- ఆన్లైన్ దరఖాస్తు పార్ట్2 కింద సర్టిఫికెట్ల అప్లోడ్ ఇప్పుడు ఐచ్ఛికం
- ధ్రువీకరణ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాలి
- అభ్యర్థులు అంకితభావంతో సన్నద్ధమై విజయం సాధించాలి
- ఎక్స్లో మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): డీఎస్సీ ఆశావహులు పరీక్షలపై దృష్టి కేంద్రీకరించి ఏకాగ్రతతో సన్నద్ధం కావాలని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు. దరఖాస్తుల అప్లోడ్ సమయంలో ముఖ్య విషయాలు జాగ్రత్తగా పరిశీలించాలని కోరారు. రాష్ట్రంలో మెగా డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో మంత్రి నారా లోకేష్ మంగళవారం ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్లో కీలక అప్డేట్ ఇచ్చారు. డీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తు పార్ట్ 2 కింద సర్టిఫికెట్లను అప్లోడ్ చేయడం ఇప్పుడు ఐచ్ఛికమని తెలిపారు. అయితే సర్టిఫికెట్ల ధ్రువీకరణ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుందని వెల్లడిరచారు. డీఎస్సీ అర్హత కోసం నిర్ణయించిన గాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్కుల ప్రమాణాలు టెట్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయంలో ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని మంత్రి సూచించారు. అలాగే అంకితభావంతో చదివి ఈ డీఎస్సీలో అభ్యర్థులు విజయం సాధించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. కాగా, ఈ నెల 20న ఏపీ పాఠశాల విద్యాశాఖ మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు.