- శాసనసభలో విద్య, ఐటీ మంత్రి లోకేష్
- ప్రయివేట్ వర్శిటీల బిల్లుకు సభామోదం
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ రెండో సవరణ బిల్లు-2025ను మంత్రి నారా లోకేష్ శానససభలో ప్రవేశపెట్టారు. సభ ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సెంచూరియన్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. సాంకేతిక అంశాల్లో ఇబ్బందులు తలెత్తాయి. ప్రైవేటు రంగంలో విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఉన్నాం. గ్రీన్ ఫీల్డ్ గురించి ఇప్పటికే చర్చించాం. బ్రౌన్ ఫీల్డ్ కింద ప్రైవేటు యూనివర్సిటీగా గుర్తించాలని కోరుకున్నప్పుడు..కేంద్ర, రాష్ట్ర నిబంధనల ప్రకారం వీవీఐటీ ప్రైవేటు యూనివర్సిటీ గా గుర్తించాలని కోరడం జరిగింది. వారికి 50 ఎకరాల భూమి ఉంది. 4,75,278 చ.అడుగుల బిల్టప్ ఏరియా ఉంది. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇంక్యుబేటర్ సెంటర్స్ ఉన్నాయి.
11 యూజీ, పీజీ కోర్సులు ఉన్నాయి. సుమారు 700 మంది సిబ్బంది ఉన్నారు. 9,200 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సొసైటీ పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. వీవీఐటీని వీవీఐటీయూగా మార్చాలని కోరారు. అది కూడా 2016 యాక్ట్ కింద కన్వర్ట్ చేయాలని కోరారు. ఈ యాక్ట్ గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్త యూనివర్సిటీ, మరొకటి బ్రౌన్ ఫీల్డ్.. అంటే కన్వర్షన్. వీవీఐటీ కన్వెర్షన్ కింద బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ గా గుర్తించాలని కోరడం జరిగింది. యూనివర్సిటీ ఎప్పుడు వచ్చినా చట్టసభల్లో యాక్ట్ కింద సవరణ చేసి యూనివర్సిటీ పేరును ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.