- వైసీపీ నాశనం చేస్తే -మేం శాసనం చేశాం
- దేశమంతా మద్దతిస్తే వైసీపీ ఒక్కటే వ్యతిరేకించింది
- పార్లమెంటులో చేసిన చట్టాన్నీ గౌరవించరా?
- వైసీపీకి రాష్ట్ర ప్రజలు, వారి ప్రయోజనాలంటే లెక్కలేదు
- ఇక అమరావతిని ఎవరూ మార్చలేరు, కదల్చలేరు
- మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి (చైతన్య రథం): ఒక్క వైసీపీ మినహా దేశంలోని అన్ని పార్టీలు ఏపీ రాజధాని అమరావతికి అండగా నిలిచాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో అన్ని రాజకీయ పార్టీలూ, ఎంపీలు అమరావతి చట్టబద్దత కల్పించే బిల్లుపై మద్దతు పలికితే.. ఒక్క వైసీపీ ఎంపీలు మాత్రమే వ్యతిరేకించి వాకౌట్ చేశారని వ్యాఖ్యానించారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావం, రాజధాని ఏర్పాటు, అమరావతి ఎంపిక, వైసీపీ కుట్రలు, రాజధాని రైతుల ఉద్యమం, అసెంబ్లీ, మండలిలో జరిగిన పరిణామాలు, న్యాయ పోరాటం, రాజధాని పునర్నిర్మాణంవంటి అంశాలను సీఎం వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “ఒక్క పార్టీ మినహా దేశంలోని పార్టీలన్నీ రాజధానికి అండగా నిలిచాయి. లోక్సభ, రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తూ 50 పార్టీలుంటే వాటిల్లో వైసీపీ మినహా అన్ని పార్టీలు అమరావతికి మద్దతిచ్చాయి. రాష్ట్రపతి ఆమోదం తర్వాత దీనికి పూర్తిస్థాయి చట్టబద్దత వస్తుంది. అన్ని విధాలా సహకరించిన ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు. లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ పార్లమెంటులో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, ఎంపీలకు కృతజ్ఞతలు. రాజకీయ వైరుధ్యాలు, వ్యక్తిగతంగా భిన్నాభిప్రాయాలున్నా అన్ని పార్టీలు సహకారం ఇచ్చాయి. కొందరికి రాష్ట్రం గురించి తెలియదు.
ఈ రాష్ట్రంతో అవసరం కూడా ఉండకపోవచ్చు. కానీ అలాంటి పార్టీలు కూడా రాజధాని చట్టబద్దత కల్పించే బిల్లుకు సహకరించాయి. అనుకూలంగా ఓటేశాయి. కానీ ఈ రాష్ట్రంలో ఓట్లు పొంది, ఇక్కడి నుంచి ఎంపీలుగా ఎన్నికైన వ్యక్తులు ఈ రాష్ట్రానికే ద్రోహం చేసేలా వ్యవహరించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును వ్యతిరేకించారు. దేశంలోని పార్టీలన్నీ ఓవైపు ఉంటే… వైసీపీ మాత్రం మరోవైపు నిలిచింది. వైసీపీ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించింది. దేశ ప్రయోజనాలు కాపాడేందుకు ప్రాంతీయ పార్టీలు సహకరిస్తాయి. కానీ రాష్ట్రం నాశనమైనా పర్వాలేదనే రీతిలో జగన్ సూచనల మేరకు వైసీపీ ఎంపీలు వ్యవహరించారు. అమరావతి నాశనమై పోయినా పర్వాలేదనుకున్నారు. కానీ మనం దానిపై శాసనం చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వ రాజ ముద్రతో 5 కోట్ల ఆంధ్రుల ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాయి. అమరావతిని ఇక భవిష్యత్తులో ఎవరూ ఏమీ చేయలేరు.”అని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
ప్రతీ ఇటుకా పేర్చుకుంటూ వచ్చాం…
“విభజన సమయంలో రెండు రాష్ట్రాల్లోనూ భావోద్వేగాలు ఉన్నాయి. చాలా అంశాలకు పరిష్కారం చూపకుండానే విభజన జరిగింది. ఆర్ధిక కష్టాలు, రాజధాని లేదు, వనరులు లేవు అన్నీ ఇబ్బందులే. అప్పాయింటెడ్ డే జూన్ 2 కంటే ముందే పోలవరం 7 ముంపు మండలాలు ఏపీలో కలపాలని కోరాను. రాజధాని లేకుండా విజయవాడకు వచ్చాం. ఇరిగేషన్ ఎసఈ కార్యాలయంలో ఆఫీసు ఏర్పాటు చేసుకుని, బస్సులో బస చేసి కార్యకలాపాలు ప్రారంభించాం. శివరామకృష్ణన్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేస్తే 46 శాతం మంది ప్రజలు విజయవాడ- గుంటూరు మధ్య రాజధానికి ఏర్పాటుకు అనుకూలమన్నారు. ఆ సంకల్పంలో భాగమే ఉత్తరాంధ్ర-దక్షిణాంధ్ర, రాయలసీమల మధ్య సమాన దూరంలో ప్రాంతాన్ని ఎంపిక చేశాం. కనెక్టివిటీ పరంగా, భౌగోళికంగా, చారిత్రత్మక ప్రదేశంగా రాజధానిగా ఎంపిక చేసి ప్రణాళికలు చేశాం. అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక, భూ సమీకరణ, సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేశాం. సింగపూర్ ఒక్క పైసా తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇచ్చింది. పిలుపు ఇవ్వగానే 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలను ఇచ్చారు. ప్రభుత్వ భూమి కూడా కలిపితే 54 వేల ఎకరాలు అందుబాటులోకి వచ్చింది. అభివృద్ధిలో రైతులను కూడా భాగస్వాములను చేసేలా వినూత్నమైన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ తెచ్చాం. తమ భవిష్యత్తు బాగుంటుందని రైతులకూ విశ్వాసం కలిగింది.
జరీబు భూములిచ్చిన వారికి 450 కమర్షియల్, 1000 గజాలు రెసిడెన్షియల్ రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చాం. ప్రతీ ఏటా యాన్యుటీ కూడా రైతులకు ఇస్తున్నాం. భూమి లేని రైతులకు కూడా పెన్షన్లు అదనంగా ఇస్తున్నాం. భూములు ఇచ్చిన వారంతా సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతోనే ఇవన్నీ చేశాం. సిటీ రీజియన్ 56 మండలాలు, 8603 చదరపు కిలోమీటర్ల మేర, 117 చదరపు కిలోమీటర్ల క్యాపిటల్ సిటీని నిర్దేశించాం. సింగపూర్ మాస్టర్ ప్లాన్ తో నిర్మాణం ప్రారంభించేందుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. దేశంలో ఉండే పవిత్రమైన దేవాలయాలు, ప్రార్ధనా లయాల నుంచి మట్టిని, నదుల నుంచి నీటిని తెప్పించాం. ప్రధాని కూడా పార్లమెంటు నుంచి మట్టిని, యమునా జలాలను తీసుకువచ్చారు. పార్లమెంటు, యావత్ దేశం అంతా అండగా ఉంటుందనే ఆ మట్టిని, నీటిని తెచ్చినట్టు ప్రధాని చెప్పారు. 11 నెలల్లో సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించాం. 2016 జూన్ నుంచే ప్రభుత్వ కార్యకలాపాలన్నీ అమరావతి నుంచే నిర్వహించాం. 9 నగరాలుగా అమరావతిని నిర్మించాలని ప్రణాళికలు చేశాం. నాలుగు ఆఫీసు భవనాలు నిర్మిస్తే రాజధాని అయిపోదు. భవిష్యత్ తరాలు శాశ్వతంగా రాజధాని ప్రాంతాన్ని వినియోగించుకోవాలి. ప్రపంచ శ్రేణి ఆర్కిటెక్టులను నియమించాం. నార్మన్ ఫోస్టర్స్ ద్వారా బ్లూ గ్రీన్ సిటీగా అమరావతిని అధునాతన నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేశాం. స్టాక్ ఎక్స్ఛేంజిలో అమరావతి బాండ్స్ విడుదల చేస్తే గంటలో రూ. 2 వేల కోట్లు వచ్చాయి. అంతటి క్రెడిబులిటిని అమరావతి నగరం సొంతం చేసుకుంది”అని సీఎం చంద్రబాబు వివరించారు.
వైసీపీవి కుళ్లు… కుట్రలు.. కుతంత్రాలు
“రాజధాని విషయంలో వైసీపీ చాలా డ్రామాలు ఆడింది. అమరావతిని వ్యతిరేకించినా గత పాలకులు గతిలేని పరిస్థితిలో ఇక్కడినుంచే పాలన సాగించారు. వాళ్లు అడుగడుగునా కుట్రలు, కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు. అమరావతికి అనుకూలంగా అడుగుపడిన సమయంలోనే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. అమరావతిపై వ్యతిరేకతతో ప్రపంచబ్యాంకుకు కూడా లేఖలు రాశారు. అరాచకం సృష్టించే ప్రయత్నించారు. అరటి తోటలు తగుల బెట్టారు. తప్పుడు రిపోర్టులు తెప్పించారు. ఎడారి, శ్మశానం అన్నారు. భూకంపాలు వస్తాయన్నారు. ఎన్ని విధాల రాజధానిని నష్టపరచాలో అంతా చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. సింగపూర్ దేశం పైనా అభాండాలు వేసి ఒప్పందాలు రద్దు చేశారు. అమరావతి బ్రాండ్ దెబ్బతీశారు. విట్,ఎసఆరఎం లాంటి ప్రతిష్టాత్మక వాటి పేర్ల చివరిలో అమరావతి క్యాంపస్ అని పెడితే దానిని తీసేయమని వారిపై ఒత్తిడి తెచ్చారు. 1,307 ఎకరాలను 113 సంస్థలకు రాజధానిలో భూములు కేటాయించాం. వేల మంది కార్మికులతో ముమ్మరంగా పనులు జరిగే సమయంలో వాటిని ఆపేశారు. మూడు రాజధానుల ప్రకటన చేసి.. మూడు ప్రాంతాల్లో వివాదం సృష్టించేలా ప్రయత్నించారు. హైకోర్టు కూడా దీనిపై వారికి మొట్టి కాయలు వేసింది. అమరావతి రైతుల ఉద్యమానికి కౌంటర్ గా పెయిడ్ ఆర్టిస్టులతో క్యాంపులు పెట్టించారు. ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు కేసులు పెట్టించారు. నాపై రాళ్లు వేయించారు. అదేమంటే భావప్రకటన స్వేచ్చ అని డీజీపీతో మాట్లాడించారు. పవన్ కల్యాణ్ వస్తే ముళ్లకంచెలు అడ్డంపెట్టారు. రాజధానిపై కుట్రలు చేసిన వ్యక్తిని, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వ్యక్తిని నియంత అనాలా? లేక ఏమనాలో తెలీటం లేదు. ఈ కుట్రలను కుతంత్రాలను ప్రజలు విశ్వసించలేదు. మాకు మళ్లీ ప్రజలు పట్టం కట్టారు” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
అమరావతి భవిష్యత్ నగరం
“భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన తొట్టతొలి రాష్ట్రానికి రాజధాని లేకుండాపోయింది. అందుకే ఈ తీర్మానం పెట్టి పార్లమెంటుకు పంపితే.. దానికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. విద్య, ఉద్యోగం, విజ్ఞానంలాంటి అంశాలకు నెర్వ్ సెంటర్గా అమరావతి మారుతుంది. దేశానికి ఒక ఫ్యూచర్ సిటీ కూడా అవసరం. అదే అమరావతి. అమరావతి అభివృద్ధితోపాటు విశాఖ, తిరుపతిలాంటి ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తున్నాం. రీజియన్లుగా ఆయా ప్రాంతాల్లో వేర్వేరు పరిశ్రమలు వస్తున్నాయి. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్లాంటి పరిశ్రమలు వస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి నీటి భద్రత తీసుకువస్తాం. ఒంటిమిట్టలో శ్రీరామ కల్యాణంలో పాల్గొన్నవేళ లోక్సభలో అమరావతి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందింది. నిన్న రాజ్యసభలో బిల్లు పాస్ అయినవేళ పోలవరం డయాఫ్రామ్ వాల్ కూడా పూర్తి అయ్యింది. శుభపరిణామాలు వరుసగా జరుగుతున్నాయి. గత పాలకులు నిలిపిన అమరావతి నిర్మాణాల్ని మళ్లీ మేం అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ చేతుల మీదుగా పునర్నిర్మాణం మొదలు పెట్టాం. స్వాతంత్య్ర భారత దేశంలో మూడు రాజధానుల డ్రామా అడిన వ్యక్తులు ఎవరూ లేరు. అమరావతి దేశానికి ప్రైడ్గా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్కు గుండె, ఆత్మ ఇది. ఎవరు ఏమి చేసినా అమరావతి సంకల్పం ఆగదు.
ప్రపంచ బ్యాంకు, హడ్కో, ఏడీబీ నుంచి ఫైనాన్షియల్ టైఅప్ ఉంది. ప్రస్తుతం రూ.56 వేల కోట్ల విలువైన పనులు రాజధానిలో జరుగుతున్నాయి. 2028 నాటికి రాజధానిలో ప్రధానమైన పనులన్నీ ఓ కొలిక్కి వస్తాయి. రాజధానికి లక్షల కోట్లు కావాలని కొందరు మాట్లాడుతున్నారు. కానీ నిర్మాణం ఒక్క రోజులో పూర్తి అయ్యేది కాదు. ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ ఇలాంటి వేర్వేరు ప్రాజెక్టులు నిర్మితం అవుతూనే ఉంటాయి. క్రమానుగుణంగా రాజధాని నిర్మాణం, అభివృద్ధి జరుగుతుంది. కార్యకలాపాలు, ఆర్ధిక లావాదేవీలతోనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. హైదరాబాద్ ఒక్కటే తెలంగాణాలో గరిష్ట ఆదాయాన్ని ఆర్జించి పెడుతోంది. మౌలిక సదుపాయాల నిర్మాణం పూర్తి అయితే అభివృద్ధి ఆటో పైలట్ గా జరిగిపోతుంది. ప్రపంచంలోని వేర్వేరు ప్రాజెక్టులు ఈ మోడల్ లోనే అభివృద్ధి అయ్యాయి. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. దానికి చోదకశక్తిగా అమరావతి నిలుస్తుంది. 2029లో ప్రధాని మోదీతో ఈ ప్రాజెక్టులన్నీ ప్రారంభింపచేస్తాం. అమరావతి అజేయం, శాశ్వతం, అన్ స్టాపబుల్. దీనికి అడ్డంకి కలిగించాలని చూస్తే వారివి పగటి కలలుగానే మిగిలిపోతాయి. అమరావతి ప్రజా రాజధాని. రాష్ట్రంలోనూ, రాజధానిలోను ప్రజలు నిత్యం ఆనందంగా ఉండేలా చూడాలని నేను నిత్యం భగవంతుడిని వేడుకుంటూనే ఉంటాను” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
బుద్ది మార్చుకోని వైసీపీ
“ప్రజలు, దేశం యావత్తూ అమరావతివైపుంటే… వైసీపీ నేతలు ఇంకా అహంకారం ప్రదర్శిస్తున్నారు. ఉభయ సభల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందితే ఓర్వలేక పోతున్నారు. ఎక్కడ కూర్చొంటే అక్కడే రాజధాని ఏమిటి…? పార్లమెంటు ఓ చట్టం చేస్తే దానిని అమలు చేయాల్సిన రాజకీయ పార్టీలు నా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా మంటే ఎలా…? ప్లాన్ ఏ, ప్లాన్ బీ అంటూ మాట్లాడటం ఏమిటి..? ప్లాన్ ఏలో మూడు ముక్కలాటలు, ప్లాన్ బీలో మావిగన్. ఇలాంటి విపరీత మనస్తతత్వం ఏమిటి..? దేశమంతా ఆంధ్రప్రదేశ్ కు మద్దతు పలికి అమరావతి నిర్మాణం కావాలని, దేశాభివృద్ధికి దోహదం చేయాలని సంఘీభావం తెలియచేశారు. వారందరినీ తప్పుపట్టేలా వైసీపీ వింత ప్రవర్తన ఉంది. ఇంత కుట్ర, విధ్వంసం చేసి మళ్లీ ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు జాతి చాలా సమస్యల్ని ఎదుర్కోంటూనే ఉంది. మొన్నటి వరకూ మనకు ఉనికి లేని పరిస్థితి. ఇప్పుడు మన వాళ్లే ఏపీకి ఉనికి లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. బెదిరింపులతో పెట్టుబడిదారులను తరిమి వేయటం నీచాతి నీచం. అప్రజాస్వామికంగా వ్యవహరించే వారిపై చట్టపరంగా కఠినంగా ముందుకు వెళ్తాం. చరిత్ర ఎప్పుడూ సానుకూల, వ్యతిరేక అంశాలను గుర్తుంచుకుంటూనే ఉంటుంది. అలాంటి వారిని చరిత్ర క్షమించదు. ఇలాంటి వ్యక్తుల విధానాల వల్ల ఏపీ అప్పుల్లో కూరుకుపోయింది. దక్షిణాదిలోనే తలసరి ఆదాయంలో అతితక్కువ స్థాయిలో ఉంది. తుగ్లక్ లు కొత్తగా పాలనలోకి వచ్చి రాజధానిని ప్రతీ సారీ మారుస్తామంటే ఎలా…? దీనికి అర్ధం ఉంటుందా…? శాశ్వత రాజధాని అని పార్లమెంటు చట్టం చేస్తే దానిని కూడా మార్చేస్తామని మాట్లాడతారా…? ఇదేం రాజకీయం…? ఇలాంటి నాయకులు ఉండటం రాష్ట్ర దౌర్బాగ్యం. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూడా అవహేళన చేసి మాట్లాడతారా…? ప్రజలకు, ప్రజాధనానికి నష్టం జరిగేలా వ్యవహరిస్తారా…? ప్రజలకు సంక్షేమం, జీవన ప్రమాణాలను కల్పించటంపైనే ఎవరైనా మాట్లాడుకోవాలి. కానీ ఇలాంటి వారిపట్ల మాట్లాడటం కూడా అనవసరం” అని సీఎం అభిప్రాయపడ్డారు.
కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది.
“ప్రపంచం అంతా ఒకవైపు మాట్లాడితే… ఒక పార్టీ, వ్యక్తి మాత్రం వేరేవిధంగా మాట్లాడుతున్నారు. అమరావతి అని పలకటం కూడా వారికి ఇష్టం లేదు. అందుకే ఈ తరహాగా వ్యవహరిస్తున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామికి ఘోర అపచారం చేసి సమర్ధించుకున్న వాళ్ల ప్రవర్తనను ఇంకేం ఊహిస్తాం. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అంతా కలిసి నిర్ణయిస్తే.. మళ్లీ ఆ చట్టాన్ని మార్చే ప్రయత్నం చేస్తారా…? అలాంటి అవకాశమే లేదు. గత పాలకులు 5 ఏళ్ల కాలంలో విభజన హామీల్లో ఒక్కటీ సాధించ లేకపోయారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరానికి, అమరావతికి, విశాఖ స్టీల్ ప్లాంట్ కు, రైల్వే జోన్ కు, రాయలసీమ హార్టీ కల్చర్ హబ్ కు నిధులు సాధించగలిగాం. డబుల్ ఇంజన్ సర్కారుగా కేంద్రం, రాష్ట్రం కలసి పనిచేస్తున్నాం. ఏపీకి రావాల్సిన నిధులన్నీ వస్తూనే ఉన్నాయి. విభజన కంటే ఏపీకి జరిగిన నష్టం వైసీపీ హయాంలోనే ఎక్కువ జరిగింది. 30 ఏళ్లు వెనక్కివెళ్లాం. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టిమరీ అప్పులు తెచ్చారు. మేం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకుని పాలన సాగిస్తున్నాం. ఎక్కువ వడ్డీలకు తెచ్చిన అప్పులను రీ షెడ్యూలు చేసుకుని భారం తగ్గించుకుంటున్నాం. ఒక వ్యక్తి వచ్చి పిచ్చి చేష్టలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు” అని ముఖ్యమంత్రి అన్నారు. అంతకుముందు పార్లమెంటు ఉభయ సభల్లోనూ అమరావతికి చట్టబద్దత బిల్లు ఆమోదం పొందటంపై ముఖ్యమంత్రికి మీడియా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వారికి మిఠాయిలుపంచి సంతోషాన్ని వ్యక్తం చేశారు.














