- ఎక్స్-ఆర్మీ టీచర్పై సాక్షి మీడియా దౌర్జన్యం గర్హనీయం
- స్కూలు పిల్లల ముందే అవమానం దారుణం, పూర్తి బాధ్యత జగన్ రెడ్డిదే
- మెగా డీఎస్సీపై అసత్య ప్రచారం సహించేది లేదు
- ఎంపీ చింతకాయల విజయ్ ధ్వజం
అమరావతి (చైతన్యరథం): దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో, ప్రశాంతంగా జీవించగలుగుతున్నారంటే దానికి ప్రధాన కారణం సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాపలా కాస్తున్న వీర జవాన్లేనని రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ స్పష్టం చేశారు. అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో సైనికులు దేశ రక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో కూడా వారు కనబరుస్తున్న గుండెధైర్యం వెలకట్టలేనిది. దేశ సరిహద్దులను కాపాడే సైనికుల వల్లే మనమంతా ప్రశాంతంగా జీవిస్తున్నాం. అలాంటి వీర జవాన్ల పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్కు గానీ, ఆయన పార్టీకి గానీ కనీస గౌరవం, నమ్మకం లేవని తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో విజయ్ మాట్లాడుతూ.. కుటుంబాలకు దూరంగా, ఎముకలు కొరికే చలిలో పహారా కాసే సైనికులను చూసి యావత్ దేశం గర్విస్తుందన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎల్లప్పుడూ సైనికుల త్యాగాలను కొనియాడుతూ దేశభక్తిని చాటుకుంటారు. అవినీతి రాజకీయాలు చేసుకునే నాయకులు సైతం ఈరోజు సురక్షితంగా ఉన్నారంటే అది సరిహద్దుల్లో జవాన్లు చేసే ప్రాణత్యాగాల చలవే. గురుపూజోత్సవం రోజున గురువులను పూజించాల్సింది పోయి, కుప్పం ప్రభుత్వ పాఠశాలలో ఒక ఎక్స్-ఆర్మీ ఉపాధ్యాయుడిపై జగన్ అనుకూల సాక్షి మీడియా ప్రతినిధి వ్యవహరించిన తీరు అత్యంత హేయమైనది. పవిత్రమైన గురు పూజోత్సవం నాడే పిల్లల ముందు ఒక టీచర్ కాలర్ పట్టుకోవడం క్షమించరాని నేరం. తాను దేశం కోసం పనిచేసిన ఎక్స్-ఆర్మీ జవానునని, స్పోర్ట్స్ కోటా ద్వారా చట్టబద్ధంగా ఉద్యోగం సాధించానని ఆ ఉపాధ్యాయుడు మొరపెట్టుకున్నా వినకుండా దౌర్జన్యానికి దిగారు. సర్టిఫికెట్లు చూపించాలంటూ, ఎవరికి లంచం ఇచ్చావంటూ బెదిరించి, విద్యార్థుల ముందే ఆయన్ను మానసికంగా కుంగదీసే కుట్ర చేశారు. పాఠశాల గదిలోకి చొరబడి దేశాన్ని కాపాడిన ఒక సైనికుడి కాలర్ పట్టుకునే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈ ఘటనతో జగన్ మీడియా నైతికత పూర్తిగా పతనమైందని, దీనికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని విజయ్ డిమాండ్ చేశారు.
జగన్ దిగజారుడు రాజకీయం
యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి నారా లోకేష16,000 పైచిలుకు పోస్టులతో మెగా డీఎస్సీని పట్టాలెక్కిస్తే, ఓర్వలేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత మీడియా సాక్షి ద్వారా ఉపాధ్యాయులపై విషం చిమ్ముతున్నారని ఎంపీ విజయ్ మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేని ‘జీరో సీఎం’ జగన్ అని ఎద్దేవా చేశారు. గణేష్ అనే సాక్షి విలేకరి ఏకంగా ప్రభుత్వ పాఠశాల గదిలోకి చొరబడి, విద్యార్థుల ముందే దేశం కోసం పనిచేసిన ఎక్స్-ఆర్మీ ఉపాధ్యాయుడిపై దౌర్జన్యం చేసి బెదిరింపులకు దిగడం హేయమైన చర్య. ఇలాంటి దిగజారుడు రాజకీయ నాయకులు, మీడియా ఈ సమాజానికి అవసరమా అని ప్రశ్నించారు. జాతీయ పతాకం అన్నా, అశోక చక్రం అన్నా కనీస అవగాహన, గౌరవం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కనీసం జనగణమన పాడటం కూడా రాని జగన్కు దేశభక్తిలో ఒక్క శాతం కూడా లేదని, సైనికులంటే అసలే గౌరవం లేదని విమర్శించారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం, పాఠశాలల బాగు కోసం ఇచ్చిన మాట ప్రకారం నారా లోకేష్ మెగా డీఎస్సీ ద్వారా 16 వేలపైగా ఉద్యోగాలు భర్తీ చేయడంతో జగన్కు వెన్నులో వణుకు మొదలైంది. ఐదేళ్లలో పోలవరం పూర్తి చేయలేక, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేక, ఒక్క డీఎస్సీ కూడా తీయలేక ‘జీరో సీఎం’గా మిగిలిన జగన్కు ఈ మెగా డీఎస్సీ చూసి కడుపుమంట మొదలైంది. గతంలో డాక్టర్ సుధాకర్ లాంటి ఫ్రంట్లైన్ వారియర్ను మానసికంగా వేధించి బలితీసుకున్న చరిత్ర జగన్ది. ఇప్పుడు అదే తరహాలో ఉపాధ్యాయులపై పడ్డారు. భార్యాభర్తలిద్దరికీ ఉద్యోగాలు రాకూడదా? ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వారి పేర్లతో ఫేక్ ఆడియో రికార్డింగ్లు సృష్టించి తప్పుడు ప్రచారాలు చేయడం సాక్షి దిగజారుడుతనానికి నిదర్శనం. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వారు ఉపాధ్యాయ నియామకాలపై అవాకులు చవాకులు పేలడం సిగ్గుచేటని విజయ్ ధ్వజమెత్తారు
బీసీలు, మైనారిటీల జోలికొస్తే సహించేది లేదు
పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ ఎలా నిర్వహించాలో కూడా తెలియని జగన్ రెడ్డి, రాష్ట్ర భవిష్యత్తును పూర్తిగా నాశనం చేశారని విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస విద్యార్హత, వ్యక్తిత్వం, దేశభక్తి లేని జగన్.. సైనికులను, ఉపాధ్యాయులను కించపరుస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలవరం, వెలుగొండ ప్రాజెక్టుల పురోగతి తెలియని జగన్ రాష్ట్రాన్ని సున్నా స్థాయికి తీసుకొచ్చారు. ఆయన చేసిన విధ్వంసాన్ని జెన్-జీ, జెన్-ఆల్ఫాతో సహా ప్రతి తరం నిశితంగా గమనించాలి. ప్రతిదానికీ సీబీఐ ఎంక్వైరీ అంటున్న జగన్.. సీబీఐ వాళ్లే పులివెందుల వస్తే ఎవరు లోపలికి వెళ్తారో గుర్తుంచుకుంటే మంచిది. గతంలో సీబీఐ అధికారులనే బెదిరించిన చరిత్ర వైఎస్సార్సీపీది. ఒక ఐఏఎస్, ఒక ఐఎఫఎస్ స్థాయి మహిళా అధికారులు డీఎస్సీ ప్రక్రియను ఎంత పారదర్శకంగా నిర్వహించారో ప్రజలందరికీ వివరించారు. దీనిపై కోర్టుకు వెళ్లినా మొట్టికాయలు వేసి వెనక్కి పంపినా జగన్కు బుద్ధి రాలేదు. బీసీలు, ఎస్సీలు, మైనారిటీలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారు.
కొన్నేళ్లుగా డీఎస్సీ కోసం వేచిచూస్తూ, గత ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ రాక రూ. 10 వేల ప్రైవేట్ జీతంతో బతికిన ఎంతోమంది నిరుపేదలకు, మైనారిటీలకు ఈరోజు ఉద్యోగాలు వచ్చాయి. తల్లిదండ్రులు లేని నిరుపేద అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కి నారా లోకేష్ను దేవుడిలా చూసుకుంటున్నారు. మంగళగిరిలో రికార్డు మెజారిటీతో గెలిచి, నిరంతరం రాష్ట్ర ప్రజల బాగు కోసం, పెట్టుబడుల సాధన కోసం, జాబ్ క్యాలెండర్ల అమలు కోసం శ్రమిస్తున్న లోకేష్పై విమర్శలు సిగ్గుచేటు. చిత్తశుద్ధి, విజన్ ఉంటే అభివృద్ధిపై చర్చించాలి తప్ప ఇలా ఉపాధ్యాయుల పొట్ట కొట్టేలా కుట్రలు చేయడం తగదు. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లలోకి చొరబడి ఎక్స్-ఆర్మీ సైనికుల జోలికి వచ్చినా, బీసీ, మైనారిటీ ఉద్యోగులను వేధించినా సహించే ప్రసక్తే లేదు. ఇకనైనా ఈ దిగజారుడు చేష్టలు మానకపోతే ప్రజలే మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తారని ఎంపీ విజయ్ హెచ్చరించారు.













