసభ్యుల కోరిక మేరకు అభివృద్ధి పనులు ముందుకు తీసుకువెళతాం. పరిమితి మేరకు ప్రణాళికలు రూపొందించుకుని పూర్తి చేస్తాం. ఉపాధి హామీ బకాయిలు రెండు రోజుల్లో జమ అయ్యేలా చూస్తాం. అవసరం అయితే ఈ విషయంపై ముఖ్యమంత్రితో మాట్లాడతాం. కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని గతంలో చెప్పాను. ఆ గ్రామ అవసరాలు తీర్చేందుకు సొంత ట్రస్ట్ నుంచి రూ.50 లక్షల నిధులు కేటాయించి సౌకర్యాలు కల్పిస్తాం. ప్రభుత్వం పథకాల ద్వారా చేయదగిన పనులు అధికారులతో మాట్లాడి పూర్తి చేస్తాం. కొణిదెల గ్రామంతోపాటు అన్ని గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తాం. ఒక్కో జిల్లాలో రెండు నుంచి మూడు రోజులు ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తామని పవన్ చెప్పారు.
తలకు పాగా చుట్టి.. గడ్డ పార చేతబట్టి
పంట పొలాల్లో సేద్యపు నీటి కుంటల (ఫామ్ పాండ్) ప్రారంభోత్సవానికి కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండలం, పుడిచర్లకు వచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా ఫామ్ పాండ్ తవ్వకానికి శ్రీకారం చుట్టారు. సొంత వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం అలవాటు ఉన్న ఆయన తలకు పాగా చుట్టి రైతుగా మారిపోయారు. గడ్డపార చేతబట్టి శంకుస్థాపనకు సిద్ధం చేసిన ప్రాంతంలో గణపతిని పూజించి కుంట తవ్వకాన్ని ప్రారంభించారు. గడ్డపారతో గుంత తవ్వి స్వయంగా మట్టిని పారతో ఎత్తి గంపలో వేశారు. ఉపాధి కూలీలతో కలసి పనిలో పాలు పంచుకోవడంతోపాటు వారందరినీ వేదిక మీదకు పిలిచి లబ్ధిదారులుగా పరిచయం చేశారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి, పాణ్యం, నందికొట్కూరు, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, గిత్తా జయసూర్య, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.