- లక్షకుపైగా లబ్ధిదారులకు ప్రయోజనం
- ‘క్రెడిట్ అవుట్ రీచ్’లో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి సీతారామన్
- బ్యాంకులు.. అభివృద్ధి భాగస్వాములన్న చంద్రబాబు
- రాష్ట్రాభివృద్ధిలో బ్యాంకుల భాగస్వామ్యం కావాలని పిలుపు
- కూటమి వచ్చాక రుణాల రీ-షెడ్యూల్తో రూ.1538 కోట్లు ఆదా
- వివిధ వర్గాలకు రూ.3,216 కోట్లు పంపిణీ చేసిన సీఎం, కేంద్ర మంత్రి
నరసరావుపేట (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ప్రజల వద్దకే వెళ్లి రుణాలు అందించటం గర్వకారణమని, బ్యాంకులు రుణాలిచ్చే సంస్థలే కాదని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములన్నారు. రైతు భవిష్యత్తు మార్చడానికి, యువత కలలు నెరవేర్చడానికి, పారిశ్రామికవేత్తల లక్ష్యం నెరవేరడానికి రుణాలు ఎంతో ఉపయోగపడతాయని వ్యాఖ్యానించారు. గత వైసీపీ పాలనంతా సమస్యల సుడిగుండమేనని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్రానికి తిప్పలు తెచ్చిందని, కూటమి అధికారంలోకి వచ్చాకే ఆ రుణాల్ని కేంద్ర సహకారంతో రీ-షెడ్యూలు చేసి రూ.1,538 కోట్లు ఆదా చేశామన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేంద్ర ఆర్థిక శాఖ, ప్రభుత్వరంగ బ్యాంకులు సంయుక్తంగా నిర్వహించిన మెగా రుణమేళా కార్యక్రమానికి (క్రెడిట్ అవుట్ రీచ్) కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో 1,03,246 మంది లబ్ధిదారులకు రూ.3,216 కోట్ల రుణాలను అందజేశారు. ఇందులో భాగంగా 15 వేలమంది డ్వాక్రా మహిళలకు, 13,355 మంది పారిశ్రామికవేత్తలకు రుణాలు పంపిణీ చేశారు.
అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ “పారిశ్రామికవేత్తలుగా మారడానికి పల్నాడు చిరునామా కావాలి. పల్నాడు పౌరుషానికి శక్తివంతమైన ఆయుధం ఇస్తున్నాం. క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహిస్తున్న అందరికీ అభినందనలు. రైతులు, విద్యార్ధులు, డ్వాక్రా సంఘాల మహిళలు ఇలా అర్హులైన వారందరికీ రుణం అందించటమే లక్ష్యం. మహిళా సాధికారతకు ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ద్వారా ప్రయోజనాలు చేకూరతాయి. రెండేళ్ల క్రితం రాష్ట్రమంతా సమస్యల సుడిగుండంలో ఉంది. ఏపీలో ఆర్ధిక విధ్వంసానికి పాల్పడ్డారు. కేంద్ర సహకారంతో అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు ఆకాంక్షలు నెరవేరాయి. వీబీజీ రామ్ జీ కింద కేంద్రంనుంచి రూ.7,707 కోట్లు రాష్ట్రానికి వస్తుంది. రాయలసీమను హార్టీ కల్చర్ హబ్ గా మార్చేందుకు కేంద్రం రూ.40 వేల కోట్లు ఆర్థిక సహకారం అందిస్తుంది. ప్రైవేటు పెట్టుబడులతో కలిపి ఈ ప్రాంతాన్ని ఉద్యాన హబ్ మారుస్తాం” అని సీఎం వివరించారు.
నిర్మలా సీతారామన్ సంస్కరణల వాది
“మహిళలందరికీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదర్శంగా నిలుస్తున్నారు. 10 లక్షల డ్వాక్రా సంఘాలు రూ.29 వేల కోట్ల పొదుపుతో దేశంలోనే మేటిగా నిలిచాయి. రుణాల రీ పేమెంట్లో 99.5 శాతంతో డ్వాక్రా మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు. వారందరినీ మహిళా వ్యాపారవేత్తలుగా మార్చేందుకు వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమం చేపట్టాం. బ్యాంకింగ్లో నిర్మలా సీతారామన్ చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. నష్టాల్లో ఉన్న చిన్న బ్యాంకులను విలీనం చేసి సమర్థ బ్యాంకింగ్ వ్యవస్థకు దోహదం చేశారు. డిజిటల్ బ్యాంకింగ్ విప్లవం, జన్ ధన్ యోజన ద్వారా కోట్లాది బ్యాంకు ఖాతాలు, జీఎస్టీ శ్లాబ్లను కుదించి పారదర్శక విధానం తెచ్చారు. వికసిత్ భారత్ 2047కు అనుగుణంగా చాలా సంస్కరణలు కేంద్ర మంత్రి నిర్మల తీసుకొచ్చారు. ఈ తరహా క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాల్ని ఆరు జిల్లాల్లో నిర్వహించేందుకు తక్షణమే అంగీకరించారు. త్వరలోనే మూడు నెలలకు ఒకటి చొప్పున ఈ తరహా కార్యక్రమాలు చేపడతాం” అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
చిన్న వ్యాపారులకు అండగా కేంద్రం: నిర్మలా సీతారామన్
దేశంలోని ప్రతి గ్రామంలోనూ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. తాను ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయానికి బ్యాంకులు ఎన్పీఏల సమస్యలతో ఇబ్బందుల్లో ఉండేవని, చిన్న వ్యాపారులు అప్పులు దొరక్క నష్టపోయేవారని గుర్తుచేశారు. చిన్న వ్యాపారుల ఆర్థిక కష్టాలను గుర్తించిన ప్రధాని మోదీ.. ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా వారికి సులభంగా రుణాలు అందేలా పథకాలు తెచ్చారని వివరించారు. నేడు బ్యాంకులు స్వయంగా వ్యాపారుల చెంతకే వచ్చి రుణాలు ఇస్తున్నాయని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మెగా రుణమేళాలో భాగంగా లబ్దిదారులకు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి రుణ మంజూరు పత్రాలను, చెక్కులను అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ అందజేత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.42,16 లక్షల విలువైన అంబులెన్స్ను పిడుగురాళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి అందించారు. అలాగే నాబార్డు సౌజన్యంతో డీసీసీబీకి రూ.25 లక్షల విలువైన 2 మొబైల్ డెమో వ్యాన్లు అందించారు. అలాగే విద్యార్థినులకు రూ.17.80 లక్షల విలువైన 301 సైకిళ్లను పంపిణీ చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ అందజేత
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.42.16 లక్షల విలువైన అంబులెన్స్ను పిడుగురాళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి అందించారు. అలాగే నాబార్డు సౌజన్యంతో డీసీసీబీకి రూ.25 లక్షల విలువైన 2 మొబైల్ డెమో వ్యాన్లు అందించారు. అలాగే విద్యార్థినులకు రూ.17.80 లక్షల విలువైన 301 సైకిళ్లను పంపిణీ చేశారు. పర్యాటక శాఖకు గ్రామీణ బ్యాంక్ తరపున రూ.14 లక్షల విలువైన 2 బ్యాటరీ వాహనాలను అందించారు. వీటిని సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, స్థానిక ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, భాష్యం రామకృష్ణ, పలువురు ఎమ్మెల్యేలు, బ్యాంక్ అధికారులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. సభకు ముందు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అక్కడ ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్టాళ్లను సందర్శించి, నిర్వాహకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.















