అమరావతి (చైతన్యరథం): అగ్ని ప్రమాదాలు, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు అగ్నిమాపక శాఖను మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.40 కోట్లతో కొనుగోలు చేసిన 58 అగ్నిమాపక వాహనాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్డులో ఫైర్ సేఫ్టీ వాహనాలకు సీఎం జెండా ఊపారు. అగ్నిమాపక శాఖ అధికారులు ఆ వాహనాల ప్రత్యేకతలను సీఎంకు వివరించారు. గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులకు ఉపయోగపడేలా… ప్రమాద ప్రాంతాలకు వేగంగా చేరుకుని తక్షణం అగ్నిమాపక సేవలు అందించేలా రూ.18.68 కోట్ల విలువైన 25 అధునాతన అగ్నిమాపక వాహనాలు అందుబాటులోకి వచ్చాయని అధికారులు తెలిపారు.
భారీ అగ్ని ప్రమాదాల సమయంలో నిరంతర నీటి సరఫరాకు ఉపయోగపడేలా రూ.14.79 కోట్ల విలువైన 20 వాటర్ బౌజర్లను సిద్ధంగా ఉంచుకున్నామని సీఎంకు అధికారులు చెప్పారు. ఒక్కో వాటర్ బౌజర్ 14వేల లీటర్ల నీటిని తరలించే సామర్థ్యం కలిగి ఉంటుందని… పట్టణ, పారిశ్రామిక ప్రాంతాల్లో మంటలను అదుపు చేయడంలో ఇవి కీలకంగా వ్యవహరిస్తాయని తెలిపారు. ఇరుకైన, రద్దీగా ఉండే ప్రాంతాల్లోనూ వేగంగా చేరుకునేలా రూ.6.37 కోట్ల విలువైన 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్ ఫైటింగ్ వాహనాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినట్టు అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మొత్తం రూ.252.86 కోట్ల వ్యయంతో దశలవారీగా ఆధునిక వాహనాలు, పరికరాలను సమకూరుస్తున్నాం. తొలి దశలో రూ.33 కోట్ల వ్యయంతో 65 అగ్నిమాపక వాహనాలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాం. రెండో దశలో రూ.40 కోట్లతో 58 వాహనాలను ఇప్పుడే ప్రారంభించుకున్నాం. త్వరలో మూడో దశలోనూ మరిన్ని అగ్నిమాపక వాహనాలు, ఫైర్ ఫైటింగ్ పరికరాలను అందుబాటులోకి తీసుకురానున్నాం. వీటితో పాటు ఫైర్ స్టేషన్లల్లో మౌలిక వసతులపైనా ప్రత్యేక దృష్టి సారించాం. రాష్ట్రంలో 17 కొత్త ఫైర్ స్టేషన్ భవనాల నిర్మాణం జరుగుతోంది. ఒక్కో భవనానికి రూ.2.25 కోట్ల చొప్పున ఖర్చు పెడుతున్నాం. వీటిలో ఆరు భవనాల నిర్మాణం పూర్తయింది. మరో 36 ఫైర్ స్టేషన్లను ఆధునికీకరిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా అగ్నిమాపక సేవల మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నాం” అని చెప్పారు. కార్యక్రమంలో హోం శాఖ మంత్రి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













