- ప్రతి గడపకూ ప్రభుత్వ ప్రాధాన్యతలు చేరాలి..
- ప్రభుత్వ ప్రగతి ఉద్దేశాలను ప్రజలకు వివరించండి
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం): అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 2026-27 బడ్జెట్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రతిపాదించిన బడ్జెట్.. గాడితప్పిన వ్యవస్థను తిరిగి పురోగతి దిశగా నడిపించేదిగా అధ్యక్షుడు పల్లా అభివర్ణించారు. అభివృద్ధి -సంక్షేమం -సంపద సృష్టి.. మూడు అంశాలు సమపాళ్లల్లో ముందుకు సాగేలా బడ్జెట్ రూపకల్పన సాగిందని.. ఆ విషయాన్ని స్పష్టంగా, విస్తతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. విజన్-2047 లక్ష్యాలను సాధించేలా రూపొందిన బడ్జెట్.. రాష్ట్ర భవితకు దిశానిర్దేశమన్నారు. టెలికాన్ఫెరెన్సులో ఎన్డీయే భాగస్వామ్యపక్ష జనసేన నేత, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. ఏపీని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఈ సందర్భంగా పల్లా స్పష్టం చేశారు. ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును నిర్దేశించేలా రూపొందిన బడ్జెట్.. రాష్ట్ర భవితకు స్పష్టమైన దశా దిశ చూపుతోందన్నారు. వ్యవసాయం, పారిశ్రామికరంగం, సాగునీటి రంగం, విద్య, వైద్యరంగాలకు బడ్జెట్లో పెద్దపీట వేయడం హర్షణీయమన్నారు.
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి బడ్జెట్లో భారీ కేటాయింపులు చేశారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళల సంక్షేమానికి కలిపి రూ.91.527 కోట్లకు పైగా కేటాయించడం పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. సంక్షేమం ప్రభుత్వ విధానాల్లో ప్రధాన అజెండాగా కొనసాగుతోందని పల్లా చెప్పారు. విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పాఠశాల విద్యకు రూ.32.308 కోట్ల కేటాయింపులు చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు బలమైన పునాదులు వేయాలన్న ప్రభుత్వ సంకల్పం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గ్రామీణాభివృద్ధికి, పంచాయతీరాజ్ శాఖకు రూ.20.942 కోట్లు, పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించేలా వైద్యారోగ్య రంగానికి రూ.19,306 కోట్లు కేటాయించడం ప్రజా కేంద్రీకృత పాలనకు నిదర్శనమని పల్లా స్పష్టం చేశారు. విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రూపొందిన బడ్జెట్ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపిస్తుందని స్పష్టం చేశారు.
విద్య, సంక్షేమం, అరోగ్యం, గ్రామీణ మరియు పట్టణాభివృద్ధివంటి కీలక రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు బడ్జెట్ కేటాయింపులు స్పష్టంగా తెలియజేస్తున్నాయన్నారు. రాష్ట్ర బడ్జెట్లో పాఠశాల విద్య, బీసీ సంక్షేమం, పంచాయతీరాజ్.. ఆరోగ్యం, జలవనరులు, పట్టణాభివృద్ది, ఇంధనం, వ్యవసాయం, సామాజిక సంక్షేమం, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖలకు భారీ నిధులు కేటాయించడం ద్వారా సామాజిక అభివృద్ధికే పెద్దపీట వేసినట్టు స్పష్టమవుతోందన్నారు. ఇది కేవలం ఈ ఏడాది అవసరాలకే కాకుండా రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన బడ్జెట్గా పల్లా అభివర్ణించారు. ఈ బడ్జెట్ను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం ప్రజాప్రతినిధుల బాధ్యతగా పల్లా పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లే ఈ బడ్జెట్తో ఏపీ భవిష్యత్ మరింత బలపడుతుందని, ఏపీని నెంబర్వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక అడుగు అని పల్లా ఉద్ఘాటించారు.
















