- ఏడాదిలో రాష్ట్రంలో 3 ‘సర్క్యులర్ ఎకానమీ పార్కులు’
- అక్టోబర్ 2 నుంచి 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం
- 87 పట్ణణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్- రీయూజ్- రీసైకిల్ సెంట్లర్లు
- వ్యర్ధాల నిర్వహణలో ప్రతిభ కనబరిచే వారికి ‘స్వచ్ఛత’ అవార్డులు
- ‘సర్క్యులర్ ఎకానమీ’పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో వ్యర్ధాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీ తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మొదటగా రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏడాదిలోగా ఏర్పాటు చేయాలని, అలాగే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక యంత్రాలను వినియోగాన్ని పెంచాలని సూచించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలిగించాలని సీఎం ఆదేశించారు. 90 రోజుల్లోగా రీసైక్లింగ్, చెత్తను వేరు చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలన్నారు. మంగళవారం సచివాలయంలో సర్క్యులర్ ఎకానమీపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వ్యర్ధాలనుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై ప్రధానంగా చర్చించారు. ‘సర్క్యులర్ ఎకానమీ పార్కులు’ ఏర్పాటుపై ‘మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ ప్రతిపాదనలను పరిశీలించారు. మొదటిదశలో భాగంగా విశాఖపట్నంలో 400 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ‘సర్క్యులర్ ఎకానమీ పార్కు’ను అంతర్జాతీయస్థాయిలో నిర్మించాలని, ఇందుకోసం వివిధ దేశాల్లోని పార్కులను పరిశీలించాలని సీఎం సూచించారు. వీటితో భారీగా పెట్టుబడులు వచ్చేలా చూడాలని చెప్పారు.
11 రంగాలు, 3శాఖలపై ప్రధానంగా దృష్టి
సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్రం గుర్తించిన మున్సిపల్, వాహనాలు, లిథియం బ్యాటరీలు, జిప్సం, టైర్లు, రబ్బర్, ఎలక్ట్రానిక్, వ్యవసాయం, పారిశ్రామిక, ఆక్వా వ్యర్ధాలవంటి 11 రంగాలపై దృష్టి పెట్టడంతోపాటు అదనంగా గనులు, చేనేత, పశుసంవర్ధక శాఖలతో కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం నిర్దేశించారు. నగర పాలక సంస్థలు, పంచాయతీల్లో జీరో వేస్ట్ లక్ష్య సాధనకు కృషి చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. వ్యర్ధాల నిర్వహణలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వాళ్లకు ప్రోత్సాహకంగా ‘స్వచ్ఛత’ అవార్డులను వచ్చే ఏడాది అక్టోబర్ 2నుంచి ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. స్థానిక సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీలు, పాఠశాలలు-కళాశాలలు, బస్టాండ్లు, ఆస్పత్రులు, ఎన్జీవోలు, వివిధ ఆర్గనైజేషన్ల వారీగా అవార్డులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు.
ప్లాస్టిక్ రహిత నగరాలు
ఈ ఏడాది అక్టోబర్ 2నాటికి రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండి… 4 నగరాలతోపాటు మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా అరికట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నగరాల్లో క్లాత్ బ్యాగులు వినియోగాన్ని పెంచాలని చెప్పారు. అలాగే 87 పట్ణణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్- రీయూజ్- రీసైకిల్ సెంట్లర్ల ఏర్పాటు చేయాలని నిర్దేశించారు.
మొత్తం 52 వేస్ట్ క్లస్టర్లు ఏర్పాటు
జిల్లాకు రెండు చొప్పున రాష్ట్రంలోని పట్టణాలు, పంచాయతీ ప్రాంతాల్లో మొత్తం 52 వేస్ట్ క్లస్టర్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంనుంచి ఏటా బ్యాటరీలు, ఇతర ఆటోమోటివ్ వ్యర్ధాలు 36,588 టన్నులు, ప్లాస్టిక్ -పెట్ బాటిల్స్ వేస్ట్ 61,996 టన్నులు, ఇంజిన్ ఆయిల్స్ ఇతర హైడ్రాలిక్ చమురు వ్యర్ధాలు 23,928 లీటర్లు, టైర్లు-రబ్బర్ 59,654 మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు వస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అత్యధికంగా వ్యవసాయరంగం నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు, పశువులు-ఆక్వా-పౌల్ట్రీ ఈ మూడు రంగాలనుంచి 347 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు వస్తున్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ రోజూ 88 లక్షల గృహాలనుంచి 1,329 మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు వస్తున్నాయని తెలిపారు. రాజస్థాన్, కర్నాటక, మహారాష్ట్రలో సర్క్యులర్ ఎకానమీ కోసం అందిస్తున్న ప్రోత్సాహకాల వివరాలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
సర్క్యులర్ ఎకానమీ ప్రయోజనాలు
రాష్ట్రంలో సర్క్యులర్ ఎకానమీ సమర్ధంగా అమలు చేయగలిగితే జీఎస్డీపీకి ఏడాదికి అదనంగా రూ.15,000 కోట్లు జత చేరుతుందని అంచనా. అలాగే మరో రూ.10,000 కోట్ల విలువైన మెటీరియల్ను ఉత్పత్తి రంగానికి సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ఈ విలువ జోడిరపుతో రాష్ట్రం జీఎస్టీ రూపంలో రూ.3,000 కోట్ల ప్రతీ ఏటా ఆర్జించవచ్చు. మరోవైపు ప్రత్యక్షంగా 1,00,000 మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. 10 వేల మైక్రో ఎంట్రప్రెన్యూర్లకు ఉపాధి లభిస్తుంది. దీంతోపాటు పరోక్షంగా 10 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. దీనికితోడు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. కర్బన వాయువుల విడుదల తగ్గుతుంది. భూ, జల, వాయ కాలుష్యాన్ని గణనీయంగా అరికట్టవచ్చు.