అమరావతి: న్యాయమూర్తులను అసభ్య పదజాలంతో దూషించిన వైసీపీ నేతలకు పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తూ.. ప్రజాసమస్యలపై స్పందించే ఎన్ఆర్ఐలను మాత్రం వేధింపులకు గురిచేయడం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించే ఎన్ఆర్ఐ లు అంటే జగన్ రెడ్డికి గిట్టదని మరోసారి బట్టబయలైందని శనివారం ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఎన్ఆర్ఐ యాష్ బొద్దులూరి అరెస్ట్ అప్రజాస్వామికం. అక్రమ నిర్బంధాలతో ప్రజల గొంతు నొక్కే కుట్రకు జగన్ రెడ్డి తెరలేపారు. ఓటమి భయంతోనే ఇటువంటి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. విదేశాల్లో ఉంటూ కూడా కన్నభూమిపై మమకారంతో ప్రజాసమస్యలపై నిర్భయంగా స్పందించే ఎన్ఆర్ఐ యాష్ ను అరెస్ట్ చేయడం ప్రభుత్వ సైకో చర్యలకు అద్దం పడుతోంది. అనారోగ్యంతో ఉన్న తల్లిని పరామర్శించేందుకు వచ్చిన యాష్ను ఎయిర్పోర్టులో దిగగానే అక్రమంగా సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. యాష్ భద్రతపై ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు జగన్ మోహన్ రెడ్డి తీరును ఖండిరచాలని అచ్చెన్నాయుడు అన్నారు.


















