- 2,50,893 ఇళ్లు లబ్దిదారులకు అప్పగింత
- ఈ ఏడాది డిసెంబర్లోపు మరో 4.5 లక్షల ఇళ్లు
- సంక్షేమంలో మర్చిపోలేని మాసంగా మార్చి
- విశాఖలో ప్యాలస్ కట్టుకున్న వ్యక్తి పేదలకు ఇళ్లు కట్టలేదు
- మన జలాల్లోకి పొరుగు రాష్ట్రాల జాలర్లు రాకుండా కట్టడి
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు
- లబ్దిదారుల గృహ ప్రవేశాలకు హాజరైన ముఖ్యమంత్రి
నాయుడుపేట (చైతన్య రథం): ఈ ఏడాది చివరినాటికి మరో 4.5 లక్షల ఇళ్లను పేదవారికి నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ఏడాది జూన్, సెప్టెంబరు మాసాల్లో గృహ ప్రవేశాలు చేసేలా లబ్దిదారులకు ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. కూటమి అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ఇప్పటి వరకూ 5.5 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చామన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30చోట్ల నిర్మించిన 2,50,983 టిడ్కో, పీఏఏవై ఇళ్లను లబ్దిదారులకు అప్పగించారు. తాను హాజరైన ఒక్క తిరుపతి జిల్లాలోనే 15,659 ఇళ్లను నిర్మించి ఇచ్చామని సీఎం వివరించారు. నాయుడుపేటలోని పుదూరువద్ద జీ ప్లస్ 3 తరహాలో నిర్మించిన భవన సముదాయాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. పార్కులు, వాకింగ్ ట్రాక్, విశాలమైన రహదారులు, అంగన్వాడీ, స్కూలు తదితర సదుపాయాలతో నిర్మించిన ఈ టిడ్కో భవనాలను ప్రారంభించిన అనంతరం లబ్దిదారుల గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. హైందవ సంప్రదాయ ప్రకారం నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను బహూకరించారు. అనంతరం మరో ముస్లిం లబ్దిదారు నివాసంలోనూ ప్రార్ధనలు నిర్వహించి నూతన గృహంలో అడుగుపెట్టారు.
ఇంటి వెలుపల మహిళా లబ్దిదారు పేరిట ఏర్పాటు చేసిన నేమ్ బోర్డును కూడా ముఖ్యమంత్రి స్వయంగా తగిలించారు. ప్రతీ ఇంటిపైనా పీఎం సూర్యఘర్ కింద సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ పొదుపు చేసే ఉపకరణాలను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈమేరకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ సంస్థతో రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం మరికొందరు లబ్దిదారులకు ఇళ్లకు సంబంధించిన స్వాధీన పత్రాలను ఇంటి తాళాలను అప్పగించారు. గతంలో పీఏఏవై కింద కేంద్రం ఇచ్చిన డబ్బులను కూడా గత పాలకులు దుర్వినియోగం చేశారని సీఎం ఆక్షేపించారు. గత ప్రభుత్వం రూ.816 కోట్ల మేర అప్పు పెట్టిందని.. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో ఇళ్లు కట్టేందుకు ప్రయత్నించిందన్నారు. పేదలు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి కల్పించిందని ముఖ్యమంత్రి ఆక్షేపించారు.
సంక్షేమంలో మార్చినెల కొత్త రికార్డులు
గడచిన 21 నెలల్లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని ..ఈ పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం-వ్యయం ఎలా ఉన్నా… సంక్షేమానికి, అభివృద్ధికి మాత్రం లోటు లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం. పింఛన్లకు ఇప్పటికి దాదాపు రూ.60 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. తల్లికి వందనం, దీపం 2, స్త్రీశక్తి సహా ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించామన్నారు. ఈ మార్చి నెల సంక్షేమంలో కొత్త రికార్డులు సృష్టించింది. వరాలను తెచ్చిందన్నారు. మార్చి 8న మహిళా దినోత్సవం రోజు లక్ష మంది పారిశ్రామిక వేత్తలుగా ప్రకటించామని..ఈ ఏడాది 5 లక్షల మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని పెట్టుకున్నామని స్పష్టం చేశారు. రైతుకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులను విడుదల చేశామని.. 47 లక్షల మంది రైతులకు రూ. 2,676 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్టు వివరించారు. ఉగాది కానుకగా నిరుద్యోగ యువత కోసం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చామని అన్నారు.
దేశంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ యార్డ్కు నెల్లూరు జిల్లాలో శంకుస్థాపన చేసుకున్నామని.. రక్షణ రంగంలో మన రాష్ట్రం కీలకం అవుతుందన్నారు. వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయని వివరించారు. 12.76 లక్షల మంది దివ్యాంగులకు ‘దివ్యాంగ శక్తి’ పేరుతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా ఈ నెలలోనే కల్పించామని సీఎం తెలిపారు. ఉగాది రోజున 6,787 మంది పేదలకు రూ. 56 కోట్లను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి విడుదల చేశామన్నారు. రంజాన్ తోఫాగా ఇమామ్, మౌజన్లకు రూ. 45 కోట్ల గౌరవ వేతనాలు చెల్లించామని స్ఫష్టం చేశారు. పోలవరం నిర్వాసితులకు రూ.226 కోట్ల పునరావాస నిధులను విడుదల చేశామన్నారు. అన్నింటికీ మించి రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో కీలకమైన ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్కు శంకుస్థాపన చేశామని.. ఈ పరిశ్రమ ద్వారా రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, లక్ష ఉద్యోగాలు ఒకే ఒక్క పరిశ్రమతో మనకు దక్కాయన్నారు. గత ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్లకు నిలిపివేసిన రూ.2,000 కోట్ల పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి 50 వేల కుటుంబాల్లో ఆనందాన్ని తీసుకువచ్చామని తెలిపారు. అంతకుమించి . 5 కోట్ల ప్రజల కలలు నెరవేర్చే ప్రజా రాజధానికి చట్టబద్దత కల్పించమని కేంద్రాన్ని కోరుతూ శాసన సభలో తీర్మానం చేశామన్నారు.
2029నాటికి 17 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం
2029 నాటికి రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడదన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మొత్తం 17 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. 2014-19లో 8.19 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టి పేదలకు అప్పగించామని వివరించారు. గత పాలకులు అన్ని వ్యవస్థల్నీ అస్తవ్యస్తం చేశారని వాటన్నిటినీ గాడిలో పెడుతున్నామన్నారు. గత పాలకులు పేదవాళ్ల పొట్టకొట్టారని.. వారికి తీరని అన్యాయం చేశారృని అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 6.5 లక్షల ఇళ్లు మాత్రమే కడితే 21 నెలల్లోనే తాము 5.5 లక్షల ఇళ్లను కట్టి పేదవాళ్లకు అప్పగించామన్నారు. గత పాలకులు ప్రజావేదికతో విధ్వంసాన్ని మొదలు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. రూ.10.50 లక్షల కోట్ల అప్పులు చేసి.. కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా మళ్లించారన్నారు. అవినీతి, అక్రమాలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీఎం ఆక్షేపించారు. ఇళ్ల కోసం లబ్దిదారులు కట్టిన రూ.174 కోట్లను కూడా వాడేసుకున్నారని అన్నారు. 22 వేల మంది లబ్దిదారులకు ఆ డబ్బులను తక్షణమే చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.
300 చదరపు అడుగుల ఇల్లు ఉచితమని, 350,400 చదరపు అడుగుల ఇళ్లు రాయితీపై ఇస్తామని ప్రగల్భాలు పలికి మోసం చేశారన్నారు. నివాస యోగ్యం కాని స్థలాలను ఇచ్చి ఇళ్లు కట్టించే ప్రయత్నం చేసి రూ.3,109 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని సీఎం వ్యాఖ్యానించారు. శ్మశానాల్లో, వాగుల్లో, బురద నేలల్లో స్థలాలు ఇచ్చి ఎవరికీ ఉపయోగపడకుండా చేశారన్నారు. ఈ పరిస్థితిని మారుస్తూ పేదలు మురికివాడలు కాకుండా పరిశుభ్రమైన ప్రాంతాల్లో ఉండాలన్న లక్ష్యంతో అన్ని సదుపాయాలతో ఇళ్లను నిర్మిస్తున్నట్టు వివరించారు. విశాఖలో ప్యాలస్ కట్టుకున్న వ్యక్తి పేదలకు ఇళ్లు కట్టడానికి మీనమేషాలు లెక్కించారన్నారు.
ఏప్రిల్నుంచి ఆకస్మిక తనిఖీలు
అందరికీ ఇళ్లు కార్యక్రమం కింద రాష్ట్రంలో పేదలకు ఉచితంగా ఇళ్లస్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి వివరించారు. భవిష్యత్తులో ప్రతీ ఇంటికీ పైపు ద్వారా గ్యాస్ సరఫరా చేస్తామన్నారు. ఉచిత సిలెండర్ కు ఇచ్చే డబ్బులు ప్రతీ రెండు నెలలకూ వినియోగదారులకు చెల్లిస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని కూడా గత పాలకులు నిర్వీర్యం చేశారన్నారు. కేంద్రాన్ని ఒప్పించి 2028 వరకూ ఈ పథకం కొనసాగించేలా చేశామన్నారు.
2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతుందని.. మహిళలకూ చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరుగుతుందన్నారు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే మహిళలకు టీడీపీ, ఎన్డీఏలు స్వాగతం పలుకుతాయన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించాలన్న లక్ష్యంతోనే అనునిత్యం పనిచేస్తున్నామని సీఎం వివరించారు. ఉద్యోగులకు మొదటి తేదీనే జీతాలు వచ్చేలా వ్యవస్థను గాడిలో పెట్టామన్నారు. పెన్షన్ సహా వివిధ సంక్షేమ కార్యక్రమాలు, పౌర సేవల అమలులో ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అన్నారు. పౌర సేవలు అందించటంలో చక్కగా పనిచేస్తున్న ఉద్యోగులందరికీ అభినందనలు తెలియచేస్తున్నట్టు వివరించారు. సేవలు సరిగ్గా అందని చోట సరిచేసుకోవాలని సీఎం హెచ్చరించారు. ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని సీఎం స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయాన్ని అనుసరించే పాలన మెరుగు పర్చుకుంటున్నామని తెలిపారు. ప్రజలు ఓటేసి కూటమికి అధికారం ఇచ్చారని.. కానీ ఒకాయన ప్రతిపక్ష హోదా ఇమ్మని అడుగుతున్నారని.. ఆ హోదా ఇచ్చేది ప్రజలే కానీ తాను కాదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.
రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ప్రజలకు మేలు చేయాలని కానీ విధ్వంసం చేయకూడదన్నారు. అలాంటి వారిని దూరం పెట్టాల్సిన అవసరముందన్నారు. 2028 నాటికి తాను రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి అవుతుందని.. ఎలాంటి ఆరోపణలూ లేని తనపై కేసులు పెట్టి జైల్లో వేశారని ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని సీఎం ప్రశ్నించారు. ఇంకా కొందరు సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా పోస్టులు పెట్టి ఆడబిడ్డలను రోడ్డుపైకి లాగుతున్నారని.. దీనిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ముఖ్యమంత్రి బాగా పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని గత పాలకుడు ఏపీని గంజాయికి, డ్రగ్స్ కు అడ్డాగా మార్చారన్నారు. కూటమి ప్రజాప్రభుత్వం అనునిత్యం రాష్ట్రంలో సంపద సృష్టికే ప్రయత్నిస్తోందన్నారు. సమర్ధవంతమైన నిర్వహణతో సంక్షేమం అభివృద్ధి సమతూకంగా చేపడుతున్నామన్నారు.
మత్స్యకారులకు అండగా ప్రజాప్రభుత్వం
అటానమస్ షిప్ యార్డు వల్ల స్థానిక మత్స్యకారులు ఎవరికీ అన్యాయం జరగదని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పొరుగు రాష్ట్రాల జాలర్లు మన జలాల్లోకి రానివ్వకుండా కట్టడి చేస్తామని స్పష్టం చేశారు. నెల్లూరు తీరప్రాంతానికి ప్రత్యేకంగా రెండు గస్తీ బోట్లను మంజూరు చేస్తున్నట్టు వివరించారు. పొరుగు రాష్ట్రాల జాలర్ల కారణంగా స్థానిక మత్స్యకారులకు ఎలాంటి నష్టం జరక్కుండా చూడాల్సిన బాధ్యతను తిరుపతి, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి అప్పగించారు. తమిళనాడు, పాండిచ్చేరి నుంచి వచ్చిన జాలర్లు ఈ ప్రాంతంలో చేపల వేట చేసుకోడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. అవసరం మేరకు మరో 4 బోట్లను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
చేపల వేట నిషేధ సమయంలో జాలర్లకు ఇచ్చే భృతిని మత్స్యకారుల సేవలో పథకం ద్వారా రూ.20 వేలకు పెంచామని.. దీని కోసం 1.29 లక్షల మంది కుటుంబాల ఖాతాల్లో రూ.259 కోట్లు జమ చేశామన్నారు. ఇక మత్స్యకారుల పొట్టకొడుతూ గత ప్రభుత్వం తెచ్చిన 217 జీవోను కూడా రద్దు చేసి స్థానిక నీటి వనరుల్లో జాలర్లకే వేట అనుమతిని పునరుద్ధరించామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, కొలుసు పార్ధసారధి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.













