- అమరావతిలో దేశ తొలి సైబర్ సీక్రెట్ ల్యాబ్
- భారత్ క్వాంటం రేసులో వేగం పెంచిన రాజధాని
- ఆ రేసుకు కేంద్రంగా మారింది.. అమరావతి!
అమరావతి (చైతన్య రథం): ప్రపంచ టెలికమ్యూనికేషన్-ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం (మే 17) సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక చారిత్రక ప్రకటన చేశారు. దేశంలోనే మొట్టమొదటి ‘క్వాంటం-సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ’ అమరావతిలో ఏర్పాటు కానుంది. సాధారణ సైబర్ దాడులను మాత్రమే కాదు, భవిష్యత్తులో క్వాంటం కంప్యూటర్ల ద్వారా జరగబోయే అత్యాధునిక హ్యాకింగ్ ప్రయత్నాలనూ తట్టుకునే సాంకేతికత ఇప్పుడు అమరావతిలో రూపుదాలుస్తోంది.
ఒక నెలలో రెండు చారిత్రక అడుగులు
ఏప్రిల్ 14న వరల్డ్ క్వాంటం డే సందర్భంగా చంద్రబాబు ఎసఆరఎం యూనివర్శిటీ అమరావతిలో పూర్తి స్వదేశీ నిర్మిత, ఓపెన్-యాక్సెస్ క్వాంటం కంప్యూటింగ్ ఫెసిలిటీని ప్రారంభించారు. అమరావతి 1ఎస్ మరియు అమరావతి 1క్యూ అనే రెండు సిస్టమ్స్ కలిగిన ఈ కేంద్రం.. దేశంలో తొలి స్వదేశీ నిర్మిత ఓపెన్-యాక్సెస్ క్వాంటం కంప్యూటింగ్ వేదికగా నిలిచింది. దాదాపు 85 శాతం కాంపోనెంట్లు దేశీయంగా తయారు కావడం విశేషం. ఇప్పుడు ఆ ముందడుగుకు అనుగుణంగా క్వాంటం-సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్ రూపంలో మరో మైలురాయి వస్తోంది.
ఈ టెస్ట్ బెడ్ ఏ పనిచేస్తుంది?
ఎసఆరఎం యూనివర్శిటీ-ఏపీ, సి-డాట్ (భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ల విభాగం), అమరావతి క్వాంటం వ్యాలీ త్రైపాక్షిక భాగస్వామ్యంతో టెస్ట్ బెడ్ నిర్మాణం జరుగుతోంది. క్వాంటం కమ్యూనికేషన్ హార్డ్వేర్, ఫొటోనిక్-ఆప్టికల్ సిస్టమ్స్, ఎన్క్రిప్షన్ టెక్నాలజీలు, సురక్షిత నెట్వర్క్ మౌలిక సదుపాయాలు, నెక్స్ట్-జనరేషన్ సైబర్ డిఫెన్స్ సొల్యూషన్స్పై పరిశోధన-పరీక్షలు నిర్వహించడం దీని లక్ష్యం. సరళంగా చెప్పాలంటే.. ఈ ల్యాబ్ ఒక ‘సైబర్ రక్షణ శిక్షణా కేంద్రం’ లాంటిది. ఏ ఎన్క్రిప్షన్ పద్ధతి ఎంత నిరోధకంగా ఉంటుందో ఇక్కడ పరీక్షించవచ్చు. క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ సాంకేతికత ఆధారంగా తయారుచేసిన సురక్షిత కమ్యూనికేషన్ పరిష్కారాలను ఇక్కడ అభివృద్ధి చేసి, పరీక్షించి, సర్టిఫై చేయవచ్చు.
సి-డాట్ అనుభవం.. అమరావతికి బలం
సి-డాట్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో క్వాంటం కమ్యూనికేషన్ అండ్ సెక్యూరిటీ సొల్యూషన్స్పై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు నడుంగట్టింది. సి-డాట్ ఇప్పటికే క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్, పోస్ట్-క్వాంటం క్రిప్టోగ్రఫీ, క్వాంటం-సెక్యూర్ వీడియో ఐపీ ఫోన్స్వంటి అత్యాధునిక పరిష్కారాలను అభివృద్ధి చేసిన అనుభవం కలిగి ఉంది. ఆ విశేష అనుభవం ఇప్పుడు అమరావతి ప్రయోగశాలకు శక్తినిస్తోంది.
భారత్ క్వాంటం భద్రతా ప్రణాళికలో భాగం
ఇది కేవలం ఒక రాష్ట్ర ప్రాజెక్ట్ కాదు.. జాతీయ వ్యూహంలో ముఖ్య భూమిక. భారత్ క్వాంటం-సేఫ్ క్రిప్టోగ్రఫీకి వేగంగా మారడాన్ని జాతీయ ప్రాధాన్యతగా గుర్తించింది. క్వాంటం-ఎనేబుల్డ్ సైబర్ దాడుల ముప్పు ఇప్పుడు మరింత ప్రత్యక్షంగా మారుతోందని అంచనా. ఈ నేపథ్యంలో అమరావతి టెస్ట్ బెడ్ ఒక జాతీయ టెస్టింగ్ మరియు సర్టిఫికేషన్ మౌలిక సదుపాయంగా ఎదగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తులు లేవు. బెంగళూరులో ఐఐఎస్సి, ఆరఆరఐ, సి-డాట్ సహకారంతో 1 కిలోమీటర్ ఫ్రీ-స్పేస్ లింక్ ద్వారా క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ సాధించిన నేపథ్యంలో, అమరావతి కేంద్రం ఈ జాతీయ క్వాంటం నెట్వర్క్లో కీలకమైన నోడ్గా మారే అవకాశం ఉంది.
యువత కోసం కొత్త కెరీర్ మార్గాలు
అమరావతి క్వాంటం వ్యాలీ మిషన్ డైరెక్టర్ సివి శ్రీధర్ ఈ కేంద్రం ‘భారత్ను ప్రపంచ అగ్రగామి క్వాంటం పరిశోధన హబ్లలో ఒకటిగా నిలిపే లాంచ్ప్యాడ’ అని అభివర్ణించారు. ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఏపీ విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్లు, యువ ఆవిష్కర్తలకు ఇది సరికొత్త అవకాశాల తలుపు తెరుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి ఎందుకు ముందంజలో ఉంది?
కేవలం నెల రోజుల వ్యవధిలో క్వాంటం కంప్యూటింగ్ ఫెసిలిటీ తర్వాత క్వాంటం-సెక్యూర్ కమ్యూనికేషన్ టెస్ట్ బెడ్ ప్రకటన రావడం.. అమరావతి క్వాంటం వ్యూహం ఎంత వేగంగా ముందుకు వెళ్తోందో చూపిస్తోంది. ఎనిమిది నెలల్లోనే క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ నిర్మాణం పూర్తి చేయడం జాతీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు సి-డాట్ భాగస్వామ్యంతో వస్తున్న కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్ ఈ వేగానికి మరింత ఊపునిస్తోంది. రక్షణ, బ్యాంకింగ్, టెలికాం, హెల్త్కేర్ రంగాల్లో సురక్షిత కమ్యూనికేషన్ అవసరం రోజురోజుకూ పెరిగిపోతున్న వేళ.. అమరావతి ఈ రంగంలో స్వదేశీ సాంకేతికతలు అభివృద్ధి చేసే జాతీయ కేంద్రంగా ఆవిర్భవించే దిశగా పరుగులు పెడుతోంది.
















