- ఉత్తరాంధ్ర అభివృద్ధికి సీఎం ప్రత్యేక ప్రణాళిక
- గజపతినగరంలో 10వేల ఉద్యోగాల భర్తీ లక్ష్యం
- రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవం సంతోషం
- దశాబ్దాలనుండి రోడ్లు లేని కొత్తపాలెం
- జె గుమడం గ్రామాలలో రోడ్లు ప్రారంభం
- కూటమి నేతల ఆధ్వర్యంలో విజయోత్సవం
- యువగళం హామీల పరిష్కారానికి మంత్రి లోకేష్ కృషి
- వెల్లడించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
బొండపల్లి (చైతన్య రథం): కూటమి ప్రభుత్వం రెండేళ్ల సమయంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ.. చేపట్టిన రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవ సభా సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఉందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం బొండపల్లి మండలం జె గుమడం గ్రామంలో విజయోత్సవ సభా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రూ.2 కోట్ల 34 లక్షలతో నిర్మించిన కొత్తపాలెం-జీడిపాలెం రోడ్డు, 50 లక్షలతో నిర్మించిన జె గుమడం రోడ్డు ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. దశాబ్దాల కాలం నుంచి రోడ్లు లేని గ్రామాలకు రోడ్డు నిర్మాణంతో మంత్రికి జేజేలు పలుకుతూ, తీన్మార్ వాయిద్యాలతో, మహిళలు మంగళహారతులు పడుతూ స్వాగతం పలికారు.
సభా ప్రాంగణానికి మంత్రి సైకిల్పై వచ్చారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాల ఫోటో ప్రదర్శన, ప్రకృతి వ్యవసాయ పంటల ప్రదర్శన, నవధాన్యాల సాగు ప్రదర్శన, అంగన్వాడి చిన్నారులకు అందించే పోషకాహారాల ప్రదర్శన, వైద్య సిబ్బంది ప్రదర్శనతో పాటు ప్రముఖ కళాకారుడు జానకి రాము రేలారే రేలారే జానపద గేయాల ప్రదర్శన ప్రజలను విశేషంగా అలరించింది. ఈ సందర్భంగా లబ్ధిదారులను శాలువాలతో మంత్రి కొండపల్లి సత్కరించారు.
ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు మండలాలకు ప్రభుత్వం నుంచి వచ్చిన అభివృద్ధి కార్యక్రమాల నిధులను తెలియపరిచారు. గంట్యాడ మండలం తరపున పార్టీ అధ్యక్షులు భాస్కర నాయుడు ఆధ్వర్యంలో భారీ గజమాలతో మంత్రి కొండపల్లిని సత్కరించి నాగలి బహుకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని మోడీ నాయకత్వంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డబల్ ఇంజిన్తో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. రెండు సంవత్సరాల కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధితో ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టి కాంగ్రెస్ చేసిన నష్టంతో పాటు వైసీపీకి ఒక్క ఛాన్స్తో రెండింతల నష్టం జరిగిందని, వైసీపీ 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని ఆంధ్ర ప్రజలపై మోపిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రతినిత్యం ప్రజల్లో ఉండాలని, సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించాలని, ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారన్నారు.
వైసీపీ ఐదేళ్లలో ఆంధ్రాకు చేసింది సున్నా
“వైసీపీ చేయాల్సింది రెండేళ్ల వెన్నుపోటు కార్యక్రమం కాదు. ఐదేళ్లలో ఆంధ్రాకు చేసింది శూన్యం” అన్న కార్యక్రమం నిర్వహించాలని ఎద్దేవా చేశారు. యువగళం కార్యక్రమంలో వచ్చిన ప్రతి సమస్యను మంత్రి లోకేష్ సారధ్యంలో పరిష్కారానికి కృషి చేస్తున్నారని, ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమన్వయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం, అనకాపల్లిలో నూతన స్టీల్ ప్లాంట్ నిర్మాణం, భోగాపురం ఎయిర్పోర్ట్ సాధన, వైజాగ్లో గూగుల్ వంటి సంస్థలను కేంద్రం సహకారంతో తీసుకురావడం జరిగిందన్నారు. విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జీడి గింజల ఇండస్ట్రీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఈ ప్రాంతంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న మక్కువ తెలియజేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో గజపతినగరంలో పదివేల ఉద్యోగాల కోసం ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
వైసీపీ ప్రభుత్వంలో ఆస్తులు దోచుకుంటారన్న భయంతో జనం
పార్టీ జిల్లా అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రజల ఇళ్లు, ఆస్తులు దోచుకుంటారని భయంతో ఉండేవారని, భావితరాల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని మాట్లాడుతూ దేశ ప్రజల సహకారంతో మోడీ సర్కార్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని రికార్డు సాధిస్తే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల సహకారంతో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోవడం గర్వంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ అనేక పథకాలను అందించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ ముర్రాపు సురేష్ మాట్లాడుతూ విధ్వంస పాలనకు చరమగీతం పాడి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం టీచర్లను వైన్ షాపుల దగ్గర కాపలా పెడితే, డీఎస్సీ ద్వారా అదే ఉపాధ్యాయులకు భవిష్యత్తు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు.
జిల్లా బీజేపీ అధ్యక్షులు రాజేష్ వర్మ మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రజా సేవకుడిగా పనిచేస్తుంటే, నియోజకవర్గంలో కొండపల్లి శ్రీనివాస్ సేవకుడిగా పనిచేస్తున్నారని, అయోధ్య నిర్మాణంతో పాటు ఆపరేషన్ సింధూర్ వంటి కార్యక్రమాలను రూపొందించిన రూపకర్త ప్రధానమంత్రి మోడీ అన్నారు.
టీడీపీ సీనియర్ నాయకులు మక్కువ శ్రీధర్ మాట్లాడుతూ ఇటీవల విడుదలైన పెద్ది సినిమాలో హీరో ఒక కుగ్రామానికి రోడ్డు కోసం పోరాడి హీరో అయితే, ప్రజలు అడిగిందే తడువుగా అటువంటి గ్రామాలకు రోడ్లు వేసి ఈ ప్రాంత హీరో పెద్ది కొండపల్లి శ్రీనివాస్ అని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి అభివృద్ధి ప్రణాళికను, అభివృద్ధి వివరాలను సభా సమావేశంలో ప్రజలకు తెలియజేశారు. సమావేశానికి ముందు మంత్రి కొండపల్లి రైతులతో, మత్స్యకారులతో సమావేశమై సమస్యలను తెలుసుకున్నారు. నియోజకవర్గ ఇంచార్జి భగ్గు అర్చన, తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, టీడీపీ సీనియర్ నాయకులు కొండపల్లి కొండల రావు, మండల పార్టీ అధ్యక్షులు చప్ప చంద్రశేఖర్, రాపాక అచ్చంనాయుడు, కొండపల్లి భాస్కరనాయుడు, పోలిపర్తి స్వామినాయుడు, సొసైటీ చైర్మన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, కూటమి నాయకులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

















