- పార్టీని బలోపేతం చేసిన వారిని నేను బలోపేతం చేస్తా
- ప్రజాప్రతినిధుల పనితీరును విశ్లేషిస్తున్నా
- చక్కటి పనితీరుతోనే పదవులు దక్కుతాయి
- కుప్పం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు
కుప్పం (చైతన్యరథం): ప్రజల కోసం… పార్టీ బలోపేతం కోసం పనిచేసే వారికి ఎవ్వరి రికమెండేషన్లు అక్కర్లేదని… పదవులు వెతుక్కుంటూ వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డికి అలాగే పదవి దక్కిందని సీఎం వెల్లడించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజైన ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో నేతల పనితీరు మీద కూలంకుషంగా సమీక్షించారు. మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టి 3 ఏళ్లు అయిన సందర్భంగా రూపొందించిన పాటను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… గతంలోనూ.. ఇప్పుడూ కుప్పంలో ప్రారంభించిన కార్యక్రమాలనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశామన్నారు.
కార్యకర్తలు కష్టపడి, నిబద్ధతతో పని చేయడంతో షణ్ముఖ రెడ్డికి పార్లమెంట్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాను. నిన్నటి వరకు షణ్ముఖ రెడ్డి సామాన్య కార్యకర్త… నేడు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు. తెలుగుదేశం పార్టీ జెండా భుజాన మోసి గెలిచే వరకు పని చేయడం టీడీపీ కార్యకర్తలకు అలవాటు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా… సంక్షోభాలు వచ్చినా టీడీపీ కాబట్టే నిలదొక్కుకోగలిగింది. చరిత్రలో ఎప్పుడూ రానంత మెజార్టీ కూటమికి, టీడీపీకి వచ్చింది. వైసీపీ ప్రతిపక్ష హోదా దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. ప్రజలతో ఉంటేనే ఇలాంటి గెలుపు సాధ్యమవుతుంది. 2028 నాటికి నా రాజకీయ జీవితం 50 ఏళ్లకు చేరుతుంది. అభివృద్ధికి పునాదులు వేసింది.. వేసేది టీడీపీనే… విజన్-2020తో ఇది నిరూపితమైంది. ప్రజల భవిష్యత్ కోసమే… ప్రజల సంక్షేమం కోసమే తన ఆలోచనలని సీం వెల్లడించారు.
కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదనే టెక్నాలజీ వినియోగం
పార్టీని బలోపేతం చేసిన వాళ్లను వెతుక్కుని వచ్చి దండ వేసి గౌరవిస్తాను. నిర్మొహమాటంగా మాట్లా డతా…వాస్తవాలు చెబుతా… తప్పులు సరి చేసుకోమని సూచిస్తా… అప్పటికీ మారకుంటే నమస్కారం పెడ తాను. ఎమ్మెల్యేల పని తీరు ప్రతి వారం విశ్లేషిస్తూనే ఉన్నాను. కార్యకర్తలకు, నాకు కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉండేందుకు పార్టీలో కూడా టెక్నాలజీని వినియోగిస్తున్నాం. ప్రజలకు సంక్షేమం చేస్తామని ఇంటింటికి వెళ్లి చెప్పాం…ఆ సంక్షేమాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఇంటింటికి వెళ్లాలి. ప్రభుత్వం చేస్తున్న మంచిని చెప్పాలి. ప్రభుత్వం ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో పని చేస్తుందో ప్రజలకు వివరించాలి. కూటమిలోని పార్టీలతో కలిసి పని చేయాలి. ఒకే సీజన్లో హంద్రీ-నీవా ద్వారా కృష్ణా జలాలను కుప్పానికి తెచ్చాం. హంద్రీ-నీవా ద్వారా నీళ్లు రాకుంటే… కుప్పం నియోజకవర్గంలో ఇబ్బందులు వచ్చేవి. భారత దేశానికి అమరావతి లాంటి కొత్త నగరాలు అవసరమని ఆర్థిక సర్వేలో చెప్పారు. రాయలసీమను రతనాల సీమ చేస్తామని చెప్పాం.. చేసి చూపించాం. దేశంలోనే ఉద్యాన ఉత్పత్తుల్లో రాయలసీమ మొదటి స్థానంలో ఉంది. సీమలో ఉద్యాన రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
అంతకు ముందు ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ.. కుప్పంలో 150 చెరువులను నింపినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో 100 శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించేలా పని చేయాలన్నారు. తాను చేసిన పనిని గుర్తించి తనకు పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన ధన్యావాదాలు తెలిపిన చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డి. కుప్పంలో ఉంటే పేదరికం ఉండదనే రీతిలో సీఎం చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారని షణ్ముఖ రెడ్డి అన్నారు. ఫ్లెక్సీలు కట్టకున్నా… బ్యానర్లు వేయకున్నా పార్టీ కోసం పని కట్టకున్నా… బ్యానర్లు వేయకున్నా పార్టీ కోసం పని చేసిన తన కష్టాన్ని పార్టీ అధినాయకత్వం గుర్తించిందంటూ షణ్ముఖ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో కుప్పం స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.















