- సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్
- పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని పతిపాదన
- మిర్చి ఎగుమతులకు సీఐసీ ప్లాట్ఫాం ద్వారా సహకరించండి
- ఏపీ-సింగపూర్ జెసీటీ రౌండ్టేబుల్ ఏర్పాటు చేయండి
- ఓడరేవుల ఆధారిత పారిశ్రామికీకరణపై దృష్టి సారించిన ఏపీ
- కమాడిటీస్ ఇంటిలిజెన్స్ సెంటర్ సీఈవో గ్లోరియా ఊతో మంత్రి లోకేష్ భేటీ
సింగపూర్ (చైతన్య రథం): సింగపూర్ కమాడిటీస్ ఇంటిలిజెన్స్ సెంటర్ సీఈవో గ్లోరియా ఊతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… సీఫుడ్, వ్యవసాయం, ఖనిజాలు, ఫార్మాస్యూటికల్ రంగాల్లో వాణిజ్య అనుసంధానం, ఎంఎసఎంఈ ఎగుమతిదారుల చేరిక, కమాడిటీ ఇంటిలిజెన్స్ సమాచార మార్పిడివంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం -సీఐసీ మధ్య సహకారాన్ని కోరుతున్నామని తెలిపారు. సీఐసీ బ్లాక్చెయిన్ ప్లాట్ఫామ్ను ఉపయోగించి కాగితరహిత వాణిజ్య ప్రక్రియ, సరుకుల పారదర్శకత కోసం సింగపూర్, విశాఖపట్నం లేదా కృష్ణపట్నం పోర్టు మధ్య ఒక డిజిటల్ వాణిజ్య కారిడార్ను పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మిర్చితోపాటు ఏపీనుంచి ఎగుమతికి అనువైన సరుకును గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్లోని ఎగుమతిదారులు, సీఐసీ, ఎంటర్ప్రైజ్ సింగపూర్, ఎస్జీఎక్స్లను ఒకచోట చేర్చి, ఏపీ-సింగపూర్ జాయింట్ కమాడిటీ ట్రేడ్ రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా సూచించారు.
ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తి చేసే రాష్ట్రం. భారతదేశ మిర్చి ఎగుమతుల్లో ఏపీ 40-45శాతం వాటాను కలిగి ఉంది. సముద్ర ఉత్పత్తులు, ఖనిజాలు, ఔషధ రంగాలలో కూడా బలమైన ఉనికిని కలిగి ఉంది. ప్రస్తుతం మేం ఓడరేవుల ఆధారిత పారిశ్రామికీకరణపై దృష్టి సారిస్తున్నాం. దీనిద్వారా మా ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేయాలనుకుంటున్నాం. ఆసియా, ప్రపంచ కమోడిటీ మార్కెట్ల అనుసంధానంతో డిజిటల్ ఇంటిగ్రేటెడ్ వాణిజ్య, లాజిస్టిక్స్ కేంద్రంగా మారడంలో సీఐసీ ప్లాట్ఫామ్ సామర్థ్యాలు ఆంధ్రప్రదేశ్కు ఉపకరిస్తాయని లోకేష్ వివరించారు.
కోవిడ్కుముందు సీఐసీ ద్వారా ఏపీ-చైనా మిర్చి వాణిజ్యానికి ప్రయత్నించాం. కానీ కోవిడ్వల్ల సంస్థాగత మద్దతు లేకపోవడంతో అవాంతరాలు ఎదురయ్యాయి. ఈ వాణిజ్య కారిడార్ను పునరుద్ధరించేందుకు సీఐసీ ప్లాట్ఫాం ద్వారా సహకారం అందించండి. దీనివల్ల మా గుంటూరు మిర్చికి కొత్త మార్కెట్ లభిస్తుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు సరుకు సమీకరణ, గ్రేడింగ్, నాణ్యతను ప్రామాణీకరించి, సరఫరా చేస్తాయి. కొనుగోలుదారులను అనుసంధానించడం, వాణిజ్య ఎగుమతుల ఫైనాన్సింగ్ను అందించేలా సీఐసీ సహకరించాల్సి ఉంటుంది. ఈమేరకు తొలుత మిర్చి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించండి. ఈ పైలట్ ప్రాజెక్ట్ను అమలు చేయడానికి సీఐసీ తన చైనా కొనుగోలుదారుల నెట్వర్క్, వాణిజ్య ఫైనాన్స్ యంత్రాంగాన్ని క్రియాశీలం చేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సీఐసీ సీఈవో గ్లోరియా ఊ మాట్లాడుతూ… ప్రపంచవ్యాప్తంగా ధృవీకరించబడిన కొనుగోలుదారులు, అమ్మకందారులు, లాజిస్టిక్స్ ప్రొవైడర్లు, ఫైనాన్షియర్లను అనుసంధానించే డిజిటల్ బీ2బీ మార్కెట్ ప్లేస్ కమాడిటీస్ ఇంటిలిజెన్స్ సెంటర్ అని అన్నారు. కమోడిటీ ఇంటెలిజెన్స్, ట్రేడ్ డేటా సెర్చ్ ఇంజిన్, దిగుమతి-డిమాండ్ అంచనా, ధర సిగ్నల్ పర్యవేక్షణ, బ్లాక్చెయిన్ ఆధారిత డాక్యుమెంట్ భద్రత, ఒకే క్లిక్తో కస్టమ్స్ క్లియరెన్స్, ఎండ్-టు-ఎండ్ ట్రేసబిలిటీ వంటి కార్యకలాపాలను సీఐసీ నిర్వహిస్తుందని తెలిపారు. సప్లై చైన్ ఫైనాన్స్, క్రెడిట్ అసెస్మెంట్, ఎంఎసఎంఈ ఎగుమతిదారుల వర్కింగ్ క్యాపిటల్ పరిమితులను సీఐసీ పరిష్కరిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన ఆశయాలకు అనుగుణంగా ఉండే సుస్థిరత-అనుసంధానిత వాణిజ్య సాధనాలకు సీఐసీ సహకారం అందిస్తుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.













