- పీపీపీ విధానం ఓ సక్సెస్ మోడల్
- అందరినీ తప్పుదారి పట్టించేలా వైసీపీ వైఖరి
- మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): న్యాయస్థానాలంటే జగన్రెడ్డికి లెక్కలేదని సీఎం చంద్రబాబు ఆక్షేపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సీఎం.. న్యాయస్థానాల పట్ల జగన్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. జగన్ తన అక్రమాస్తుల కేసుల్లో కోర్టుకు గైర్హాజరవుతారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్నా అభ్యంతరం వ్యక్తం చేస్తారు. న్యాయస్థానాలంటే జగన్కు ఏ మాత్రం లెక్కలేదని విమర్శించారు. పరకామణి చోరీ కేసును సాధారణ కేసుగా చూడటాన్ని హైకోర్టు కూడా తప్పు పట్టిందని సీఎం గుర్తు చేశారు. భక్తులు కానుకలుగా సమర్పించిన సొమ్ము చోరీ కావటం సెంటిమెంట్తో ముడిపడిన అంశం అని.. పరకామణి లెక్కింపులో కూడా ఏఐ టెక్నాలజీ వాడాలని న్యాయస్థానాలు చెప్పటం శుభ పరిణామం అన్నారు.
వైద్య కళాశాలల పీపీపీ విధానం విషయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను సైతం తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ ఎంపీలు యత్నించారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానంపై తనను తప్పుదోవ పట్టించే యత్నం చేయవద్దని కేంద్ర ఆర్థిక మంత్రి గట్టిగా చెప్పటంతో వారు వెనుదిరిగారన్నారు. పీపీపీ అనేది ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న సక్సెక్ మోడల్ అని.. అన్ని రంగాల్లోనూ ఇది అమలవుతోందన్నారు. దీని కారణంగా మెడికల్ సీట్లు పెరగటంతో పాటు పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు. ఈ విషయంలో ప్రజలతో పాటు అందరినీ తప్పుదారి పట్టించేలా వైసీపీ వ్యవహరిస్తోందన్నారు.
జిల్లా పార్టీ కమిటీలపై చర్చ
జిల్లా పార్టీ కమిటీలపై త్రిసభ్య కమిటీలతో సీఎం చంద్రబాబు చర్చ నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవులపై అభ్యంతరాలను పునఃపరిశీలించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మహిళల్లో సమర్థ నాయకత్వాన్ని తీసుకురావాలి. రెండు రోజుల్లో జిల్లా అధ్యక్ష పదవుల ప్రకటన ఉంటుంది. నెలాఖరులోపు రాష్ట్ర కమిటీ ప్రకటిస్తాం. ప్రతి 3 నెలలకు ఒకసారి కమిటీల పనితీరును సమీక్షిస్తాను. పనిచేయని వారిని తొలగించేందుకు వెనుకాడను. నా నుంచి కార్యకర్త వరకు.. అందరూ పార్టీ క్యాలెండర్కు అనుగుణంగా పనిచేయాల్సిందే. జనవరి నుంచి పూర్తిస్థాయిలో పనిలోకి దిగాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.













