అమరావతి (చైతన్య రథం): మూడవ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల మధ్య తలసరి ఆదాయంలో వచ్చిన మార్పులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2022-23 సంవత్సరానికిగాను సత్యసాయి జిల్లాలో తలసరి ఆదాయం 2,19,234 రూపాయలు. అనంతపురం జిల్లాలో 2,33,521 రూపాయలు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1,93,763 రూపాయలుగా నమోదైంది. సాధారణంగా అనంతపురం జిల్లా కరువు పీడిత ప్రాంతంగా, వెనుకబడిన జిల్లాగా పరిగణించబడుతుంది. అయితే, కోనసీమలో తలసరి ఆదాయం ఎక్కువుగా ఉంటుందని భావిస్తారు. ఉద్యాన రంగంలో సాధించిన అభివృద్ధి కారణంగా అనంతపురం జిల్లాలు తలసరి ఆదాయంలో వృద్ధిని సాధించాయి. తలసరి ఆదాయంలో ముందున్న జిల్లాలలోని ఉత్తమ విధానాలను వెనుకబడిన జిల్లాలలో కూడా అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, పశుసంవర్ధక రంగం అధిక ఆదాయాన్ని అందిస్తూ, ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోందని, ఆ తర్వాత ఉద్యానవన, తయారీ రంగాలు ఉన్నాయని, ఈ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు.