- రెండేళ్లలో రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు
- భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం
- రిజిస్ట్రేషన్లకు డిజిటల్ భద్రత
- ప్రజల ఆస్తులకు సంపూర్ణ భద్రత కూటమి ప్రభుత్వ లక్ష్యం
- మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఉద్ఘాటన
అమరావతి (చైతన్యరథం): భూములపై ప్రజల హక్కులను పరిరక్షించడంలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. ప్రజల ఆస్తులకు సంపూర్ణ భద్రత కల్పించడమే లక్ష్యంగా రెండు సంవత్సరాల్లో రెవిన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలను అమలు పర్చామన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం ప్రచారం విభాగంలో పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ గత రెండేళ్లలో రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖల పరంగా అమలు చేసిన పలు సంస్కరణలు, సాదించిన ప్రగతిని వివరించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో భూ పరిపాలన వ్యవస్థను సమూలంగా ఆధునీకరించి, ప్రజల హక్కులకు సంపూర్ణ భద్రత, సేవల్లో పారదర్శకత, రికార్డులలో కచ్చితత్వం, పెట్టుబడులకు అనుకూలమైన భూ పరిపాలనను అందించే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందన్నారు.
ప్రజల ఆస్తులను రక్షించడం, భూ హక్కులను శాశ్వతంగా భద్రపరచడం, సాంకేతికత ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకురావడం, భూ వివాదాలను తగ్గించడం, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యుత్తమ, పారదర్శక, ప్రజా అనుకూల భూ పరిపాలన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ
లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో భూముల యాజమాన్య హక్కులపై ప్రజల్లో ఏర్పడిన అనిశ్చితి, ఆందోళనలు, సందేహాలను పూర్తిగా తొలగించి, భూమిపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తోందన్నారు. భూమి అనేది సామాన్యుడి జీవితకాల శ్రమకు ప్రతీకగా నిలిచే అమూల్యమైన ఆస్తి అని, ఆ ఆస్తికి చట్టపరమైన రక్షణ కల్పించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా రీ-సర్వేకు నూతన దిశ…
రాష్ట్రంలో గతంలో చేపట్టిన రీ-సర్వే ప్రక్రియపై రైతులు, భూయజమానులు, ప్రజల నుంచి వచ్చిన వేలాది ఫిర్యాదులు, అభ్యంతరాలను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించిందన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల వారీగా సమీక్షలు నిర్వహించి, ప్రజల అభిప్రాయాలు సేకరించి, ప్రతి గ్రామంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి నెల 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తున్నామని చెప్పారు. రీ-సర్వేలో భాగంగా భూయజమానుల సమక్షంలో సరిహద్దుల నిర్ధారణ, గ్రామస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ, అభ్యంతరాల పరిష్కారం, భూ రికార్డుల ధృవీకరణ, తుది ఆమోద ప్రక్రియ తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు.
వివాదాల పరిష్కార దిశగా చర్యలు…
గతంలో పెండింగ్లో ఉన్న వేలాది భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.04 లక్షల ఎకరాలకు సంబంధించిన భూ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి జిల్లా స్థాయి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు.
24 లక్షల పైగా పట్టాదారు పాస్బుక్కుల జారీ…
భూ హక్కుల భద్రతకు అత్యంత కీలకమైన పట్టాదారు పాస్బుక్కుల జారీ ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు. ఇప్పటివరకు 24 లక్షల పైగా కొత్త పట్టాదారు పాస్బుక్కులు జారీ చేశామని, త్వరలోనే అదనంగా 1.90 లక్షల పట్టాదారు పాస్బుక్కులు పంపిణీ చేయనున్నామన్నారు. క్యూ ఆర్ కోడ్ ఆధారిత ఆధునిక భద్రతా వ్యవస్థతో ఈ పాస్బుక్కులను రూపొందించడం వల్ల నకిలీలకు పూర్తిగా చెక్ పడుతుందని వివరించారు.
డిజిటల్ భూ భద్రతలో దేశంలోనే అత్యాధునిక వ్యవస్థ…
భూములపై అక్రమ రిజిస్ట్రేషన్లు, నకిలీ లావాదేవీలు, రికార్డుల ట్యాంపరింగ్కు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడంతో పాటు భూ యజమానుల హక్కులకు అత్యున్నత భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికత ఆధారిత పలు సంస్కరణలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా భూ యజమాని స్పష్టమైన అనుమతి లేకుండా ఎటువంటి ఆస్తి బదిలీ లేదా రిజిస్ట్రేషన్ జరగకుండా “డిజటల్ లాకింగ” వ్యవస్థను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఓటీపీ ఆధారిత ధృవీకరణను తప్పనిసరి చేయడం ద్వారా భద్రతను మరింత బలోపేతం చేశామని చెప్పారు. ప్రజలకు సేవలను మరింత సులభతరం చేసే దిశగా వాట్సాప్ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి, మ్యుటేషన్ దరఖాస్తులు, భూ వివరాల ధృవీకరణ, వివిధ సేవల స్థితి తెలుసుకునే సౌకర్యాలను కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
ఆటో మ్యుటేషన్ వ్యవస్థ అమలు…
రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మ్యుటేషన్ కూడా స్వయంచాలకంగా జరిగేలా ఆటో మ్యటేషన్ వ్యవస్థను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నామని తెలిపారు. దీంతో ప్రజలు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు.
రిజిస్ట్రేషన్ శాఖలో సమూల మార్పులు…
గత రెండేళ్లలో రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిస్థాయిలో సాంకేతికత ఆధారిత, పారదర్శక మరియు ప్రజా అనుకూల సేవా వ్యవస్థగా తీర్చిదిద్దామని మంత్రి తెలిపారు. సేవల సరళీకరణతో పాటు భద్రత, వేగం, విశ్వసనీయతకు ప్రాధాన్యతనిస్తూ ఆన్లైన్ సేవలు, డిజిటల్ డాక్యుమెంట్ నిల్వ, ఆధార్ మరియు బయోమెట్రిక్ ధృవీకరణ, ఓటీపీ ఆధారిత భద్రతా వ్యవస్థలు, డిజిటల్ ఆర్కైవింగ్ వంటి సంస్కరణలను అమలు చేశామని పేర్కొన్నారు. అదేవిధంగా రికార్డుల భద్రతను మరింత పటిష్టం చేయడానికి బ్లాక్చెయిన్ సాంకేతికత ఆధారిత భద్రతా చర్యలను ప్రవేశపెట్టి, భూ, ఆస్తి లావాదేవీలను మరింత సురక్షితంగా, పారదర్శకంగా మార్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి వెల్లడించారు.
భూ మాఫియాపై కఠిన చర్యలు…
రాష్ట్రంలో భూ ఆక్రమణలు, నకిలీ పత్రాల సృష్టి, ప్రభుత్వ భూముల దుర్వినియోగం, నకిలీ పట్టాలు, భూ మాఫియా కార్యకలాపాలపై ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడకుండా కఠిన చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. భూ రికార్డుల అక్రమ మార్పులు, మోసపూరిత లావాదేవీలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు వేగవంతం చేయడంతో పాటు ఇప్పటికే పలు కేసుల్లో సీఐడీ విచారణలు ప్రారంభించామని, పలువురు నిందితులను అరెస్టు చేశామని వెల్లడించారు. ఈ వ్యవహారాల్లో ప్రమేయం ఉన్న ఒక డిప్యూటీ కలెక్టర్ సహా పలువురు అధికారులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల భూములు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం కఠిన వైఖరితో వ్యవహరిస్తోందని, ప్రస్తుతం మరిన్ని కేసులు విచారణలో ఉన్నాయని, తప్పు చేసిన వారెవరైనా చట్టం దృష్టి నుండి తప్పించుకోలేరని మంత్రి స్పష్టం చేశారు.
పెట్టుబడులకు అనుకూల భూ పరిపాలన…
భూ రికార్డుల పారదర్శకత, సాంకేతికత ఆధారిత భూ పరిపాలన, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాల కారణంగా రాష్ట్రంపై దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల విశ్వాసం గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. గత రెండేళ్లలో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఇప్పటికే రూ.11.00 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు గ్రౌండ్ అవ్వగా, తద్వారా 10 లక్షలకుపైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. ఈ కంపెనీల ఏర్పాటు కోసం రెవిన్యూ శాఖ పరిశ్రమల శాఖకు 12,142 ఎకరాలు, రెన్యువబుల్ ఎనర్జీ కంపెనీలకు 40 వేల ఎకరాలు, పర్యాటక రంగానికి 470 ఎకరాలను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. స్పష్టమైన భూ రికార్డులు, వివాదరహిత భూముల లభ్యత, పారదర్శక భూ పరిపాలన మరియు పెట్టుబడిదారులకు ప్రభుత్వం కల్పిస్తున్న భరోసా రాష్ట్రాన్ని పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.
పర్యాటక, పారిశ్రామికాభివృద్ధికి భూసంస్కరణలు…
పర్యాటకం, పరిశ్రమలు, ఐటీ, మౌలిక వసతుల అభివృద్ధి కోసం భూ సంబంధిత అనుమతుల ప్రక్రియను సరళీకరించామని మంత్రి తెలిపారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, శ్రీకాకుళం, అనంతపురం తదితర ప్రాంతాల్లో భారీ పెట్టుబడులకు అనువైన భూ వనరుల మ్యాపింగ్ పూర్తయిందన్నారు.
ప్రజల భూమి – ప్రజల హక్కు…
భూమిపై యాజమాన్య హక్కు సంపూర్ణంగా ప్రజలదేనని, ప్రభుత్వానికి ఎటువంటి యాజమాన్య హక్కు ఉండదని మంత్రి స్పష్టం చేశారు. గతంలో ప్రజల్లో భయాందోళనలు కలిగించిన భూ చట్టాలను కూటమి ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసి ప్రజల హక్కులను పరిరక్షించిందన్నారు.
భవిష్యత్ కార్యాచరణపై ప్రత్యేక దృష్టి…
భవిష్యత్ కార్యాచరణలో భాగంగా రాష్ట్రంలో భూ పరిపాలనను మరింత పారదర్శకంగా, సాంకేతికత ఆధారితంగా, ప్రజా కేంద్రితంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం అమలు చేయనుందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న భూ వివాదాలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపించడం, రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో 100 శాతం పట్టాదారు పాస్బుక్కుల పంపిణీ పూర్తి చేయడం, ప్రతి రిజిస్ట్రేషన్ లావాదేవీకి పూర్తి డిజిటల్ భద్రత కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే ఆటో మ్యుటేషన్ వ్యవస్థను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించడంతో పాటు, అన్ని భూ రికార్డులను డిజిటల్ లాకింగ్ వ్యవస్థ పరిధిలోకి తీసుకువచ్చి యాజమాన్య హక్కులకు మరింత భద్రత కల్పించడం జరుగుతుందన్నారు.
రెవెన్యూ సేవలను పూర్తిగా పేపర్లెస్ విధానంలోకి తీసుకువచ్చి, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, అవినీతి రహిత సేవలను అందించడం ద్వారా దేశంలోనే అత్యుత్తమ భూ పరిపాలన నమూనాగా ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. సీసీఎలఏ జి. జయలక్ష్మీ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఐజీ డా.బి.ఆర్. అంబేద్కర్, సర్వే అండ్ సెటిల్మెంట్స్ శాఖ సంచాలకులు ఆర్.కూర్మనాథ్, సీdఎలఏ జాయింట్ సెక్రటరీ టి.ఎస్.చేతన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
















