- ప్రజల నుంచి వినతులు స్వీకరించి మంత్రి లోకేష్ హామీ
- సత్యవేడులో మంత్రి నారా లోకేష్ 62వ ప్రజాదర్బార్
- ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని భరోసా
- వినతులతో పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు
సత్యవేడు (చైతన్యరథం): కూటమి ప్రభుత్వ పాలనలో సామాన్యుల సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా పనిచేస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. తన తిరుపతి జిల్లా సత్యవేడు పర్యటనలో రెండో రోజు గురువారం ఉదయం స్థానిక సంత ప్రాంగణంలో 62వ ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారినుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని భరోసా ఇచ్చారు. మంత్రి లోకేష్ రాకను పురస్కరించుకుని పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు.
నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించండి
తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం తలారివెట్ట గ్రామంలో తాను 2021లో కొనుగోలు చేసిన 2.22 ఎకరాల భూమిని నిషేధిత జాబితా అయిన 22-ఏ లిస్ట్లో చేర్చారని, విచారించి తన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని బుచ్చినాయుడు కండ్రిగకు చెందిన హరిప్రసాద్ నాయుకు..మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
పూర్తి అంగవైకల్యంతో బాధపడుతున్న తన 20 ఏళ్ల కుమారుడికి పెన్షన్ మంజూరుచేసి ఆదుకోవాలని సత్యవేడు మండలం అప్పయ్యపాళెం గ్రామానికి చెందిన ఎస్.వెంకటేష్ నాయుడు విజ్ఞప్తి చేశారు. ఆధార్ సమస్యలతో ఇప్పటివరకు పెన్షన్ మంజూరు కాలేదని, అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి
లోకేష్ హామీ ఇచ్చారు.
ప్రభుత్వం తమ కుటుంబానికి మంజూరు చేసిన 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని, వారి బారినుంచి తమ స్థలాన్ని రక్షించడంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వాలని తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనంబేడుకు చెందిన సీహెచ్ శాంతి విన్నవించారు.
ఇంజనీరింగ్ చదివిన తన కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని సత్యవేడు నియోజకవర్గం నారాయణవనానికి చెందిన
ఎన్.భాస్కరన్ విజ్ఞప్తి చేశారు.
తమ గ్రామంలో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేయాలని సత్యవేడు నియోజకవర్గం ఎరికంబట్టు గ్రామానికి చెందిన టి.దామోదరంరెడ్డి విజ్ఞప్తి చేశారు. కంకర వేసి రోడ్డు పనులు మధ్యలో నిలిపివేయడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
గతేడాది తన భర్త మరణించాడని, కుటుంబ పోషణ కోసం వితంతు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని సత్యవేడు నియోజకవర్గం రాళ్లకుప్పం గ్రామానికి చెందిన జి.నాగభూషణమ్మ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగం పేరుతో తనవద్ద ఈ.గోపాలకృష్ణ, ఈ.ధనశేఖర్ రూ.3లక్షలు వసూలు చేసి మోసం చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని సత్యవేడుకు చెందిన కె.వెంకటేశులు విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.