సింధనూరు (చైతన్య రథం): కర్ణాటకలో ఏపీ విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ శనివారం పర్యటించారు. రాయచూర్ జిల్లా సింధనూరు గంగావతి రోడ్డు హోసళ్లీ క్యాంపులోని తెలుగు సంఘం కళ్యాణమండపంలో నూతనంగా ఏర్పాటుచేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్.డీ కుమారస్వామి, కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్తో కలిసి మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. ముందుగా కళ్యాణ మండపం ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్కు నిర్వాహకులు, స్థానిక తెలుగుసంఘం నాయకులు, తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపట్ల నిర్వాహకులను అభినందించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిన సమయంలో సింధనూరు, రాయచూర్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు అండగా నిలిచారు. మీ రుణం తీర్చుకునేందుకే ఇక్కడకు వచ్చాను. తెలుగువారు ఎక్కడున్నా టీడీపీ అండగా ఉంటుంది. కుమారస్వామి పక్కన నిల్చునే అదృష్టం నాకు కలిగింది. తెలుగువారి మద్దతకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మంత్రి నారా లోకేష్ను శాలువా, ప్రత్యేక జ్ఞాపితకో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్ తదితరులు పాల్గొన్నారు.
















