- ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నచోట స్థానికంగా సెలవుల ప్రకటన
- రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో తీవ్రస్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజారోగ్యం, వారి భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఎండల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు నిరంతరం హెచ్చరికలు పంపాలని అధికారులకు సూచించారు. ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి స్థానికంగా సెలవులు ప్రకటించాలని దిశానిర్దేశం చేశారు. తీవ్రస్థాయి ఎల్ నినో కారణంగా హీట్వేవ్ తీవ్రత కూడా గణనీయంగా పెరిగిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
దీనిపై స్పందించిన సీఎం, ప్రజలకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగేలా రద్దీగా ఉన్న ప్రాంతాలు, ప్రజలు ఎక్కువగా తిరిగే చోట్ల చల్లని మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. వడగాలుల నుంచి ఎలా రక్షించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్లు మీడియా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల ద్వారా నిరంతరం సమాచారాన్ని చేరవేయాలని నిర్దేశించారు. ప్రజల ప్రాణాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ఎండ తీవ్రత నేపథ్యంలో బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా ఉండాలని సూచించారు. ఈ అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి జిల్లా కలెక్టర్లు, మండల స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో 1,349 హీట్ షెల్టర్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. 446 ట్రాఫిక్ జంక్షన్లలో వాహనదారులు, పోలీసులకు నీడ కల్పించేలా ఏర్పాట్లు చేశామని తెలియచేశారు. మరోవైపు ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న మూగ జీవులు, పక్షులకు కూడా నీటి తొట్టెలు, మట్టి కుండలతో నీటిని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.
పచ్చదనం పెంపుపై దృష్టి
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి కొరత రాకుండా చూడాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. నీటి ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. 2015లో బలమైన ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో 50.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డు అయిందని, ఈ ఏడాది కూడా ఎల్ నినో ప్రభావంతో ఇప్పటి వరకు 48 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు వివరించారు. గడచిన మూడు రోజులుగా 45 డిగ్రీల నుంచి 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరిగాయన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో పచ్చదనం పెంపుపై దృష్టి సారించాలని సూచించారు.
భూగర్భ జలాలు పెరిగితే పచ్చదనం పెరుగుతుందని, తద్వారా తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావం నుంచి కొంతమేర ఉపశమనం లభిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. అన్నమయ్య జిల్లాయే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోందని వెల్లడించారు. ఇతర జిల్లాలతో పోలిస్తే అన్నమయ్య జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రత నమోదైందని స్పష్టం చేశారు. తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో హెచ్చరికలు, అప్రమత్తత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు సమాచారం చేరవేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. వచ్చే వారం రోజుల పాటు నిత్యం ప్రజలను అప్రమత్తం చేసేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు. సమీక్షకు సీఎస్ సాయిప్రసాద్, పురపాలక, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, విపత్తు నిర్వహణ, వైద్యారోగ్య శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.












