- వైసీపీ హయాంలో మహిళలపై ఎన్నో దాష్టీకాలు
- నిండు సభలో తల్లిలాంటి భువనేశ్వరిని దూషించారు
- తల్లిని, చెల్లిని గౌరవించని వ్యక్తివి నువ్వు
- చంద్రబాబును విమర్శించే అర్హత నీకు లేదు
- జగన్పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్
పెనుకొండ/శ్రీసత్యసాయి (చైతన్యరథం): ‘కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుతో కళ్లెదుటే బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటుంటే ఆ తల్లుల కళ్లల్లో ఆనందం వ్యక్తమవుతోంది… మహిళలను సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. అయిదేళ్లలో జగన్ బస్సు చాóర్జీలు పెంచితే, మేం ఫ్రీ బస్ సౌకర్యం కల్పించి మహిళలకు అండగా నిలిచాం… సీఎం చంద్రబాబు మహిళా పక్షపాతి… ఆయన్ను విమర్శంచే అర్హతే నీకు లేదు… నువ్వు మహిళా ద్రోహి’ అని జగన్పై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యుఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత విరుచుకుపడ్డారు. సొంత తల్లిని, చెల్లిని గౌరవించని వ్యక్తి రాష్ట్రంలో ఇతర మహిళలను ఉద్ధరిస్తారని ఎవరూ భావించట్లేదని ఆయన జగన్నుద్దేశించి విమర్శించారు. పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా సాధికారత గురించి ఆలోచించింది మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీర అంబేద్కర్, అన్న ఎన్టీఆర్, సీఎం చంద్రబాబేనని అన్నారు. మహిళలను అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంచాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పమన్నారు. దీపం పథకం ద్వారా ఏడాదికి ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రతి ఇంటి నుంచి మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో, ఎంఎసఎంఈ పార్కుల్లో అవకాశమిస్తున్నారని అన్నారు.
తల్లిని, చెల్లిని గౌరవించని జగన్…
సీఎం చంద్రబాబునుద్దేశించి జగన్ విమర్శించడంపై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయంలాంటి శాసనసభలో తల్లిలాంటి భువనేశ్వరిని జగన్, ఆయన బ్యాచ్ అవమానించిందన్నారు. సొంత చెల్లికి, తల్లికి కూడా న్యాయం చేయలేని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. బాబాయ్ కూతురైన మరో చెల్లి న్యాయం చేయాలని అడిగినా పట్టించుకోకుండా కోర్టులు చుట్టూ తిప్పుతున్న ప్రబుద్ధుడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి, పులివెందుల్లో మహిళలపై జరిగిన అత్యాచారాలను, దారుణాలను ప్రజలంతా చూశారన్నారు. రాజధాని అమరావతి ప్రాంత మహిళలపట్ల జగన్ ఏవిధంగా ప్రవర్తించాడో ఎవరూ మరిచిపోలేదన్నారు. ప్రశ్నించిన మహిళలపై కేసులు పెట్టి వేధించిన చరిత్ర ఆయనదన్నారు. ఆయన హయాంలో జరిగిన విధ్వంసం, ఘోరాలపై ఆనాడే గవర్నర్కు ఒక పుస్తక రూపంలో అందజేశామని గుర్తు చేశారు. ఐదేళ్లలో బస్సు చార్జీలు పెంచి ప్రజలపై జగన్ భారం పెంచితే, తమ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి వెన్నదున్నుగా నిలిచిందన్నారు.
రాయలసీమను అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదే
ఐదేళ్ల పాలనలో దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా జగన్, ఆయన బ్యాచ్ కాలం గడిపిందని మంత్రి సవిత మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు జగన్కు లేదని స్పష్టం చేశారు. ఐదేళ్లలో రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కట్టారా… చెరువులను నీటితో నింపారా..? అని ప్రశ్నించారు. రాయలసీమను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. రాయలసీమను హార్టీ కల్చర్ హబ్, పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేస్తున్నారన్నారు. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తుండడంతో ఉపాధి కోసం వలసలు పోకుండా, తమ కళ్లెదుటే బిడ్డలు ఉద్యోగాలు చేసుకోవడ చూసి, రాయలసీమ ప్రాంత తల్లులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని, డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీని ప్రజలెప్పుడో డైవర్షన్ చేశారని, వారి మాటలను ఎవరూ పట్టించుకోవట్లేదన్నారు.















