- విజయవాడలో గురువుల గర్జన
- మెగా డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారానికి నిరసనగా ఉపాధ్యాయుల ఆత్మగౌరవ యాత్ర
- భారీ ర్యాలీ చేపట్టిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్లు
- రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిలా తమకు కారుణ్య నియామకం జరగలేదని మండిపాటు
- ప్రతిభతో ఉద్యోగం సాధించిన వాళ్లం.. ప్రకాశం బ్యారేజీలో పడేస్తామని హెచ్చరిక
- జగన్ ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు..ఇప్పుడు నిరాధార ఆరోపణలు
- 16 వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
విజయవాడ (చైతన్యరథం): తాము కష్టపడి చదివి ఉద్యోగాలు తెచ్చుకుంటే వాటిపై జగన్ రెడ్డి విషప్రచారం చేస్తున్నారరని మెగా డీఎస్సీ 2025 ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాల తమ శ్రమను, తెలివితేటలను తక్కువ చేస్తూ నిరాధార నిందలు వేయటం వైసీపీకి తగదని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తమ జీవితాలతో ఆడుకుంటే తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. మెగా డీఎస్సీపై విష ప్రచారం మానకుంటే వైసీపీనీ ప్రకాశం బ్యారేజీలో పడేస్తామని హెచ్చరించారు. వైసీపీ నేతలు పదేపదే తప్పుడు ఆరోపణలతో తమను అవమానిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠాలతో పాటు గుణపాఠాలు కూడా. చెబుతామంటూ నినాదించారు. 2025 డీఎస్సీ ప్రతిభగల డీఎస్సీ అని టీచర్లు వ్యాఖ్యానించారు. జగన్ అండ్ కో తమపై బురద జల్లటం మానుకుని.. బుద్ధి తెచ్చుకోవాలని ప్లకార్డులు పట్టుకుని టీచర్లు ఈ ర్యాలీ చేపట్టారు. తమతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. మేము పిల్లలకు విలువలు నేర్పుతున్నాం. మాకే విలువలు లేవన్నట్టు మాట్లాడటం సరికాదన్నారు. వైసీపీ నాయకులు తమను రాజకీయ పావులుగా ఉపయోగించొద్దని, ఉపాధ్యాయులపై ఆరోపణలు చేయడం ద్వారా సమాజంలో వారి గౌరవాన్ని దెబ్బతీయొద్దని సూచించారు. తమ వృత్తి గౌరవాన్ని కాపాడుకోవడానికి రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారానికి నిరసనగా డీఎస్సీ 2025లో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ఆదివారం విజయవాడలో ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన సుమారు 7వేల మంది ఉపాధ్యాయులు నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు.
ప్రతిభతో ఉద్యోగం సాధించిన తమపై వైసీపీ పార్టీ అసత్య ఆరోపణలతో తీవ్రంగా అవమానిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిలా తమకు కారుణ్య నియామకం జరగలేదని.. ఎంతో కష్టపడి చదివితే ఉద్యోగం వచ్చిందని ధ్వజమెత్తారు. తల్లిదండ్రుల కళ్లలో ఆనందం కోసం నిద్రలు మానుకోని కష్టపడి చదివి టీచర్ కొలువులు సాధిస్తే.. నేడు వైసీపీ తమతో రాజకీయం చేయడం దారుణమన్నారు. టీచర్ కొలువు కోసం సంవత్సరాలు కొద్ది కుటుంబాలను దూరం చేసుకొని ఒక పూట భోజనం చేశామన్నారు. వైసీపీ నాయకుల విష ప్రచారంతో ఉద్యోగం వచ్చిన ఆనందం కూడా తమ కుటుంబాల్లో లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు కేవలం ఉపాధ్యాయులను మాత్రమే కాదు.. భారత అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థనే అవమానిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులకు జ్ఞానం పంచే తమను ఇలా బలి చేయడం సరైనా పద్దతి కాదని హితవు పలికారు. మెగా డీఎస్సీపై వైసీపీ నిందలు మానుకొని నిజాలు తెలుసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో కొత్తగా వస్తోన్న మరో డీఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. యువత వైసీపీ ట్రాప్ లో పడి ఆ పరీక్షకు ప్రిపరేషన్ ఆపొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల తల్లిదండ్రులు కొందరు పాల్గొన్నారు. ఎంతో కష్టపడి చదివి ఉద్యోగాలు పొందిన తమ బిడ్డలపై నిందలు మానుకోవాలని ఆవేదన వ్యక్తం తమ బిడ్డలపై నిందలు మానుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు ఆత్మగౌరవ ర్యాలీ చేపట్టారు. వైసీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు.
ఎన్టీఆర్ జిల్లాకు చెందిన టీచర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సమాజానికి విలువలు నేర్పుతున్న ఉపాధ్యాయులకు వైసీపీ నాయకులు మలినాలు అంటగట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. మా తల్లిదండ్రుల కళ్లలో ఆనందం కోసం 10ఏళ్లు కష్టపడి టీచర్ ఉద్యోగం సాధించా. 46 సంవత్సరాల వయస్సులో మూడు పీజీలు చేసిన నాకు ఉద్యోగం కనుక్కోవాల్సిన అవసరం ఏం ఉంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో ఉపాధ్యాయులనే కాదు.. భారత అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థనే వైసీపీ నాయకులు అవమానిస్తున్నారు. వైసీపీ హయాంలో గ్రూప్ 1 నియామకాల్లో జరిగిన కుంభకోణాన్ని కప్పిపుచ్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి డీఎస్సీపై ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ హయంలో జరిగిన గ్రూప్ 1 అవకతవకలపై అసెంబ్లీలో చర్చ జరగాలి. వర్టికల్, హారిజెంటల్ రిజర్వేషన్ల గురించి జగన్మోహన్ రెడ్డి అవగాహన పెంచుకోవాలి. మా కష్టాలను తెలుసుకొని డీఎస్సీ నోటిఫికేషన్ కు కృషి చేసిన నాయకులు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు. ఉద్యోగం రాలేదని ఆరోపణలు చేస్తోన్న స్పోర్ట్స్ కోటాకు చెందిన అభ్యర్థులు వాళ్లు మొదటఒక సర్టిఫికేట్స్ అప్ లోడ్ చేసి వెరిఫికేషన్ లో మరో సర్టిఫికేట్స్ చూపించారు. జగన్ రెడ్డి ఇదిగో డీఎస్సీ అదిగో డీఎస్సీ అంటూ ఊరించారు. ఐదేళ్లలో ఒక డిఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయని అసమర్థ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 2024 ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ప్రభుత్వం తక్కువ సమయంలోనే డిఎస్సీ నోటిఫికేషను విడుదల చేసిందన్నారు.
కృష్ణా జిల్లా ఆరుగొలనుకు చెందిన ఇంగ్లీష్ టీచర్ శ్వేత మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ అంతా పారదర్శకంగా జరిగిందన్నారు. దీనిపై నిందలు వేసి మా వృత్తిని అవమానించద్దు. ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్పి నిజం చేయాలని వైసీపీ పార్టీ కుట్రలు చేస్తోంది. కుటుంబాలకు దూరంగా ఉండి కళ్లలో ఒత్తులు వేసుకొని కష్టపడి చదివిన మాపై నిందలు వేయడం దారుణం. బావి భారత పౌరులను తయారు చేస్తున్న మాపై వైసీపీ నాయకులు బురద జల్లాలని చూస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి 16వేల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం వెలుగులు నింపిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు సూర్య మాట్లాడుతూ.. ఈ రోజు మేము ఎన్నో త్యాగాలు చేసి మరి సాధించుకున్న ఉద్యోగాలను తప్పు అంటున్నారు.. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని అడ్డు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన జగన్ కూడా తప్పుల గురించి మట్లాడుతున్నారా.. అని మండిపడ్డారు. మీరు ఉపాధ్యాయుల పక్షాన నిలబడేలా అయితే… రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై పోరాటాలు చేయాలని సూచించారు. గుంటూరు జిల్లాకు చెందిన శనగల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వయస్సు పరిమితి దాటిపోతున్న తనకు మెగా డీఎస్సీ 2025 ఆశ కిరణంలా నిలిచిందన్నారు. ఉపాధ్యాయునిగా స్థిరపడాలనే నా కలను నిజం చేసింది కూటమి ప్రభుత్వం. కంటి చూపు సరిగ్గా లేకున్నా నా కుటుంబానికి వెలుగులు నింపాలని కష్టపడి చదవి ఉద్యోగం సాధించా.
రేయింబవళ్లు కష్టపడి ఉద్యోగం సాధిస్తే మాపై నిందలు వేస్తే బాధగా ఉంది. గురువులను అవమానించిన వాళ్లకు పుట్టగతులు ఉండవని స్పష్టం చేశారు.
తెనాలికి చెందిన పసుపులేటి చిరంజీవి మాట్లాడుతూ.. 16 వేల జీవితాల్లో కాదు.. 16 వేల కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపిందన్నారు. ఉపాధ్యాయిని గౌరవాన్ని పెంచిన కూటమి ప్రభుత్వానికి మనమందరం రుణపడి ఉండాలి. అలానే ఇది మెగా డీఎస్సీ కాదు.. దగా డిఎస్సీ అని బురద జల్లుతున్నారు కాబట్టి, దానిని వ్యతిరేకించాల్సిన అవసరం కూడా మన మీద ఉంది. ఇది దగా డీఎస్సీ కాదు.. ఇది మెగా డీఎస్సీ.. కష్టపడి మేము సాధించుకున్న మా హక్కు” అని అన్నారు.
కృష్ణా జిల్లా బాపులపాడుకి చెందిన సుమలత మాట్లాడుతూ.. ఐదేళ్ల కాలంలో ఒక్క జాబ్ కూడా ఇవ్వని జగన్ ఇవాళ డీఎస్సీ గురించి మాట్లాడటం సిగ్గు చేటులా అనిపించలేదా అని నిలదీశారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మన రాష్ట్రంలో ఇలాంటి అసత్య ఆరోపణలు మంచిది కావు. రాష్ట్ర అభివృద్ధిలో వైసీపీ భాగం కావాలి గానీ.. ఇలా ఆరోపణలు చేస్తూ అభివృద్ధికి అడ్డంకిగా మారకూడదు. సమాజ నిర్మాణంలో మేము ముఖ్య భూమిక పోషిస్తున్నాం. మాకు ఆత్మ సాక్షి ఉంటుంది.. మాపై నిందలు మానుకోవాలి. సరాసరిగా అందరం 40 ఏళ్ల వయస్సులో ఉద్యోగాలు సాధించాం. రూ.25లక్షలకు జాబ్ కొనుక్కునే స్థోమత ఉంటే ఇన్ని రోజులు సమయం వృధా చేస్తామా. పిల్లలను, కుటుంబాలను దూరం పెట్టి ఉద్యోగాలు సాధించాం.. మాపై నిందలు వేయడం సరికాదని హితవు పలికారు.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు గోపాల్ మాట్లాడుతూ..
2019-24 మధ్య కాలంలో డీఎస్సీ నోటిఫికేషన్ గురించి వేయి కళ్లతో ఎదురు చూసినా ఫలితం లేకపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 16 వేల పోస్టులను భర్తీ చేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. కూటమి ప్రభుత్వం ఇంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై ఏ మొహం పెట్టుకుని విమర్శలు చేస్తున్నారో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. కూటమి ప్రభుత్వానికి డీఎస్సీ అభ్యర్థులందరూ కూడా జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు దుర్గాదేవి మాట్లాడుతూ.. తమను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్న వారికి ఇక్కడే నిలబడి సమాధానం చెప్పాం తాము విజయం సాధించినట్లేనన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సరే బ్రిటిష్ వారు పాటించిన విభజించి పాలించు అనే సూత్రాన్ని ఇంకా అనుసరిస్తునే ఉన్నారు. మనం ఎంత కష్టపడ్డామో… ఎన్ని వదులుకున్నామో.. మనకి మాత్రమే తెలుసునని ఆవేదన వ్యక్తం చేశారు.
ర్యాలీ చివర్లో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించడం ద్వారా ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని కాపాడాలనే తమ డిమాండ్ను స్పష్టం చేశారు. వైసీపీ విష ప్రచారానికి వ్యతిరేకంగా ఇప్పటికే కర్నూలు, తిరుపతి సహా పలు జిల్లాల్లో డీఎస్సీ విజేతల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించిన విషయం తెలిసిందే.














