- సమాజంలో మార్పు కోసం కొందరైనా రాజకీయాల్లోకి రండి
- త్వరలో ఎపి విద్యారంగంలోకి ఎఐ ట్యూటర్ ని తెస్తాం
- స్కూలుస్థాయి నుంచీ ఏఐ శిక్షణకు ప్రణాళికలు సిద్ధం
- షైనింగ్ స్టార్స్తో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి
తాడేపల్లి (చైతన్య రథం): “ఈరోజు షైనింగ్ స్టార్స్ కార్యక్రమం సందర్భంగా డ్రీమ్ వాల్స్, గ్రాటిట్యూడ్ వాల్స్పై విద్యార్థులు రాసిన మాటలు చూశాను. పలువురు విద్యార్థుల మనోగతాలు స్పూర్తిదాయకంగా ఉన్నాయి. మీరు కష్టపడి చదవండి. విద్యామంత్రిగా మీ కలలను సాకారం చేసేందుకు పూర్తి సహయ, సహకారాలు అందిస్తాను” అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తాడేపల్లి సిఎసఆర్ కళ్యాణ మండపంలో.. గతఏడాది టెన్త్, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరిట మంత్రి లోకేష్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా షైనింగ్ స్టార్స్తో మంత్రి లోకేష్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. విద్యార్థులు అద్భుతమైన సలహాలిచ్చారు. మీలో కొంతమంది రాజకీయాల్లోకి రావాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. నేను రాజకీయాల్లో ఉండటం వల్లే దేశంలో ఏ రాష్ట్రంలోలేని సంస్కరణలు ఏపీలో తెచ్చా. కొంతమంది అయినా రాజకీయాల్లోకి రావాలి” అని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. కాకినాడకు చెందిన క్రాంతి స్కూలుస్థాయి నుంచే కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, మోటివేషన్ క్లాసులు, లైబ్రరీలు కావాలన్నారు. “రాష్ట్రంలోని అన్ని లైబ్రరీలను ప్రక్షాళన చేస్తున్నాం. పుస్తకాలు చదివితే క్రియేటివిటీ వస్తుంది. మండలం, నియోజకవర్గం, జిల్లా, జోనల్స్థాయిలో లైబ్రరీలను బలోపేతం చేస్తాం. అమరావతిలో వన్ ఇయర్లో వరల్డ్ క్లాస్ లైబ్రరీ నిర్మించబోతున్నా”మని మంత్రి లోకేష్ వివరించారు. అన్నపూర్ణేశ్వరి అనే విద్యార్థి ఎన్సిసి, కంప్యూటర్ ల్యాబ్ కావాలన్నారు. “త్వరలో ఏఐ ట్యూటర్ని తెస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక స్వతంత్ర నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) స్టేట్ డైరెక్టరేట్ను కేంద్రం మంజూరు చేసిందని” మంత్రి పేర్కొన్నారు.
తండ్రి కోసం కార్డియాలజిస్టు నవుతా!
కదిరి గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి చెందిన షేక్ చాందిని మాట్లాడుతూ… 991/1000 మార్కులు సాధించి డిస్ట్రిక్ట్ టాపర్గా నిలిచాను. నా విద్యాభ్యాసానికి లెక్చరర్లు ఫైనాన్సియల్గా హెల్ప్ చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్స్ ఉపయోగపడ్డాయి. ఎంసెట్ మెటీరియల్ ఇచ్చారు. లెక్చరర్లు, పేరెంట్స్ సపోర్టు చేశారు. మా నాన్న హార్ట్ పేషెంట్. ఆయన కోసం కార్డియాలజిస్ట్ కావాలని అనుకుంటున్నాను. నీట్లో ప్రీకోచింగ్ ఇప్పించాలని కోరింది. మంత్రి లోకేష్ స్పందిస్తూ… ఇందుకు సాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన సిహెచ్ అనన్యశ్రీ మాట్లాడుతూ… మా నాన్న ఏపీ మోడల్ స్కూలులో టీచర్. మీరు చూపుతున్న చొరవ కారణంగా ప్రభుత్వ స్కూళ్లు బలోపేతం అవుతున్నాయి. మా ఫ్యామిలీలో అందరూ ప్రభుత్వ స్కూళ్లలో చదువుకొని ఉద్యోగాలు సాధించారు. అందుకే నేను కూడా ప్రభుత్వ స్కూలులోనే చేరా. భవిష్యత్తులో ఐఏఎస్ చదివి… విజన్ 2047 స్వర్ణాంధ్ర సాధనకు నావంతు చేయూతనందించాలన్నది నా సంకల్పం. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చారు.
ఏఐపై స్కూలుస్థాయినుంచే శిక్షణనిస్తాం
నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన షేక్ అనీషా మాట్లాడుతూ… పోటీపరీక్షలకు స్కూలుస్థాయి నుంచి ప్రత్యేకశిక్షణ ఇవ్వాలని కోరారు. ఇందుకు మంత్రి లోకేష్ స్పందిస్తూ… రాబోయే అయిదేళ్లలో 10, 11, 12 తరగతుల విద్యార్థులు విద్యతోపాటు సమాంతరంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేరయ్యేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. నెల్లూరు ప్రభుత్వ గర్ల్స్ హైస్కూలుకు చెందిన షేక్ షకీల మాట్లాడుతూ… మంత్రి నారాయణ కృషితో మా స్కూలు అత్యుత్తమంగా తయారైంది. మీరు విద్యామంత్రి అయ్యాక ప్రభుత్వ స్కూళ్ల బలం ప్రపంచానికి తెలిసిందని అన్నారు. మంత్రి లోకేష్ స్పందిస్తూ… ఫేజ్-1లో ప్రతి నియోజకవర్గంలో ఒక స్కూలును మోడల్ స్కూలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లా గుంటుపల్లి జెడ్పీహెచఎస్ విద్యార్థి పవన్సాయి మాట్లాడుతూ… స్కూలు స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్కు ప్రిపేర్ కావడానికి దిశానిర్దేశం చేయాలని కోరారు. మంత్రి లోకేష్ స్పందిస్తూ… ప్రతి ఇండస్ట్రియల్ రెవెల్యూషన్ ఉద్యోగాలు సృష్టిస్తుంది. గత పారిశ్రామిక విప్లవాలతో యూరప్ ఎక్కువ ఉద్యోగాలను సృష్టించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ సాంకేతిక విప్లవం రాబోతోంది. పాఠశాలస్థాయిలో ఏఐ ల్యాబ్స్తోపాటు ఫండమెంటల్స్పై వర్కవుట్స్ చేస్తున్నాం. ఏఐ వినియోగంపై స్కూలుస్థాయి నుంచే శిక్షణ ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఏ ఒక్కరూ చదువు మధ్యలో మానొద్దు
అనంతపురం జిల్లా నార్పల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన మనీష మాట్లాడుతూ… నేను ఎంఇసి గ్రూపు తీసుకున్నా. మా నాన్న చదివించలేకపోతున్నారు. సాయం చేయాలని కన్నీళ్ల పర్యంతమైంది. మంత్రి లోకేష్ స్పందిస్తూ… ధైర్యంగా ఉండు, నీ చదువుకు నేను సాయం చేస్తానని అన్నారు. అంగన్వాడీనుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కుటుంబ పరిస్థితుల ప్రభావంతో చదువు మానుకుంటున్న విద్యార్థులను ట్రాక్ చేస్తున్నాం. ఏ ఒక్క విద్యార్ధీ చదువు మధ్యలో వదిలేసి బయటకు వెళ్లకూడదు. సిస్టమాటిక్గా ట్రాక్ చేసి, చేయూతనందించాలన్నది తన ఆలోచనగా మంత్రి చెప్పారు. ప్రకాశంజిల్లా హనుమంతునిపాడు కెజిబివి ఒకేషనల్ విద్యార్థిని భాగ్యం మాట్లాడుతూ… నేను 990 మార్కులతో ఓకేషనల్లో టాపర్గా నిలిచాను. టెన్త్ తర్వాత చిన్నతనంలో నాకు పెళ్లిచేశారు. మేం అయిదుగురు ఆడపిల్లలం. టెన్త్లో చిన్నవయసులో పెళ్లి చేయడంతో చదువు మానేసి ఆరేళ్ల తర్వాత ఇంటర్ ఓకేషనల్లో చేరి టాపర్గా నిలిచాను. చదువు జీవితాన్ని మార్చగలదని నమ్మి మళ్లీ కాలేజీకి వెళ్లాను. ఇప్పుడు డిగ్రీ చదవాలని అనుకుంటున్నాను, సాయమందించాలని కోరింది.
నా బలం ఎగ్జిక్యూషన్, క్రిటికల్ థింకింగ్
కాకినాడ జిల్లా శంఖవరం ఏపి మోడల్ స్కూలు విద్యార్థిని స్వాతి మీ విద్యార్థి జీవితంలో మరువలేని జ్జాపకం ఏమిటని అడగ్గా మంత్రి లోకేష్ సమాధానమిస్తూ… నేను ఎప్పుడూ బట్టీ కొట్టలేదు. నా బలం అప్లికేషన్, ఎగ్జిక్యూషన్, క్రిటికల్ థింకింగ్ అన్నారు. స్వాతి మాట్లాడుతూ.. విద్యార్థుల అవసరాలను గుర్తించి మీరు మద్దతునిస్తున్నారు. సమాజంలో మార్పుకోసం మంచి పాలసీలు తెచ్చేందుకు నేను ఐఏఎస్ కావాలనుకుంటున్నాను. ప్రభుత్వ జూనియర్ కాలేజిల్లో ఇప్పుడు జెఇఇ, మెయిన్స్కు ఆన్లైన్లో శిక్షణ ఇస్తున్నారు. ఐఐటి కోచింగ్ ఇవ్వాలని కోరారు. తమ గ్రామంలో స్కూలుకెళ్లే రోడ్డు దశాబ్ధాలుగా పాడైపోయింది. బాగు చేయించాలని విన్నవించింది. మంత్రి లోకేష్ స్పందిస్తూ…3, 4 నెలల్లో రోడ్డు వేయిస్తా. అన్నీ చేయాలనే తపన ఉంది. రిసోర్స్కు అనుగుణంగా ఒక్కొక్కటిగా చేపడతాం. ప్రస్తుతం స్టేట్ హైవేస్ని తీసుకున్నాం. గ్రామీణ రోడ్లపై కూడా దృష్టిసారిస్తామని చెప్పారు. విశాఖ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజియో థెరపీ విద్యార్థి శ్రీహర్ష మాట్లాడుతూ… డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, టెక్ట్స్ బుక్స్ ఉపయోగకరంగా ఉన్నాయి. నా తండ్రి పెరాలసిస్తో చిన్నప్పుడు చనిపోయారు. దాంతో హెల్త్ అవేర్నెస్, ఫిజికల్ వెల్నెస్ ముఖ్యమని గ్రహించి నేను ఫిజియో థెరపీ కోర్సులో చేరాను. విద్యార్థులకు ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసుతోపాటు మెంటల్ హెల్త్ అవేర్నెస్ కూడా కల్పించాలని విజ్జప్తిచేశారు.













