- అబద్ధపు రాతలతో భయాందోళనలకు గురిచేస్తారా?
- జగన్ అబద్ధాలకు అంబాసిడర్… సాక్షి అసత్యాలకు వేదిక
- ఈ-పంట నమోదులో కూటమిది సాంకేతిక విప్లవం
- ప్రజలు అన్నీ గమనిస్తున్నారు…
- ప్రభుత్వంపై ఎంత విష ప్రచారం చేసినా నిజాలు దాచలేరు
- కూటమి విజయాలు చూసి జగన్కు మతిపోయింది
- సాక్షి విష ప్రచారంపై విరుచుకుపడిన మంత్రి అచ్చెన్న
- సాక్షి అబద్ధాలను గణాంకాలతో తిప్పికొట్టిన మంత్రి
అమరావతి (చైతన్య రథం): ఈ-పంట నమోదుపై గొడ్డలి పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగన్, ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న సాక్షి పత్రిక చేస్తున్న అసత్య ప్రచారం పూర్తిగా నిరాధారమని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఖండించారు. అబద్ధాలకు అంబాసిడర్ జగన్ అయితే, వాటికి వేదిక సాక్షి పత్రిక అని దుయ్యబట్టారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన పత్రిక, వాస్తవాలను కప్పిపుచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. సాక్షి రాసే అసత్యాలను ప్రజలు గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదని, ప్రజలన్నీ గమనిస్తున్నారని మంత్రి అచ్చెన్న పేర్కొన్నారు. ఈ-పంట నమోదుపై జగన్ చేస్తున్న ఆరోపణలను గణాంకాలే తిప్పికొడుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్-2024లో కేవలం 41.87 లక్షలమంది రైతుల 96.78 లక్షల ఎకరాలు మాత్రమే నమోదు కాగా, కూటమి ప్రభుత్వం ఖరీఫ్-2025లో 53.32 లక్షలమంది రైతుల 117.39 లక్షల ఎకరాలు నమోదు చేసి గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. అలాగే ల్యాండ్ పార్సిల్స్ నమోదు 106.38 లక్షలనుంచి 198.93 లక్షలకు పెరిగిందని, రబీ 2025-26లో 99.7 శాతం ఈ-పంట నమోదు పూర్తి చేశామని తెలిపారు. ఖరీఫ్-2026లో ఏపీఏఐఎంఎస్ 2.0 ద్వారా అత్యాధునిక సాంకేతికతతో డిజిటల్ పంట నమోదు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. జియో-రెఫరెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఉపగ్రహ సాంకేతికత, మూడు దశల ఎసఎమఎస్ సమాచారం, రైతులు స్వయంగా నమోదు చేసుకునే సౌకర్యం, గ్రీవెన్స్ వ్యవస్థవంటి అనేక పారదర్శక విధానాలు ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
ఖరీఫ్-2026లో ఇంతవరకు 11.75 లక్షల ఎకరాలలో సాగు అయినప్పటికీ, ఈ-పంట నిబంధనల ప్రకారం 30 రోజుల వయసు దాటిన పంటలనే నమోదు చేయవలసి వుంటుంది. ఇంతవరకు 1,62,396 మంది రైతులకు సంబంధించిన 4,03,150 ఎకరాలను ఈ-పంట నమోదు పూర్తి చేశామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా సేకరించిన పంట విస్తీర్ణ వివరాలు అత్యంత పారదర్శకంగా, కచ్చితత్వంతో, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నందున, పంటల విస్తీర్ణ ఉత్పత్తి, ఉత్పాదకత అంచనాల కోసం కేంద్ర ప్రభుత్వ గణాంక వ్యవస్థ వాటిని వినియోగించడం విశిష్టమైన గుర్తింపుగా నిలిచిందన్నారు. రైతులకు సబ్సిడీలు, బీమా, పెట్టుబడి సాయంవంటి పథకాలు వేగంగా, పారదర్శకంగా అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు. వాస్తవాలతో సమాధానం చెప్పలేక అబద్ధాల ప్రచారం చేయడం జగన్కు అలవాటైందని, రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను వెంటనే మానుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని, ప్రచారాలతో కాదు… పనితీరుతోనే ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటోందని స్పష్టం చేశారు.
కొబ్బరి ధరలపై తప్పుడు కథనాలు.. జగన్ కుట్ర కోణం ఏంటి?
గత రెండేళ్లుగా కొబ్బరి రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయని, 2024-25లో బంతి కొబ్బరి వెయ్యి కాయలకు రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు, కోప్రా రూ.15,500 నుంచి రూ.19,500 వరకు ధర లభించిందన్నారు. 2025-26లో బంతి కొబ్బరి రూ.18 వేలనుంచి రూ.27 వేల వరకు, కోప్రా రూ.17 వేల నుంచి రూ.28,500 వరకు విక్రయమై రైతులకు మంచి ఆదాయం వచ్చిందన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో కొన్ని మార్కెట్ పరిస్థితులవల్ల స్వల్ప ఒడిదుడుకులు ఎదురైనా, ప్రస్తుతం మార్కెట్ మళ్లీ పుంజుకుని బంతి కొబ్బరి వెయ్యి కాయలకు రూ.14 వేల నుంచి రూ.18 వేల వరకు, కోప్రా రూ.15 వేలనుంచి రూ.24 వేల వరకు ధరలు లభిస్తున్నాయన్నారు. ఇలాంటి సమయంలో సొంత పత్రికలో “కొబ్బరి ధరలు లేవు” అంటూ తప్పుడు కథనాలు ప్రచారం చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి జగన్? మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపించి కొబ్బరి ధరలు పడిపోయేలా చేయడమే నీ కుట్రనా? ప్రస్తుతం రైతులకు వస్తున్న మంచి ధరలను దెబ్బతీసి, వ్యాపారులు తక్కువ ధరలకు కొబ్బరి కొనుగోలు చేసేలా చేయడానికే తప్పుడు ప్రచారమా? రైతుల్లో భయాందోళనలు సృష్టించి, మార్కెట్లో గందరగోళం నెలకొల్పి రైతుల పొట్ట కొట్టడమే నీ లక్ష్యమా? రాష్ట్రంలో రైతులకు మేలు జరుగుతుంటే అది చూడలేక, నీ రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవితాలతో కూడా చెలగాటమాడుతున్నావా? మార్కెట్ కోలుకుని రైతులకు ఊరటనిస్తున్న సమయంలో ఇలాంటి నిరాధార కథనాలు ప్రచురించడం అత్యంత బాధ్యతారాహిత్యం కాదా?” అని మంత్రి అచ్చెన్న నిలదీశారు. రైతులకు వాస్తవాలు తెలియజేయాల్సిన పత్రికను రాజకీయ కుట్రలకు వేదికగా మార్చవద్దని, తప్పుడు ప్రచారాలతో మార్కెట్ను ప్రభావితం చేసే ప్రయత్నాలు వెంటనే మానుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు హితవు పలికారు.















