- శ్రమకు గుర్తింపు… శ్రామికులకు గౌరవం
- లేబర్ అడ్డాలతో నూతన అధ్యాయం
- కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
- వివాహం నుంచి ప్రసూతి వరకు… కార్మిక కుటుంబాలకు ఆర్థిక రక్ష
- సేఫ్టీ ఫస్ట్ నినాదంతో పారిశ్రామిక భద్రతలో నూతన ప్రమాణాలు
- భవన నిర్మాణ కార్మికులకు కూటమి భరోసా
- ఈఎస్ఐ ఆస్పత్రులలో సరికొత్త డిజిటల్ విప్లవం
- రెక్కల కష్టానికి రక్షణగా నిలిచిన ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలన
అమరావతి, మే 24: రాష్ట్ర నిర్మాణంలో అహర్నిశలు శ్రమిస్తూ, సమాజానికి వెన్నెముకలా నిలిచే సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత రెండేళ్లల్లో విప్లవాత్మక అడుగులు వేసింది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధాన లోపాలు, నిధుల దారి మళ్లింపుతో కుదేలైన నిర్మాణ రంగాన్ని, కార్మిక వ్యవస్థలను పునరుద్ధరిస్తూ కొత్త ఆశలు చిగురింపజేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతతో, అటు పారిశ్రామిక అభివృద్ధిని, ఇటు కార్మికుల ప్రాణ భద్రతను సమానంగా ముందుకు తీసుకెళ్తూ కార్మిక శాఖలో సరికొత్త ప్రగతి ఆవిష్కకృతమైంది. కార్మికుని సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యం, రక్షణే ధ్యేయంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. వివిధ రంగాల్లోని కార్మికులకు స్కిల్ అప్ గ్రేడ్ అయ్యేలా వారికి ట్రైనింగ్ ఇప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇప్పించడంపై ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ఇదే సమయంలో వారి గౌరవాన్ని మరింత పెంచేలా లేబర్ అడ్డాలను నిర్మించడం.. వారి సంక్షేమం కోసం నిధులు కేటాయించడం.. అలాగే వారి ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఆస్పత్రుల నిర్మాణం వంటివి చేపట్టడం వంటి చర్యలు తీసుకుని కార్మికులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని ఈ రెండేళ్ల పాలనలో జరిగిన పరిణామాల బట్టి కచ్చితంగా చెప్పొచ్చు.
లేబర్ అడ్డాలతో కార్మికులకు సరికొత్త వైభవం
రోజువారీ ఉపాధి కోసం ఉదయాన్నే రోడ్ల పక్కన, కూడళ్లలో ఎండనక, వాననక నిలబడి ఎదురుచూసే దినసరి కూలీల కష్టాలకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు వంటి ప్రాంతాలతోపాటు… ఉమ్మడి జిల్లాల కేంద్రంగా లేబర్ అడ్డాల నిర్మాణాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆధునిక ఇంటిగ్రేటెడ్ లేబర్ అమెనిటీస్ సెంటర్స్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ లేబర్ అడ్డాల ద్వారా కార్మికులకు ఒకే చోట స్వచ్ఛమైన తాగునీరు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్ల వంటి మౌలిక వసతులతో పాటు ఉద్యోగ సమాచారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను అందిస్తున్నారు. పని ఉన్నప్పుడు అక్కడి నుంచి పనులకు వెళ్తారు.. పనులు లేనప్పుడు ఆ సమయాన్ని స్కిల్ అప్ గ్రేడ్ చేసుకునేలా కార్యాచరణను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం వివిధ రంగాల్లోని కార్మికులకు ఉన్న అనుభవానికి టెక్నాలజీని జోడిస్తే.. వారికి మరింత మెరుగైన ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో నైపుణ్యాలు కల్పించేలా కటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కార్మికులను కేవలం ఓటర్లుగా కాకుండా రాష్ట్ర నిర్మాణంలో వారిని కీలక భాగస్వాములను చేసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది.
నిలిచిన పథకాలకు జీవం పోస్తూ… శ్రామిక లోకానికి అండ నిలుస్తూ…
రాష్ట్రంలో దాదాపు 88 లక్షల మందికి పైగా నమోదైన అసంఘటిత కార్మికులు ఉండగా, అందులో 18 లక్షలకు పైగా భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. గత ఐదేళ్ల కాలంలో డూప్లికేషన్ సాకుల పేరిట, నిధుల దారి మళ్లింపుతో నిలిచిపోయిన సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది. ప్రస్తుతం కార్మిక కుటుంబాలకు ధీమా కల్పిస్తూ ప్రసూతి సహాయం కింద రూ. 20 వేలు, వివాహ కానుకగా రూ. 40 వేలు అందిస్తోంది. అలాగే ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం సంభవిస్తే రూ. 20 వేల సహాయం, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ. 60 వేలు అందించడంతో పాటు ఉచిత వైద్య పరీక్షలు అందిస్తోంది.
ఫ్యాక్టరీల భద్రతకు పెద్ద పీట
పారదర్శకత, బాధ్యత, భద్రత అనే మూడు సూత్రాలతో ఫ్యాక్టరీల శాఖను ప్రభుత్వం బలోపేతం చేసింది. ప్లాంట్లలో ప్రమాదాల నివారణకు జులై-2024 లో ప్రత్యేక భద్రతా తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన 23 ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకుంది. కార్మికుల ప్రాణాలకు రక్షణగా సేఫ్టీ అలర్ట్, ఇన్సిడెంట్ అలర్ట్ వంటి వినూత్న కార్యక్రమాలను ప్రారంభించడమే కాకుండా, ప్రమాదకర రసాయన కర్మాగారాల పర్యవేక్షణకు కెమికల్ ఇన్స్పెక్టర్ల పోస్టుల సృష్టికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. జేఎన్టీయూ, ఎస్వీయూ వంటి ప్రతిష్టాత్మక యూనివర్శిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుని, 360 పరిశ్రమల్లో థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్లు, వందలాది మాక్ డ్రిల్స్ నిర్వహించడం ద్వారా పారిశ్రామిక భద్రతలో ఏపీ దేశానికే రోల్ మోడల్గా నిలిచింది.
ఈఎస్ఐ వైద్య సేవల్లో చారిత్రాత్మక మార్పులు
రాష్ట్రంలోని 15 లక్షల మంది ఇన్సూర్డ్ పర్సన్స్ ఆరోగ్య రక్షణే ధ్యేయంగా భీమా వైద్య సేవల శాఖను ప్రభుత్వం పూర్తిగా ఆధునీకరించింది. అచ్యుతాపురంలో కొత్త ఈఎస్ఐ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన జరగగా, తిరుపతి ఆసుపత్రి పడకల సామర్థ్యాన్ని 100కు పెంచింది. గుంటూరు, కర్నూలు, శ్రీసిటీ, నెల్లూరు ప్రాంతాలలో కొత్త ఆసుపత్రుల కోసం భూములను కేటాయించారు. విశాఖపట్నంలో 50 సీట్లతో కూడిన ESIC మెడికల్ కాలేజీ మంజూరు కావడం, అమరావతిలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలతో భవిష్యత్ వైద్య అవసరాలకు ఇప్పటి నుంచే కార్మిక శాఖ సన్నద్ధమవుతోంది. ఐదేళ్లుగా పెండింగులో ఉన్న శస్త్రచికిత్స సామగ్రి కొనుగోళ్లను రూ. 78 లక్షలతో పునరుద్ధరించి, సరికొత్త మొబైల్ యాప్ల (My Health, e-Aushadhi) ద్వారా ఔషధాల పంపిణీలో కూటమి ప్రభుత్వం పూర్తి పారదర్శకతను తెచ్చింది. పెట్టుబడుల రాకతో పరిశ్రమలు వృద్ధి చెందడమే కాకుండా, కార్మికుల ప్రాణాలకు, ఆరోగ్యానికి ఢోకా ఉండకూడదనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన సాగింది.













