- రిటైర్డ్ ఇంజనీర్ల బృదంతో అధ్యయనం చేయిస్తాం
- ఈ ఏడాది జూలై నాటికి వెలిగొండ తొలిదశ పూర్తి
- పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తా
- శంకుస్థాపన చేసింది మేమే..పూర్తిచేసేదీ మేమే
- మార్కాపురం జిల్లాతో దశాబ్దాల కల సాకారం
- రూ.50 కోట్లతో కలెక్టరేట్నూ నిర్మిస్తాం
- జిల్లాకు తొలిసారి వచ్చా..అపూర్వస్వాగతం పలికారు
- గత పాలకులు పూర్తి కాకుండానే అంకితం చేశారు
- వెలిగొండపై వైసీపీ దొంగ డ్రామాలు మోసం కాదా?
- రూ.500 కోట్లే ఖర్చు చేసి పంగనామాలు పెట్టారు
- మంచి చేసిన వారికి అండగా నిలిస్తే బాగుంటారు
- ప్రజల కోసమే జీవితం..తెలుగుజాతి అభ్యున్నతే ముఖ్యం
- మార్కాపురం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- రూ.456 కోట్లతో ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన
మార్కాపురం(చైతన్యరథం): ఈ ఏడాది జూలై నాటికి వెలిగొం డ తొలిదశ పూర్తి చేసి మార్కాపురం జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత పాలకుడిలా ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకిత మంటూ రిబ్బన్ కటింగ్లు చేసి దొంగ నాటకాలు ఆడటం తమకు చేతకాదని వ్యాఖ్యానించారు. వెనుకబాటుకు గురైన మార్కాపురం ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామన్న హామీని నిలబెట్టు కున్నామని ఉద్ఘాటించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతీ ఎకరాకూ నీరివ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు. దీనికోసం విశ్రాంత ఇంజనీర్లతో ఓ బృందాన్ని వేసి అధ్యయనం చేయిస్తామని తెలిపారు. ప్రతీ ఎకరాకూ సాగునీరు ఇచ్చే అంశంపై బ్లూ ప్రింట్ తయారు చేస్తామని అన్నారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవాని పల్లెలో రూ. 456 కోట్లతో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రైతులతో కలిసి పనులను పరిశీలించారు. అనంతరం మార్కాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్రజలు 94 శాతం స్ట్రైక్ రేటు ఇచ్చారు. అరకు మొదలుకుని ప్రకాశం వరకూ మంచి విజ యం చేకూర్చారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మార్కాపురం, మదనపల్లి, పోలవరం ప్రాంతాలను జిల్లాలు చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు నిలబెట్టుకున్నాను. ఇక్కడి ప్రజలు 150 కిలోమీటర్లు ప్రయాణించి ఒంగోలుకు వెళ్లాల్సిన పని లేకుండా మార్కాపురాన్ని జిల్లా చేశాను. అన్యాయం జరిగిన మదనపల్లికి న్యాయం చేశా’ అని తెలిపారు.
శంకుస్థాపనతో పాటు ప్రారంభించే అవకాశం వచ్చింది
1996, మార్చి 5న ఈ ప్రాంతంలో నేను పర్యటించినప్పుడు ప్రజల కష్టాలు కళ్ళారా చూశాను. శ్రీశైలం నుంచి నీరివ్వమని ఇక్కడి ప్రజలు నన్ను కోరారు. ఆనాడు వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాం. భగవంతుడు మళ్లీ నాకే అవకాశం ఇచ్చాడు. వెలుగొండను పూర్తి చేసి మీ జీవితాల్లో వెలుగులు తెస్తాను.. రైతులను ఆదుకుంటాం. 2014-2019లో ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించాం. ఈ ప్రాజెక్టు ద్వారా 4.35 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యం. దీనివల్ల గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గా లకే కాకుండా ఉదయగిరి, కడప జిల్లా బద్వేలుకు కూడా నీరు అందుతుంది. 2019లో మనమే అధికారంలోకి వచ్చి ఉంటే 2021లోనే ప్రాజెక్టు పూర్తి చేసి నీరిచ్చేవాళ్లం. 2019-2024 మధ్య చీకటిరోజులు వచ్చాయి. గత ముఖ్యమంత్రి వెలిగొండ పూర్తి కాకుండానే జాతికి అంకితమంటూ దొంగ నాటకాలు ఆడాడు. చీమకుర్తి, మార్కాపురం సభల్లో 2023లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. ఉత్తుత్తి ప్రాజెక్టుకు రిబ్బన్ కటింగ్ చేశాడు. ఇలా చేయడం మోసం కాదా అని ప్రశ్నించారు.
మంచి చేసిన వారికి అండగా నిలవాలి
నేను చేయగలిగిందే చెబుతున్నాను. వెలిగొండ ప్రాజెక్టుకు పూర్తికి రూ.9081 కోట్ల నిధులు కావాలి. ఇప్పటివరకూ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.5451 కోట్లు ఖర్చు వ్యయం చేశాం. భూసేకరణ కు రూ.484 కోట్లు, పునరావాసానికి రూ.184 కోట్లు ఖర్చు చేశాం. రెండు దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రణాళిక చేశాం. ఇంకా రూ.2,540 కోట్లు ఖర్చు చేస్తే కానీ వెలిగొండ పనులు పూర్తి కావు. గడచిన 20 నెలల్లో రూ.540 కోట్లు ఖర్చు చేసి పనులు వేగంగా చేపట్టాం. రూ.456 కోట్లతో విలువైన ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేశాను. గత పాలకులు ఐదేళ్లలో ఈ ప్రాజెక్టుకు కేవలం రూ.500 కోట్లు ఖర్చు చేసి పను లు అయిపోయాయని రైతులకు పంగ నామాలు పెట్టారు. మంచి చేసిన వారికి అండగా నిలుస్తేనే ప్రజల జీవితాలు మెరుగవుతా యని వ్యాఖ్యానించారు.
రూ.1300 కోట్లతో ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీరు
అన్ని వర్గాలకు న్యాయం చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. ఎక్కడ పేదలు ఉంటే అక్కడ నేను ఉంటాను. ఎన్నికల్లో చెప్పినట్టే సూపర్సిక్స్ సూపర్హిట్ చేశాం. పింఛన్ల కోసం ప్రతిఏటా రూ.34 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. స్త్రీ శక్తి కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. మగవారితో సమానంగా మహిళలకు అవకాశాలు రావాలని డ్వాక్రా సంఘాలు స్థాపించాను. ఈ ఏడాది లక్షమంది ఆడబిడ్డలను పారిశ్రామిక వేత్తలుగా తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీపం పథ కం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అన్న దాత సుఖీభవ కింద రైతులకు మూడు విడతల్లో రూ.20,000 ఇస్తున్నామని తెలిపారు.
పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం
2027లో పుష్కరాలకు ముందే పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం. నల్లమల సాగర్కు గోదావరి నీళ్లు ఇస్తాం. అది వచ్చేలోగా ఈ ఏడాది జూలై నాటికి నల్లమల సాగర్ పూర్తి చేసి వెలిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తాం. ఈ ప్రాజెక్టు కోసం ఇంకా రూ.2 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. గతేడాది హంద్రీనీవాపై శ్రద్ధ పెట్టాం. ఈ ఏడాది వెలిగొండపై శ్రద్ధ పెట్టి ప్రజల జీవితాల్లో జలకళ తీసుకొస్తాం. హార్టికల్చర్కు ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నాం. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారు స్తున్నాం. సీమతో పాటు మార్కాపురం, ప్రకాశం జిల్లాలను ఉద్యాన పంటలతో అభివృద్ధి చేస్తాం. మార్కాపురాన్ని ఉద్యాన పంటలకు కేంద్రంగా తయారు చేసేందుకు ప్రజలు సహకరిం చాలి. రూ.1300 కోట్లు వ్యయంతో నల్లమల సాగర్ నుంచి ప్రతి ఇంటికి సురక్షిత నీరు అందించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు.
మార్కాపురం ప్రజల ఆకాంక్ష నెరవేర్చాం
ప్రజలకు హామీ ఇచ్చినట్టుగానే మార్కాపురాన్ని జిల్లాగా చేసి ఇక్కడి ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాం. మార్కాపురం జిల్లాలో భూ రికార్డుల సమస్యలున్నాయి. మేము అధికారంలోకి వస్తూనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం. గత పాలనలో ల్యాండ్ రికార్డులన్నీ అస్తవ్యస్తం చేశారు. అడిగిన భూములు ఇవ్వకపోతే 22ఏలో పెట్టారు. సర్వే రాళ్లపై వారి ఫొటోలు వేసుకున్నారు. మేము రాజముద్రతో పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తు న్నాం. క్యూఆర్ కోడ్తో భూమి రికార్డులు భద్రంగా తయారు చేయిస్తున్నాం. ఎవరైనా తప్పు రికార్డులు చేస్తే తాట తీస్తామని హెచ్చరిస్తున్నాను. మార్కాపురం జిల్లా నూతన కలెక్టరేట్ భవనా నికి రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నాం. 20 నెలల పాలనలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. యువత కు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. అవినీతికి తావు లేకుండా మెగా డీఎస్సీ నిర్వహించాం. కానిస్టేబుళ్ల నియామ కాలు పూర్తి చేశాం. వరదనీరు వృథాగా పోకుండా భూగర్భ జలాలు పెంచుతాం. గోదావరి నుంచి 6000 టీఎంసీలు, కృష్ణా నుంచి 1500 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లింది. వెలిగొండ ప్రాజెక్టుకు కావాల్సింది కేవలం 53 టీఎంసీల నీరే. ఈ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఉంది. ఫ్లోరైడ్ సమస్య ఉన్న ప్రాంతాల్లో సురక్షిత నీరు సరఫరా చేస్తాం. పరిశుభ్రమైన రాష్ట్రం కోసం ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర నిర్వహిస్తు న్నాం. పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పీ4 కార్యక్ర మం చేపట్టాం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని తెలిపారు.
2019-24 మధ్య రాష్ట్రానికి చీకటిరోజులు
గత పాలకులు చేయని అపచారం లేదు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారు. కెమికల్స్ కలిపిన నెయ్యితో లడ్డూలు చేసి విక్రయించారు. ఆ నెపాన్ని హెరిటేజ్ పై మోపారు. ఆనాడు బాబాయ్ని చంపేసి మరుసటి రోజు సాక్షి పత్రికలో నారా సుర రక్త చరిత్ర అని నా చేతిలో కత్తి పెట్టాడు. నోరు తెరిస్తే బూతులు మాట్లాడతారు. నా తల్లి, సతీమణి, మా పార్టీ నేతలను ఇష్టాను సారంగా దుర్భాషలాడారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి రారు కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలంటా రు. వాళ్లు బెదిరిస్తే ఇవ్వాలా.. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేస్తేనే ఏదైనా సాధ్యం అని కూడా వారికి తెలీదా? గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. ప్రజలు ఇంట్లో నుంచి బయట కు రావాలంటే భయపడ్డారు. గంజాయి, భూ కబ్జాలు, దౌర్జన్యాలతో హడలిపోయారు. నేను ఎవరు తిట్టినా లెక్కపెట్టుకో ను. నేను జీవిస్తోంది ప్రజలు, రాష్ట్రం కోసమే. నాకు కుల, మత విభేదాలు లేవు. తెలుగు జాతి అభ్యున్నతి నాకు ముఖ్యం. బడు గు, బలహీన వర్గాలను పైకి తీసుకొచ్చి అవకాశాలు కల్పిస్తాం. నేను ఆనాడు టెక్నాలజీని ప్రమోట్ చేశాను. మన దూరదృష్టి కారణంగా దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణ నుంచి వస్తోంది. గుజరాత్ రాష్ట్రంలో 25 ఏళ్లుగా ఒకే పార్టీ అధికారంలో ఉంది. మోదీ 3వ సారి ప్రధాని అయ్యారు. మరో సారి అవుతారు. ప్రజలు ఏది మంచి, ఏది చెడు అనేది ఆలోచ న చేసి కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సమర్థులను గెలిపిం చాలని కోరారు.
స్థానిక రైతులతో కలిసి ఫీడర్ కాలువ పనులు పరిశీలన
వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనుల శంకుస్థాపన అనం తరం రైతులు వెంకటేశ్వరరెడ్డి, సురవరం గండి వీరారెడ్డిలతో సంభాషిస్తూ ఫీడర్ కెనాల్ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. వెలిగొండ పూర్తి అయితే ఈ ప్రాంత భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని, బోర్లకు, చెరువులకు నీరు వస్తాయని ముఖ్యమంత్రికి రైతులు వివరించారు. ఈ సందర్భం గా ప్రాజెక్టు పనులు, ఫీడర్ కాలువ పనులు వేగంగా చేపడుతు న్నందుకు ముఖ్యమంత్రికి స్థానిక రైతులు ధన్యవాదాలు తెలిపా రు. అరటి, బొప్పాయి లాంటి పంటల సాగు చేసేందుకు అను కూల ప్రాంతమని, మీరే శంకుస్థాపన చేశారు, మీరే ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తున్నారని సీఎంతో రైతులు ఆనందంతో అన్నారు. ప్రాజెక్టులో రూ.2500 కోట్ల విలువైన పనులు మిగిలి ఉన్నా వాటిని పూర్తి చేయకుండా జాతికి అంకింతం చేసినట్టు గత పాలకులు నాటకాలాడారని ఈ సందర్భంగా చంద్రబాబు వారితో వ్యాఖ్యానించారు.
వెలిగొండ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష
ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, పనులు జరుగుతున్న తీరుపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. 11,580 క్యూసెక్కు ల నీరు ప్రవహించేలా ఫీడర్ కాలువ పనులు చేపట్టామని జల వనరుల శాఖ అధికారులు వివరించారు. నల్లమల సాగర్ ప్రాంతంలో మూడు గ్యాప్స్ ఫిల్ చేసి రిజర్వాయర్ ఏర్పడిందని , తద్వారా 53.83 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రోజుకు 200 మీటర్ల మేర కాలువ లైనింగ్ పనులు చేస్తున్నామని, 1.80 లక్షల క్యూబిక్ మీటర్ల మేర సైడ్ వాల్ పనులు మే చివరి నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు.
ఫ్లడ్ సీజన్ ప్రారం భం అయ్యే సమయానికి ఫీడర్ కాలువ సిద్ధం అయిపోతుందని వెల్లడించారు. 45 రోజుల్లో 45 టీఎంసీల మేర నీరు డ్రా చేసు కుని నల్లమల సాగర్ నింపేందుకు ప్రణాళిక చేసినట్టు అధికారు లు వివరించారు. వెలిగొండ ప్రాజెక్టు సొరంగాలు, కాలువ పనులు తదితర అంశాలను నమూనా ద్వారా వివరించారు. కంభం చెరువును కూడా నింపేలా కాలువను అనుసంధా నించినట్టు తెలిపారు. స్థానికంగా వివిధ చెరువులు, నీటి వనరులను నింపేందుకు అవసరమైన స్ట్రక్చర్లను పూర్తి చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు. రూ.400 కోట్లతో ఈ పనులు చేపట్టేందుకు వీలుగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. వెలిగొండ టన్నెళ్ల పనులు పూర్తి అయ్యాక, పోరుమామిళ్ల, రాచర్లకు కూడా నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి ఎప్పటికప్పుడు తనకు తెలియచేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
మార్కాపురంలో ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం
నూతన జిల్లాగా ఏర్పడిన తర్వాత తొలిసారి మార్కాపురంలో పర్యటించిన ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. జిల్లా ఏర్పాటు కలను నిజం చేసినందుకు ముఖ్యమంత్రికి నాయకులు ధన్యవాదాలు తెలిపారు. మార్కాపురం జిల్లా కళ, వెలిగొండ జలకళ సభకు హాజరైన ముఖ్యమంత్రికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. వేదిక నుంచి ప్రజల మధ్యకు వేసిన ర్యాంపుపై నడుస్తూ, ప్రజలకు అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ప్రజలు హర్షాతిరేకాల మధ్య ఆయన ప్రసంగం యావత్తూ ఉత్సాహంగా సాగింది. సభకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు, అభిమానులు తరలి వచ్చారు.














