- మారణాయుధాలతో పుట్టిన రోజు వేడుకలా
- వైసీపీ మూకలపై ఆర్ట్స్ యాక్ట్ కిండా కేసులు నమోదు చేయాలి
- పెట్టుబడిదారులను భయపెట్టే కుట్రలో జగన్ ముఠా
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా మండిపాటు
అమరావతి (చైతన్యరథం); మారణాయుధాలు ధరించి బహిరంగంగా ప్రదర్శనలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్రమైన ప్రమాదమని, ఇటువంటి చర్యలపై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ…. సమాజంలో భయాందోళనలు సృష్టించేలా వ్యవహరించిన వారిపై సంబంధిత అధికారులు తక్షణం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు వేట కొడవళ్లు వంటి మారణాయుధాలతో ప్రదర్శనలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం అత్యంత దారుణమని మండిపడ్డారు.
ఇటువంటి హింసాత్మక ప్రదర్శనలు రాష్ట్రంలో శాంతి, భద్రతలకు భంగం కలిగించడమే కాకుండా, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి, స్పష్టమైన విజన్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేందుకు ప్రముఖ కంపెనీలు, పెట్టుబడిదారులు, ఆకర్షితుల వుతున్నారని పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధి. ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో రాష్ట్రబ్రాండ్ ఇమేజ్ను దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా పెంచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలు, స్థిరమైన పాలన ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని.. తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు స్పష్టమైన విధానాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు తీసుకెళ్తున్నారని కొనియాడారు.
కుట్రలో భాగంగానే..
వైఎస్సార్సీపీ, జగన్ ముఠా హింసాత్మక ప్రదర్శనల ద్వారా రాష్ట్రాన్ని అశాంతి వైపు నెట్టే ప్రయత్నం చేస్తోందని పల్లా ధ్వజమెత్తారు. పెట్టుబడిదారులను భయపెట్టే కుట్రలో భాగంగానే ఈ తరహా మారణాయుధాల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారన్నారు. జగన్కు ఉన్న నేర చరిత్ర కారణంగానే ఇలాంటి సంస్కృతిని ఆయన. ప్రోత్సహిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.
ప్రజలు గమనిస్తున్నారు
తమకు నచ్చని వారిని “రప్పా రప్పా నరుకుతాం” అంటూ ప్లకార్డులు ప్రదర్శించడం వైసీపీ శ్రేణుల మానసిక స్థితిని బహిర్గతం చేస్తోందన్నారు. ఈ హింసాత్మక ధోరణలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇటువంటి బెదిరింపులు ప్రజాస్వామ్యంలో అనుమతించదగ్గవి కాదని స్పష్టం చేశారు. జగన్, వైసీపీ శ్రేణుల తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని, కానీ ఈ హింసాత్మక రాజకీయ సంస్కృతిని మాత్రం తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని తేల్చి చెప్పారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలను కఠినంగా అణచివేయాలని సూచించారు.
అధికారంలోకి వచ్చేస్తున్నామని జగన్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేసిన పల్లా శ్రీనివాస్… ప్రజలు ఇప్పటికే ఆయన హింసాత్మక పాలనను తిరస్కరించారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని హింస, భయాందోళనల వైపు నెట్టే రాజకీయాలకు ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వబోరని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే చంద్రబాబు నాయుడు విజన్కు ప్రజలు అండగా ఉన్నారని స్పష్టం చేశారు.













