- చంద్రబాబు హయాంలో 8 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం పూర్తి
- పీఎంఏవై కింద లక్షలాది ఇళ్లు మంజూరు.. వేగంగా నిర్మాణాలు
- పోలవరం నిర్వాసితులకు పునరావాస గృహాలు
- గృహ నిర్మాణ శాఖకు అదనపు సిబ్బంది కేటాయింపు
- సమాచార, గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ పక్కా గృహాలు అందించే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్ధసారధి స్పష్టం చేశారు. పేదలకు పక్కా గృహాలు అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా అవసరమైన బడ్జెట్ కేటాయింపులు చేయడంతో పాటు కేంద్రం నుంచి అధిక నిధులు సాధించి వారి సొంత ఇంటి కల నిజం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ సచివాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 2014-19 మధ్య మొత్తం 13,04,516 ఇళ్లు మంజూరు చేస్తే రూ.10,194 కోట్లు ఖర్చు చేసి 8,04,853 ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. అందరికీ ఇళ్లు అందించాలన్న ఏకైక లక్ష్యంతో ఆనాడు రూ.10వేల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేశారని గుర్తుచేశారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇళ్ల నిర్మాణంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.712.83 కోట్లు అదనపు ఆర్థిక సాయం అందించారన్నారు.
ఎస్సీ, ఎస్టీలకు ఇంటికి రూ.50వేల చొప్పున, ఆదివాసీ గిరిజనులకు ఇంటికి రూ.75వేల చొప్పున అందించి వారికి చేయూతనివ్వడం జరిగిందని మంత్రి పార్ధసారధి పేర్కొన్నారు. గత ప్రభుత్వం పాలనలో పరిశీలిస్తే 18లక్షల 61వేల గృహాలు మంజూరు చేయగా ఆ ప్రభుత్వ పాలన పూర్తయ్యే నాటికి అనగా 2024 మే 31 నాటికి రూ.9,588 కోట్లు ఖర్చు చేసి కేవలం 6లక్షల 70వేల 636 ఇళ్లను మాత్రమే పూర్తి చేయగలిగారని మంత్రి పార్ధసారధి పేర్కొన్నారు. అన్నింటికన్నా అన్యాయం ఏమిటంటే, చంద్రబాబు ప్రభుత్వంలో ఇళ్లు మంజూరై స్వంత నిధులతో ఇంటి నిర్మాణాలు చేపట్టిన 4లక్షల 36వేల 907 మంది లబ్ధిదారుల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా రద్దు చేసిన గత ప్రభుత్వం పేద లబ్ధిదారులకు తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటి స్థలాల పంపిణీకి సంబంధించి గత ప్రభుత్వ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో 1.50 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు వంతున మహిళా లబ్ధిదారుల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల 29వేల 450 ఇంటి స్థలాలు పంపిణీ చేయగా వాటిలో 7లక్షల 89వేల 550 మందికి గృహాలు మంజూరు చేయగా ఇంకా 12లక్షల 39వేల 900 ఖాళీ స్థలాల్లో ఇళ్లు మంజూరు చేయాల్సి ఉందని మంత్రి పార్ధసారధి తెలిపారు.
2024 తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పక్కా గృహాల నిర్మాణాలను వేగవంతం చేసిందని మంత్రి పార్ధసారధి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి కేంద్రానికి పంపించి మంజూరు చేయించుకోవడం జరిగిందని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకంలో భాగంగా 57,600 గృహాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకంలో భాగంగా 684 ఇళ్లు, పీఎం-జనమన్ కింద 28,430 ఇళ్లు మొత్తం 86,714 ఇళ్లు మంజూరయ్యాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు పీఎంఏవై అర్బన్, గ్రామీణ్ మరియు పీఎం-జనమన్ పథకాల కింద రూ.2,102 కోట్లు ఖర్చు చేసి 4లక్షల 56వేల 536 ఇళ్లను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. పక్కా గృహాల నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు కోరగా దాదాపు 10,42,199 దరఖాస్తులు అందాయన్నారు. స్క్రూటినీ అనంతరం నిబంధనల మేరకు 9.50 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగిందన్నారు. వీటిలో మొదటి విడతగా కేంద్రం 74,812 ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు. భవిష్యత్తులో అర్హుల సంఖ్యను బట్టి కేంద్రం నుంచి పెద్ద సంఖ్యలో ఇళ్లను మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.
పీఎంఏవై అర్బన్ 2.0 పథకానికి యూనిట్ ధర రూ.2.50 లక్షలుగా నిర్ధారించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఇందులో రూ.1.50 లక్షలు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రూ.1 లక్ష అందించనున్నాయన్నారు. అంతేకాకుండా అవసరమైతే ఎస్హెచ్జీ గ్రూప్లో సభ్యులైన లబ్ధిదారులు బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం పొందవచ్చన్నారు. అలాగే అదనంగా స్వచ్ఛభారత్ మిషన్ నుంచి మరుగుదొడ్ల నిర్మాణాలకు ఆర్థిక సహాయం అందించడానికి గృహ నిర్మాణ శాఖ కసరత్తు చేస్తుందన్నారు. అర్బన్ హౌసింగ్ పథకంలో ఇప్పటి వరకు 5,801 ఇళ్లు పూర్తి చేయడంతో పాటు రూ.178.95 కోట్లు ఖర్చు చేశామన్నారు. పీఎంఏవై గ్రామీణ్ పథకంలో భాగంగా యూనిట్ ధర రూ.2.39 లక్షలుగా నిర్ధారించడం జరిగిందన్నారు. ఇందులో రూ.72వేలు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రూ.48వేలు అందిస్తున్నాయన్నారు. అంతేకాకుండా రూ.80వేలు వడ్డీ లేని రుణాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే ఎనఆరఈజీఎస్ కింద రూ.39వేలు అందిస్తున్నామన్నారు.
స్వర్ణ గ్రామం, వార్డుల్లో పని చేసే 370 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖకు కేటాయించడంతో గృహ నిర్మాణాలు మరింత వేగవంతం అవుతాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సిబ్బంది కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు మంత్రి పార్ధసారధి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పాటు వివిధ కార్పొరేషన్లలో పని చేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడంతో గృహ నిర్మాణంలో నైపుణ్యం, విశేష అనుభవం ఉన్న దాదాపు 348 మంది వరకు విధుల్లో కొనసాగే అవకాశం ఉందని, వారి పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం మరింత వేగవంతం అవుతుందని చెప్పారు.
పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని గృహ నిర్మాణ శాఖ చేపడుతుందని మంత్రి పార్ధసారధి తెలిపారు. ఇప్పటికే బుట్టాయిగూడెం, తాడువాయి తదితర ప్రాంతాల్లో వేగంగా గృహ నిర్మాణాలు చేస్తున్నామన్నారు. పునరావాసంలో భాగంగా పోలవరం పూర్తయ్యేలోపు నిర్వాసితులు అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పార్ధసారధి స్పష్టం చేశారు.

















