- ప్రపంచ దేశాల్లో భారత్ గౌరవాన్ని పెంచారు
- ఎన్డీయే భాగస్వామ్యపక్షాల సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు
దేశాభివృద్ధి కోసం నిరంతరం పరితపించే నేత… ప్రపంచ వేదికలపై భారత్ గౌరవాన్ని పెంచిన మహా నాయకుడు… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్లాఘించారు. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం జరిగిన ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల సమావేశంలో ఆయన తన ప్రసంగంతో కరతాళ ధ్వనులు కురిపించారు. ప్రధానిగా 12 ఏళ్ల అప్రతిహత పాలన పూర్తి చేసుకున్న ప్రధాన నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు
ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ మోదీ అని కొనియాడారు. రాష్ట్రాల అభ్యున్నతికి, ముఖ్యంగా ఏపీ పునర్నిర్మాణానికి కేంద్రం అందిస్తున్న సంపూర్ణ మద్దతుకు ప్రధాని కి ధన్యవాదాలు తెలిపారు. “ఎన్డీఏ ఏర్పడింది కేవలం ఎన్నికల కోసమో, అధికారం కోసమో కాదు.. కేవలం దేశ ప్రయోజనాల కోసం,
జాతీయ అజెండాతోనే ముందుకు సాగుతోంది” అని స్పష్టం చేశారు. బిహార్, అసోం, పుదుచ్చేరిల్లో సాధించిన వరుస
విజయాలే ఎన్డీఏ సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన తిరుగులేని తీర్పు అని… త్వరలోనే బెంగాల్ సైతం దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రాచీన జ్ఞానం, డిజిటల్ విప్లవం, నవకల్పనల సమన్వయంతో.. ప్రతి భారతీయుడి మనోభావాలు తెలిసిన మోదీ నాయకత్వంలో భారతదేశం విశ్వ గురువుగా ఎదుగుతోందన్నారు.
న్యూఢిల్లీ: సరైన సమయంలో, సరైన స్థానంలో, దేశానికి లభించిన సరైన నాయకుడు నరేంద్ర మోదీ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్లాఘించారు. ప్రతి అంతర్జాతీయ సర్వేలో నూ మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలి గిన నాయకుడిగా నిలుస్తున్నారని, నేడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులకు లభిస్తున్న గౌరవానికి ఆయన నాయకత్వమే కారణమన్నారు. మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రపంచంలోనే నెం.1 ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆకాంక్షిస్తూ.. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ నిర్మాణ సంకల్పం తప్పకుండా నెరవేరుతుందన్నారు. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ఎన్డీయే భాగస్వామ్యపక్షాల కీలక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మోదీ 12 సంవత్సరాల సుదీర్ఘ, విజయవంతమైన పాలనను పూర్తి చేసుకుని దేశ చరిత్రలోనే అత్యంత ఎక్కువ కాలం ప్రధానిగా సేవ లందించిన నేతగా నిలవడంపై చంద్రబాబు ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ గౌరవ సభలో ప్రధాని మోదీ సమర్థవంతమైన పాలనను కొనియాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘కృతజ్ఞతా తీర్మానాన్ని’ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని సీఎం ప్రకటించారు.
‘నేషన్ ఫస్ట్’ అజెండాతోనే మోదీ ప్రయాణం
సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… ప్రధాని మోదీ నాయకత్వ ప్రతిభను, పరిపాలనా సామర్థ్యాన్ని ఆకాశానికెత్తారు. “నరేంద్ర మోదీ అతిపెద్ద బలం ఏమిటంటే.. ఆయన ఒకవైపు దేశానికి స్థిరత్వాన్ని ఇచ్చే దిక్సూచిగా (Anchor) ఉంటూనే, మరోవైపు కొత్త ఆలోచనలకు, నవకల్పనలకు (Innovator) ప్రేరణగా నిలుస్తున్నారు. మనమందరం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన ఏకైక అజెండా ‘నేషన్ ఫస్ట్’ (దేశమే ప్రథమం) అనే సిద్ధాంతంతోనే ఆయన పని చేస్తున్నారు” అని కొనియాడారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి ప్రధాని పదవి వరకు గత 25 ఏళ్లుగా మోదీ నిరంతరం ప్రజా సేవలోనే ఉన్నారని గుర్తు చేశారు. మోదీ ఎప్పుడూ అలసిపోరని, నిత్యం ఉత్సాహంగా ఉంటూ తోటివారిలో స్ఫూర్తి నింపుతారని కొనియాడారు. ప్రపంచంలోని ఏ అగ్రనేతతో నైనా మోదీ సమానంగా నిలబడగలరని, ఇది దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. గత 12 ఏళ్ల మోదీ పాలనలో దేశంలో వచ్చిన అతి పెద్ద మార్పు ‘భారతీయత పునరుజ్జీవం పొందడం’ అని, ప్రాచీన జ్ఞానం- డిజిటల్ పరిపాలనల సమన్వయమే నూతన భారత బలంగా మారిందని స్పష్టం చేశారు.
ఆర్థిక సంక్షోభంలోనూ స్థిరత్వం.. ఏపీ అభివృద్ధికి మద్దతు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సరఫరా వ్యవస్థల అంతరాయం, ఇంధన మార్కెట్ల అస్థిరత, ఆర్థిక మందగమనం వంటి అనేక సవాళ్లు ఉన్నప్పటికీ… మోదీ సమర్థత వల్ల భారతదేశంలో ద్రవ్యోల్బణం సుమారు 3.5శాతం వద్దే నియంత్రణలో కొనసాగుతోందని చంద్రబాబు అభినందించారు. దేశాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూనే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి, రాష్ట్ర అభ్యున్నతికి సంపూర్ణ మద్దతుగా నిలిచినందుకు ప్రధానికి సీఎం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఎన్నికల కోసం కాదు… దేశం కోసం ఏర్పడిన కూటమి ‘ఎన్డీయే’
రాజకీయ కూటములు సాధారణంగా కేవలం ఎన్నికల కోసమే ఏర్పడతాయని కానీ ఎన్డీయే కూటమి అధికారం కోసం కాకుండా కేవలం ‘దేశ ప్రయోజనాల కోసం’ ఏర్పడిందని చంద్రబాబు స్పష్టం చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలకు గాను 202 స్థానాల్లో కూటమి సాధించిన విజయం, అసోం, పుదుచ్చేరిల్లో వరుస గెలుపులే ఇందుకు నిదర్శనమన్నారు. ఇవి కేవలం ఎన్నికల ఫలితాలు కావు, సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని అభివర్ణించారు. ఒకప్పుడు వెనుకబడిపోయిన బెంగాల్, తాజాగా అక్కడ వచ్చిన మార్పులతో మారుతున్న భారత ఆకాంక్షలకు అనుగుణంగా మళ్లీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అత్యుత్తమ రాజకీయవేత్తల్లో మోదీ ఒకరు..
వ్యవస్థను పారదర్శకంగా, అందరికీ అందుబాటులో ఉండేలా ప్రధాని తీర్చిదిద్దుతున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ప్రతి భారతీయుడి మనోభావాలను అర్థం చేసుకున్న నాయకుడు ప్రధాని మోదీ అని కొనియాడారు. మన కాలంలో అత్యుత్తమ రాజకీయవేత్తల్లో ఆయనఒకరని ఉద్ఘాటించారు. ప్రపంచ మార్పులో భారత్ భాగస్వామినే కాదని… దిశానిర్దేశం చేసే దేశంగా ఎదుగుతోందని చంద్రబాబు పేర్కొన్నారు.















